You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ఇటలీలో 30,201, బ్రిటన్‌లో 31,315, అమెరికాలో 76,101 కోవిడ్ మృతులు...

బ్రిటన్ తరువాత కోవిడ్ మృతుల్లో 30 వేల మార్క్‌ను ఇటలీ దాటింది. అమెరికాలో కరోనావైరస్ సంక్రమణ వేగం తగ్గడం లేదు. ఈ దేశంలో ఇప్పటికే 12,63 లక్షల కేసులు నమోదయ్యాయి. 75 వేలకు పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 38.89 లక్షల కోవిడ్ కేసుల్లో ఇప్పటివరకు 2.70 లక్షల మరణాలు నమోదయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. యూరప్‌లో ప్రతిరోజూ మరణాలు, కానీ తగ్గిన సంఖ్య

    ఫ్రాన్స్ లో బుధవారం 278 మంది చనిపోగా, గురువారం మృతుల సంఖ్య 178కి తగ్గింది. ఫ్రాన్స్ ప్రధాని లాక్‌డౌన్‌ను కొంత సడలిస్తామని చెప్పారు. కానీ పారిస్, ఆగ్నేయ ప్రాంతాల్లో ఇది కొనసాగనుంది.

    ఇటలీలో కూడా కోవిడ్-19 మృతుల సంఖ్య తగ్గుతోంది. బుధవారం దేశంలో 274 మంది చనిపోగా, గురువారం ఆ సంఖ్య దానికంటే తగ్గింది.

    స్పెయిన్‌లో బుధవారం కరోనాతో 244 మంది చనిపోగా, గురువారం ఆ సంఖ్య 213కు తగ్గింది. దేశంలో రాకపోకలు నియంత్రించేందుకు అత్యవసరస్థితిని మరో రెండు వారాలు పెంచాలని స్పెయిన్ నిర్ణయించింది.

    యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన పోలెండ్‌లో మరణాల రేటు మిగతా దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంది. ఇక్కడ గత 24 గంటలుగా 324 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ 22 మంది చనిపోయారు.

  2. కెనడాలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్ వేతనాల పెంపు

    కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో 3 బిలియన్ డాలర్ల ఫండ్ ప్రకటించారు. ఈ ఫండ్‌ను ఫ్రంట్‌లైన్ వర్కర్స్ వేతనాల పెంపు కోసం ఉపయోగిస్తారు.

    “ఈ దేశం ముందుకు వెళ్లేందుకు మీరు మీ ప్రాణాలనే ప్రమాదంలో పెడుతున్నారు. వేతనం పెంచడానికి మీరు అర్హులు” అని ట్రుడో గురువారం అన్నారు.

    ప్రధాని అందించిన నిధులను దేశంలోని అన్ని ప్రాంతాలకు పంచుతారు. ఆ తర్వాత వారి వేతనాలను నిర్ణయిస్తారు.

    “అత్యవసర సిబ్బంది తరచూ కనీస వేతనాలతో పనిచేస్తుంటారు. వేతనాలు పెంచడానికి కచ్చితంగా వారు అర్హులే. కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది” అని ట్రుడో అన్నారు.

  3. కరోనావైరస్: వైట్‌హౌస్‌లో ఇక రోజుకు ఒకసారి కరోనా పరీక్షలు

    వైట్‌హౌస్‌లో చేసే కరోనావైరస్ పరీక్షలను పెంచుతున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మీడియాకు చెప్పారు.

    ట్రంప్‌ దగ్గర పనిచేసే ఒక సహాయకుడికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ వారానికి ఒక్క రోజు టెస్టులు చేసేవారు, ఇకమీదట రోజుకు ఒకసారి చేస్తారు అని అధ్యక్షుడు చెప్పారు.

    “నేను ఆయనతో చాలా తక్కువ కాంటాక్టులో ఉన్నాను, బుధవారం, గురువారం నాకు పరీక్షలు చేశారు” అని ట్రంప్ చెప్పారు.

    “వైట్ హౌస్‌లో పనిచేసే యూఎస్ మిలిటరీ సభ్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది” అని అంతకు ముందు ప్రెస్ సెక్రటరీ హోగవ్ గిడ్లే చెప్పారు.

    సీఎన్ఎన్ వివరాల ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ట్రంప్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు.

  4. లాక్‌డౌన్‌లో విఫలమైతే ఆఫ్రికాలో 1.90 లక్షల మందికి పైగా చనిపోవచ్చు-WHO

    ఆఫ్రికాలో లాక్‌డౌన్ అమలు విఫలమైతే కోవిడ్-19 వల్ల ఆఫ్రికాలో 1,90,000 మంది చనిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక అధ్యయనంలో చెప్పింది.

    ప్రిడిక్షన్ మోడల్, ఆఫ్రికాలోని 47 దేశాల విశ్లేషణ ఆధారంగా ఈ అంచనాను రూపొందించారు. అల్జీరియా, దక్షిణాఫ్రికా, కామరూన్‌లో లాక్‌డౌన్ అమలు చేయకపోతే అక్కడ కరోనా ముప్పు తీవ్రంగా ఉంటుందని చెప్పారు.

    రాబోవు రోజుల్లో జనం ఆస్పత్రులకు భారీగా వస్తే, వైద్య సేవలు అందించడం మరింత సవాలుగా మారవచ్చు అని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది.

    ఆఫ్రికా ప్రాంతంలో 10 లక్షల మందికి సగటున 9 ఐసీయూ వార్డులే ఉన్నట్లు 2020 మార్చిలో జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. దీంతో ఆస్పత్రుల సామర్థ్యం పెంచాలని కూడా డబ్ల్యుహెచ్ఓ తమ అధ్యయనంలో సూచించింది.

    “ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేయకపోతే కోవిడ్-19 మరి కొన్నేళ్లపాటు మన జీవితాల్లో ఉండిపోవచ్చు. టెస్టులు చేయడం, ట్రేస్ చేయడం, ఐసొలేట్ చేసి, చికిత్స చేయడం మనకు చాలా అవసరం” అని డబ్ల్యుహెచ్ఓ ఆఫ్రికా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ మాట్షిడిసో రెబెక్కా అన్నారు.

  5. అబుధాబి నుంచి కొచ్చిన్ చేరుకున్న 181 మంది భారతీయులు

    ప్రత్యేక విమానాల్లో అబుధాబి నుంచి కేరళలోని కొచ్చిన్ తీసుకొచ్చిన 181 మందికి థెర్మల్ స్క్రీనింగ్ చేయడంతో ఐదుగురికి కోవిడ్-19 లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని అలువ జిల్లా ఆస్పత్రిలోని ఐసొలేషన్ సెంటర్‌కు తరలించారు.

    రాత్రి అబుధాబి నుంచి వచ్చిన వారిలో 49 మంది గర్భిణులు, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిని కార్లలో వారి ఇళ్లకు పంపించారు. హోం క్వారంటైన్‌లో ఉండాలని వారికి సూచించారు. మిగతావారిని ఆర్టీసీ బస్సుల్లో వారి వారి జిల్లాల్లో ఉన్న క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

    ప్రత్యేక విమానాల్లో వివిధ దేశాల నుంచి తీసుకొస్తున్నవారికోసం త్రిచూర్ జిల్లాలోని గురువాయూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఒక క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసింది.

  6. హైదరాబాద్ నుంచి రాజస్థాన్ చేరుకున్న 921 మంది కార్మికులు

    హైదరాబాద్‌ నుంచి 921 వలస కార్మికులతో రాజస్థాన్ బయలుదేరిన శ్రామిక్ స్పెషల్ రైలు ఈరోజు ఉదయం జోధ్‌పూర్ చేరుకున్నట్లు ఏఎన్ఐ తెలిపింది.

  7. అమెరికాలో గత 24 గంటల్లో 2448 మరణాలు

    అమెరికాలో గత 24 గంటల్లో 2,448 మరణాలు నమోదవడంతో అమెరికాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 75543కు చేరినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.

  8. కరోనా లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం. ముఖ్యాంశాలు

    విశ్వ మహమ్మారి కరోనా కల్లోలం కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19 మృతుల సంఖ్య 75 వేలు దాటింది.

    • జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 38,42,731 కరోనా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 2.69 లక్షల మంది మృతిచెందారు.
    • అమెరికాలో మొత్తం 12,54,740 కరోనా కేసులు నమోదవగా, మృతుల సంఖ్య 75,649కు పెరిగింది.
    • బ్రిటన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో మృతుల సంఖ్య 30689కి పెరిగింది.
    • భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53 వేలకు చేరువైంది. ఇప్పటివరకూ మొత్తం 1763 మంది మృతిచెందారు.
    • ఇకతెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలో 3 కేసులు కలిపి కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదుకాగా, కొత్తగా ఇద్దరు చనిపోయారు. వీరితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 38కి చేరింది.
    • తెలంగాణలో కొత్తగా 15 కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1122కు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 29 దగ్గర నిలకడగా ఉంది.