దేశవ్యాప్తంగా మే 11వ తేదీ నుంచి లాక్ డౌన్ను సడలిస్తున్నామని ఫ్రాన్స్
ప్రధాన మంత్రి ఎడౌర్డ్ ఫిలిప్పె తెలిపారు.
లాక్డౌన్ విధించడం వల్ల నెల రోజుల్లో 62 వేల ప్రాణాలను కాపాడగలిగామని
పార్లమెంటులో ఆయన చెప్పారు. అయితే, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా
చూసేందుకు లాక్డౌన్ను సడలించాల్సిన సమయం వచ్చిందని వివరించారు.
‘‘వైరస్తో కలసి బతకడాన్ని మనం నేర్చుకోవాలి’’ అని ఆయన చెప్పారు. వ్యాక్సిన్
లేదా సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి వచ్చే వరకూ ఇది తప్పదన్నారు.
జూన్ నెలాఖరు నాటికి ‘ఒక కొత్త సాధారణ పరిస్థితి’ వస్తుందని ఆయన ఆశాభావం
వ్యక్తం చేశారు.
మే 11వ తేదీ నుంచి నిత్యావసరాలు కాని వస్తువుల దుకాణాలను, మార్కెట్లను
తెరుస్తారు. అయితే బార్లు, రెస్టారెంట్లు మాత్రం మూసే ఉంటాయి.
అయితే, దుకాణాల్లో పనిచేసేవారంతా ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి అని
ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, దుకాణాలకు వచ్చే వారు కూడా ఫేస్ మాస్కులు
ధరించాలని, మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని వివరించింది.
దేశంలో పాఠశాలల్ని కూడా క్రమంగా తెరవనున్నారు. కిండర్ గార్డెన్లు, ప్రైమరీ
స్కూళ్లు తొలుత ప్రారంభమవుతాయి.
కాగా, 11 నుంచి 15 సంవత్సరాల వరకూ విద్యార్థులు ఫేస్ మాస్కులు ధరించడం
తప్పనిసరి కాదని ప్రభుత్వం వెల్లడించింది.
అలాగే, లాక్ డౌన్ సడలింపు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు తమతమ ఇళ్ల నుంచి
బయటకు రావొచ్చు. దీనికి ఎలాంటి అనుమతీ అవసరం లేదు. అయితే తాము బయటకు ఎందుకు
వచ్చిందీ వారు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే, పది మంది వరకూ ప్రజలు
కలుసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
చిన్న పిల్లల ఆలనాపాలనా చూసే క్రెచ్ లను ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం
అనుమతి ఇచ్చింది. అయితే ఒక్కో గ్రూపులో 10 మంది పిల్లలు మాత్రమే ఉండాలని
తెలిపింది.
ఫ్రాన్స్ లో 1,29,859 మందికి కరోనావైరస్ సోకింది. 23,660 మందికి పైగా
చనిపోయారు.