You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో 31,787కి చేరిన కేసులు, వలస కార్మికుల తరలింపుపై కేంద్రం మార్గదర్శకాలు

లాక్‌డౌన్ వల్ల వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, యాత్రికులు, వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

లైవ్ కవరేజీ

  1. పెరూలో కోవిడ్-19 మృతుల గురించి అల్లర్లు, 9 మంది మృతి

    పెరూలోని ఒక జైల్లో జరిగిన గొడవల్లో 9 మంది చనిపోయారని అధికారులు చెప్పారు.

    లిమాలోని కాస్ట్రో కాస్ట్రో జైలులో ఇద్దరు ఖైదీలు కోవిడ్-19తో చనిపోవడంతో ఈ గొడవ మొదలైంది.

    ఈ గొడవల్లో ఇద్దరు ఖైదీలు, ఐదుగురు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు.

    లాటిన్ అమెరికాల్లోని చాలా జైళ్లలో ఖైదీల సంఖ్య విపరీతంగా ఉండడం, సరైన వైద్య సేవలు లేకపోవడంతో తమకు కరోనా వస్తుందేమే అని ఖైదీల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. అది చివరకు గొడవలకు దారితీస్తోంది.

    గత నెలలో కొలంబియాలోని ఒక జైలులో గొడవలు జరగడంతో 23 మందికి పైగా చనిపోయారు.

    ఖైదీలకు మరింత రక్షణ కల్పించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. జైల్లో రద్దీని తగ్గించడానికి బలహీనంగా ఉన్న వారిని తాత్కాలికంగా విడుదల చేయాలని సూచించింది.

  2. తండ్రి అయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    కోవిడ్-19 నుంచి బయటపడి, ఈ వారమే తిరిగి విధుల్లోకి వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ తండ్రి అయ్యారు.

    ఆయన కాబోయే భార్య కేరీ సైమండ్స్ బుధవారం ఉదయం లండన్లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చారు.

    కరోనా సంక్షోభ సమయంలో గత కొన్ని వారాలుగా బోరిస్ జాన్సన్‌ జీవితంలో ఎన్నో జరిగాయి:

    ·27 మార్చి: కరోనా పాజిటివ్

    ·5 ఏప్రిల్: ఆస్పత్రిలో చేరిక

    ·7 ఏప్రిల్: ఐసీయూలో చికిత్స

    ·12 ఏప్రిల్: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

    ·27 ఏప్రిల్: తిరిగి విధుల్లోకి వచ్చారు

    ·29 ఏప్రిల్: తండ్రి అయ్యారు.

  3. యూరప్‌లో కరోనా అప్‌డేట్స్

    జర్మనీ ప్రయాణాలపై ఆంక్షలను కొనసాగించాలని చూస్తుంటే, స్పెయిన్ లాక్‌డౌన్ ఎత్తేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    • జర్మనీ ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ ఆంక్షలను జూన్ 14 వరకూ కొనసాగించబోతోందని ఆ దేశ పత్రిక డెర్ స్పీగెల్ చెప్పింది. విదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు వహించాలని చెబుతోంది. జర్మనీలోని కొన్ని రాష్రాలు జూన్ చివర్లో వేసవి సెలవులు ప్రారంభించాలని చూస్తున్నాయి. దాంతో ఈ హెచ్చరికలు ప్రజల సెలవులపై ప్రభావం చూపిస్తాయేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
    • స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఈరోజు ఉదయం దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ లాక్‌డౌన్ ఎత్తేసే తన ప్రణాళికల గురించి మాట్లాడారు. దీనికి ఒక నియమిత షెడ్యూల్ లేదు. కానీ జూన్ నెలాఖరుకల్లా దేశంలోతిరిగి సాధారణ స్థితి నెలకొంటుందని ఆశిస్తున్నారు.
    • ·స్విట్జర్లాండ్ వైద్య అధికారులు మనవళ్లు, మనవరాళ్లు తమ తాతయ్య, బామ్మలను హత్తుకోవచ్చని చెప్పారు. దేశ ప్రజారోగ్యఅధికారి డానియెల్ కోచ్ ఇప్పటికే ఈ పరిస్థితి వల్ల బాధపడుతున్న వృద్ధులకు కరోనా వైరస్ లేదని తెలిసినప్పుడు, తమ మనవలు, మనవరాళ్లను హత్తుకోకుండా వారిని దూరంగా ఉంచడం తప్పు.
    • ·ఇటలీ తీరంలో లంగరు వేసిన ఒక పడవను కోవిడ్-19 ఆస్పత్రిగా ఉపయోగిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వృద్ధులను వైరస్ వ్యాపించిన వృద్ధాశ్రమాల నుంచి దూరంగా ఇక్కడకు తరలించారు. ఈ నౌక బుధవారం ట్రియెస్టీ నగర తీరానికి వచ్చింది.
  4. వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో పోటీపడనున్న స్ట్రీమింగ్ సినిమాలు

    వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో స్ట్రీమ్ చేసిన సినిమాలు(థియేటర్లలో విడుదల కానివి) కూడా పోటీపడవచ్చని హాలీవుడ్‌లోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ చెప్పింది.

    కరోనా మహమ్మారి కారణంగా ఆస్కార్‌‌కు ఈ మార్పులు చేశారు.

    ఇప్పటివరకూ లాస్ ఏంజెల్స్ కమర్షియల్ థియేటర్లలో విడుదలై, కనీసం వారం పాటు ఆడిన సినిమాలనే ఆస్కార్ బరిలో పోటీపడేందుకు అనుమతించేవారు. .

    కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లు మూతపడడంతో, చాలా సినిమాలను నేరుగా ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీసుల్లో అప్‌లోడ్ చేశారు.

    "సినీ మాయను ఆస్వాదించాలంటే దానిని థియేటర్లో చూడడం కంటే మించిన అనుభవం ఏదీ ఉండదని అకాడమీ భావిస్తోంది" అని ప్రెసిడెంట్ డేవిడ్ రూపిన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాన్ హడ్సన్ అకాడమీ అన్నారు.

    "దానిపట్ల మా నిబద్ధత ఎప్పటి మారదు, అలాగే ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల మా అవార్డు బరిలో నిలిచే సినిమాల నియమాలను తాత్కాలికంగా మార్చాం" అన్నారు.

    మహమ్మారి ముగిసిన తర్వాత సంప్రదాయ నిబంధనలను మళ్లీ కొనసాగిస్తాం న్నారు.

  5. జర్మనీలో కొత్తగా 202 మంది మృతి

    అధికారిక గణాంకాల ప్రకారం జర్మనీలో 1304 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 202 మంది చనిపోయారు.

    ప్రస్తుతం జర్మనీలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ రోగుల సంఖ్య లక్షా 57 వేలు దాటింది.

    దేశంలో మొత్తం మృతుల సంఖ్య 6115కు చేరింది. యూరప్‌లోని పొరుగు దేశాలతో పోలిస్తే జర్మనీలో ఈ గణాంకాలు ఇప్పటికీ చాలా తక్కువే.

  6. త్వరలో రోజుకు 50 లక్షల టెస్టులు చేస్తాం-ట్రంప్

    అమెరికాలో కరోనా కేసులు పెరగడానికి రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి జనాభా ఎక్కువ కావడం, రెండోది అక్కడ భారీ స్థాయిలో పరీక్షలు చేయకపోవడం

    కోవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ ప్రకారం అమెరికాలో గత రెండు నెలల్లో 57 లక్షల టెస్టులు జరిగాయి. ఈ గణాంకాలు వినడానికి బాగానే ఉన్నాయి.

    కానీ సైన్స్ ఆన్‌లైన్ సైట్ అవర్ వరల్డ్ ఇన్ డేటా మాత్రం అమెరికాలో ప్రతి వెయ్యి మందిలో 16.3 టెస్టులు జరిగాయని, అది ఇటలీకంటే తక్కువ అని చెప్పింది. ఇటలీలో ప్రతి వెయ్యి మందిలో 30.6 టెస్టులు జరిగాయి.

    అమెరికా త్వరలో ఒక రోజులో 50 లక్షల టెస్టులు చేయగలదని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మేం చాలా త్వరలో ఆ స్థితికి చేరుకోబోతున్నాం అన్నారు.

    కొన్ని నివేదికలను బట్టి అమెరికాలో ప్రస్తుతం ప్రతి రోజూ రెండు లక్షల టెస్టులు జరుగుతున్నాయి.

  7. అమెరికాలో వియత్నాం యుద్ధం కంటే ఎక్కువ మరణాలు

    అమెరికాలో కరోనావైరస్ వల్ల 58 వేల మందికి పైగా చనిపోయారు. ఒక నెలకంటే కాస్త ఎక్కువ సమయంలో మొత్తం 58,355 మంది మృతిచెందారు.

    అమెరికాలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండు దశాబ్దాలు కొనసాగిన వియత్నాం యుద్ధంలో చనిపోయిన వారికంటే ఎక్కువ ఉంది. వియత్నాం యుద్ధంలో మొత్తం 58,220 మంది మరణించారు.

    “ఇంకా ముప్పు తొలగిపోలేదని, సమర్థవంతమైన చికిత్స లేకుండా రాబోవు నెలల్లో మరింతమంది ప్రాణాలు కోల్పోవచ్చు” అని అమెరికా అధ్యక్షుడు మెడికల్ అడ్వైజరీలోని డాక్టర్ ఆంథొనీ ఫుకీ హెచ్చరించారు.

  8. పీపీఈ కొరత ఉందన్న పుతిన్, రష్యాలో లాక్‌డౌన్ పొడిగింపు

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశంలో కరోనావైరస్ నుంచి కాపాడుకోడానికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) కొరత ఉందని అంగీకరించారు.

    భారీ స్థాయిలో ఉత్పత్తి చేయకుండా, దిగుమతి చేసుకోకుండా ఆ లోటు భర్తీ చేయలేమని చెప్పారు.

    "మొదటితో పోలిస్తే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. కానీ అవి మా అవసరాలకు సరిపోవడం లేదు. ఉత్పత్తి, దిగుమతి పెంచినా ఇప్పటికీ వాటి కొరత ఉంది" " అని పుతిన్ అన్నారు.

    రష్యాలో ప్రస్తుతం వైద్య సిబ్బందికి ప్రతి రోజూ లక్ష పీపీఈలు సిద్ధం చేస్తున్నారు. మార్చిలో రోజూ 3 వేల పీపీఈలే తయారు చేసేవారు. మాస్కులు కూడా ఇప్పుడు ప్రతి రోజూ 85 లక్షలు ఉత్పత్తి చేస్తున్నారు.

    రష్యాలో కరోనావైరస్ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయికి చేరలేదని, అందుకే ప్రజలకు మాస్కుల అవసరం లేదని పుతిన్ చెప్పారు.

    రష్యా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వైద్య సిబ్బంది పీపీఈ కొరత ఉందని ఫిర్యాదు చేస్తున్నారు.

    రష్యా లాక్‌డౌన్‌ను మే 11 వరకూ పొడిగించింది. అయితే పుతిన్ మే 5 వరకూ దానిని క్రమంగా తొలగిస్తామని చెప్పారు. వైరస్ ముప్పు ఇప్పటికీ ఉందన్నారు.

    రష్యాలో ప్రస్తుతం 93 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 867 మంది చనిపోయారు.

  9. మహమ్మారిని నియంత్రించకపోతే ఒలింపిక్స్ నిర్వహణ కష్టం: జపాన్ ప్రధాని

    కరోనా మహమ్మారిని నియంత్రించకపోతే వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కష్టమవుతుందని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే పేర్కొన్నారు.

    ఒలింపిక్స్ క్రీడలను వాస్తవానికి ఈ ఏడాదే నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణతో 2021 జూలై వరకూ వాయిదా వేశారు.

    అప్పుడు కూడా ఈ క్రీడలు జరుగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    ‘‘ఒలింపిక్స్, పారాలింపక్స్ క్రీడలను పూర్తి రూపంలో నిర్వహించాలని.. క్రీడాకారులు, ప్రేక్షకులు పూర్తి భద్రతతో పాల్గొనే వీలుండాలని మేం చెప్తూ వస్తున్నాం. మహమ్మారిని నియంత్రించకపోతే ఈ క్రీడలను నిర్వహించటం అసాధ్యమవుతుంది’’ అని షింజో చెప్పారు.

    కరోనావైరస్ మహమ్మారి మీద పోరాటంలో ప్రపంచం విజయం సాధించిందని చాటే విధంగా ఒలింపక్స్ నిర్వహణ ఉండాలని ఆయన అభివర్ణించారు. లేదంటే ఆ క్రీడలను నిర్వహించటం కష్టమన్నారు.

    జపాన్‌లో ప్రస్తుతం 13,895 నిర్ధారిత కేసులు ఉన్నాయి. 413 మందికి పైగా చనిపోయారు.

  10. కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌లతో ప్రయోజనం ఎంత?

    ఆస్ట్రేలియా, సింగపూర్‌లలో కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌లు ఉన్నాయి. బ్రిటన్‌లో కూడా కొద్ది వారాల్లో ఇటువంటి యాప్ ఒకటి రావచ్చు.

    ఈ యాప్‌లు తన యూజర్ల లొకేషన్‌ను ట్రాక్ చేయటం ద్వారా.. వైరస్ సోకిన వ్యక్తిని కలిసినట్లయితే అప్రమత్తం చేస్తాయి.

    ఈ ట్రేసింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే లాక్‌డౌన్ తొలగించవచ్చునని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రజలకు చెప్పింది. ఇప్పటివరకూ దాదాపు 30 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

    కానీ.. ఈ యాప్‌లలో కూడా కొన్ని సమస్యలను ఉన్నాయని, వ్యక్తిగత గోప్యత అనేది అందులో ఒకటని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ఒక నిపుణుడు చెప్తున్నారు.

    ‘‘సమాచారానికి ఎలా భద్రత ఉంటుంది? దానిని ఎక్కడ స్టోర్ చేస్తారు? ఎంత కాలం దానిని ఉపయోగించుకుంటారు? అనే విస్తృత ప్రశ్న ఉంది. కేవలం కాంటాక్ట్ ట్రేసింగ్ కోసమే సమాచారం వాడతారనేది భావన. కానీ ఆ సమాచారాన్ని ఉంచుకుని, ఇతర రకాలుగా ఉపయోగించుకోవాలనే ఆశలు ఉంటాయి’’ అని ప్రొఫెసర్ జేమ్స్ క్రాబ్‌ట్రీ వ్యాఖ్యానించారు.

    ఇటువంటి యాప్‌లకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

    ‘‘ఒక వ్యక్తి ఒక కాఫీ షాపులో కూర్చున్నట్లు భావించండి. అక్కడ టేబుల్ మీద కొంత వైరస్ అంటుకుంటుంది. ఒక గంట తర్వాత మరొక వ్యక్తి వచ్చినపుడు అతడికి ఆ వైరస్ సోకుతుంది. ఈ విషయాన్ని ఆ యాప్ మీకు చెప్పదు’’ అని ఆయన బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

    ‘‘ప్రమాదం ఏమిటంటే.. ప్రజలకు తప్పుడు విశ్వాసాన్ని అందిస్తుంది. ఆ యాప్ మాజిక్ బులెట్ కాదు’’ అన్నారాయన.

  11. భారతదేశంలో చిక్కుకుపోయిన బ్రిటన్ పౌరులు.. తమను విస్మరించారని ఆవేదన

    బ్రిటిష్ పౌరులు వేలాది మంది నెల రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతున్న భారతదేశంలో చిక్కుకుపోయి ఉన్నారని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం అంగీకరించింది. వారిలో ఎక్కువ మంది వయోవృద్ధులే ఉన్నారు.

    అలా చిక్కుకుపోయిన వారిలో కొంత మంది దగ్గర మందులు కూడా ఐపోతున్నాయి. విదేశీయుల మీద హింసకు పాల్పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో వారు బయటకు వెళ్లటానికి భయపడుతున్నారు.

    భారత్‌లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తెప్పించటానికి అత్యవసర చర్యలు చేపట్టాలని, మరిన్ని ఎక్కువ విమానాలను నడిపించాలని వారి బంధువులు, ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు.

    దేశ పౌరులను వెనక్కు తీసుకురావటానికి తాము శ్రమిస్తున్నామని బ్రిటన్ అధికారులు చెప్తున్నారు.

  12. బ్రిటన్‌లో భారీగా కరోనా పరీక్షల విస్తరణ.. అందరికీ అందుబాటులో హోం టెస్టింగ్ కిట్లు

    బ్రిటన్‌లో కోవిడ్-19 పరీక్షలను భారీ స్థాయిలో విస్తరించటానికి చర్యలు చేపడుతున్నారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పరీక్షను అందుబాటులోకి తీసుకురావటానికి మరో అడుగు దూరంలో ఉన్నారు.

    లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత కరోనావైరస్‌ను అదుపులో ఉంచటానికి ‘టెస్ట్, ట్రాక్, ట్రేస్’ వ్యూహంలో ఇది కీలకంగా మారుతుంది.

    ఇందుకోసం.. ఇంట్లోనే పరీక్షించుకోగల ‘హోం టెస్టింగ్’ కిట్లను అందుబాటులోకి తేవటంతో పాటు.. సైనిక బలగాలతో మొబైల్ యూనిట్లను కూడా రంగంలోకి దించుతున్నారు.

    దేశంలో ఈ నెలాఖరు కల్లా రోజుకు 1,00,000 పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల సంఖ్య అందులో సగం కన్నా తక్కువగానే ఉన్నాయి.

  13. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 73 పాజిటివ్ కేసులు

    ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 7,727 సాంపిల్స్ పరీక్షించగా 73 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా బులెటిన్‌లో తెలిపింది.

    రాష్ట్రంలో నమోదైన మొత్తం 1332 పాజిటివ్ కేసులకు గాను 287 మంది డిశ్చార్జ్ అయ్యారని, 31 మంది చనిపోయారని వెల్లడించింది.

    అయితే గత 24 గంటల్లో ఎటువంటి కోవిడ్ మరణాలూ సంభవించలేదని చెప్పింది.

    ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1,014గా పేర్కొంది.

    అలాగే గత 24 గంటల్లో 29 మంది కోవిడ్ నుండి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. వారిలో గుంటూరు నుంచి 20 మంది, అనంతపురం, కృష్ణా, నెల్లూరు జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 287కు పెరిగింది.

    రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల కోవిడ్ ఆస్పత్రుల్లో పనిచేయటం కోసం కొత్తగా 1,170 మంది డాక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు రాష్ట్ర నోడల్ అధికారి బులెటిన్‌లో వివరించారు.

    పది లక్షల మందికి సగటున 1,649 పరీక్షలు

    ఇదిలావుంటే.. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 88,061 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అంటే సగటున పది లక్షల మందికి 1,649 కేసులు నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో కోవిడ్-19 పాజిటివ్ కేసుల రేటు 1.51 శాతంగా (దేశవ్యాప్తంగా 3.84 శాతం సగటు) ఉందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 2.33 శాతంగా (దేశవ్యాప్త సగటు 3.18 శాతం) వివరించారు.

  14. ఆటలు ‘‘పై నుంచి కాదు.. కింది నుంచి మళ్లీ మొదలవ్వాలి’’

    కరోనావైరస్ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ‘‘క్రీడలు కింది నుంచి రావాలి.. పై నుంచి కాదు’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రజారోగ్య సలహాదారు డాక్టర్ బ్రియాన్ మెక్‌క్లోస్కీ పేర్కొన్నారు.

    క్రీడలను మళ్లీ ప్రారంభించటానికి సామాజిక క్రీడలు మొదటివి కావాలని ఆయన సూచించారు.

    ఆయన ఈ ప్రకటన చేయటానికి ముందు పరిణామాలు చోటు చేసుకున్నాయి:

    • అర్థంతరంగా నిలిచిపోయిన ఫిఫా ప్రపంచకప్ 2019-20 ఫుట్‌బాల్ పోటీలను తిరిగి ప్రారంభించటాన్ని వ్యతిరేకిస్తూ ఫిఫా చీఫ్ డైరెక్టర్ హెచ్చరించారు.
    • ఫ్రాన్స్‌లో సెప్టెంబర్ వరకూ అన్ని రకాల క్రీడా కార్యక్రమాలనూ ప్రధానమంత్రి ఎడోవార్డ్ ఫిలిప్ నిషేధించారు. దీంతో రెండు అగ్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు ఆగిపోయాయి.
    • టోక్యో ఒలింపిక్స్ 2020 అధ్యక్షుడు యొషిరో మోరీ.. క్రీడల నిర్వహణకు తాము పెట్టుకున్న కొత్త తేదీలైన జూలై 2021 ప్రకారం ముందుకు సాగలేకపోతే ఈ ఆటలు రద్దవుతాయని చెప్పారు.
  15. పాకిస్తాన్‌లో ఒక్క రోజులోనే20 మంది మృతి

    పాకిస్తాన్‌లో మంగళవారం ఒక్క రోజే 20 మంది చనిపోయారు. ఈ దేశంలో ఇప్పటి వరకూ ఒక రోజు సంభవించిన కరోనావైరస్ మరణాల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 301కి పెరిగింది. కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 14,000 దాటింది.

    భారతదేశంలో చిక్కుకుపోయి ఉన్న నేపాలీ కార్మికులు తమ స్వదేశానికి వెళ్లటం కోసం.. ఇరు దేశాల సరిహద్దు మధ్య గల మహాకాళి నదిని ఈదుతూ దాటుతున్నారు. ఈ వారంలో కనీసం ముగ్గురు నది దాటి స్వదేశానికి తిరిగివచ్చారు. నేపాల్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 54కి పెరిగాయి.

    ఇక శ్రీలంకలో దాదాపు 600 కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకూ ఏడుగురు చనిపోయారు. దేశంలో క్రికెట్ స్టేడియంలు, సదుపాయాల నిర్వహణకు నిధులు అందజేస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు చెప్పింది.

  16. ‘కరోనా అవగాహన కోసం’ తమకు తాము 26 లక్షల డాలర్లు కేటాయించుకున్న ఎంపీలు

    కరోనావైరస్ మీద అవగాహన పెంపొందించటం కోసం ఉగాండా పార్లమెంటు సభ్యులు 1000 కోట్ల ఉంగాడా షెల్లింగిలు బడ్జెట్‌గా కేటాయించుకున్నారు.

    అవగాహన పెంచటం కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలకు నిధులు కేటాయించకుండా.. ఎంపీలు తమకు తాము కేటాయించుకోవటం పట్ల దేశాధ్యక్షుడు యొవేరీ ముసేవేనీ మండిపడ్డారు.

    ఈ నిధులను ఇప్పటికే ఖర్చు పెట్టిన ఎంపీల విషయంలో దర్యాప్తు చేయాలని ఆడిటర్ జనరల్‌కు లేఖ రాస్తానన్నారు.

    ఉగాండాలో ఇప్పటివరకూ 79 కరోనా కేసులు నిర్ధారణయ్యాయి. దేశంలో మే ఐదో తేదీ వరకూ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.

  17. వియత్నాంలో ‘సరికొత్త సాధారణ’ జనజీవనం పునరుద్ధరణ

    వియత్నాంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను సడలించి దాదాపు వారం రోజులైంది. జనజీవనం నెమ్మదిగా అయినా ఒక విధమైన సాధారణ స్థితికి తిరిగి వస్తున్నట్లు కనిపిస్తోంది.

    భోజనం చేసే వాళ్ల మధ్య ప్లాస్టిక్ తెరలు, వీధి మార్కెట్లలో సామాజిక దూరాలు, ఫేస్ మాస్కులు తప్పనిసరిగా ధరించటం.. ‘కొత్త సాధారణ’ స్థితిగా మారింది.

    వైరస్‌ను ఎదుర్కోవటంలో వియత్నాం విజయం సాధించిందని ప్రశంసలు అందుకుంది.

    చైనాతో భౌగోళిక సరిహద్దు ఉన్నా, దేశంలో 9.7 కోట్ల మంది జనాభా ఉన్నా.. ఈ దేశంలో కేవలం 279 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.

    ఈ దేశం జనవరిలోనే సరిహద్దులు మూసివేసింది. ఉధృతంగా కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టింది. దేశవ్యాప్తంగా సమాచార కార్యక్రమం నడిపింది.

  18. ప్రపంచ నగరాలన్నిటా ఖాళీ రోడ్లు

    ప్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింట్లోనే ఒకే రకమైన దృశ్యం కనిపిస్తోంది. ఒకప్పుడు జనం, ట్రాఫిక్‌తో కిటకిటలాడే రోడ్లన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి.. అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపించే ఒకటీ అరా మనుషులు తప్ప.

  19. మరణాల సంఖ్యలో చైనాను దాటేసిన బ్రెజిల్

    బ్రెజిల్‌లో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. కోవిడ్ మరణాల్లో చైనాను బ్రెజిల్ దాటేసింది.

    ఇప్పటి వరకు ఆ దేశంలో 5000 మందికి పైగా మరణించారు. ఈ సంఖ్య చైనా మృతులకన్నా ఎక్కువ.

    గడిచిన 24గంటల్లో తమ దేశంలో 474 కరోనా మరణాలు సంభవించాయని, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,017కు చేరినట్లు బ్రెజిల్ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.

    చైనాలో ఇప్పటి వరకు 4,633 మంది మరణించారు.

    72,000 కరోనా పాజిటివ్ కేసులతో బ్రెజిల్, లాటిన్ అమెరికాలో అతి పెద్ద కరోనా బాధిత దేశంగా మారింది.

  20. కరోనా వైరస్ ఇండియా అప్‌డేట్స్

    భారత్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య 31 వేలు దాటింది. మృతుల సంఖ్య 1000 దాటింది.

    మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 1840 కేసులు నమోదయ్యాయి.

    తమ రాష్ట్రం నుంచి వెళ్లి దేశంలో పలు ప్రాంతాలలో పని చేసుకుంటున్న దాదాపు 10 లక్షలమంది వలస కూలీలను స్వరాష్ట్రానికి రప్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

    కోవిడ్-19 బాధితులకు ప్లాస్మా థెరపీ ద్వారా వ్యాధిని తగ్గించవచ్చన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం విభేదించింది. దీనికి ప్రామాణికత లేదని, శాస్త్రీయంగా నిరూపణ కాలేదని, ఈ ప్రయోగాన్ని క్లినికల్ ట్రయల్స్ కోసమే ఉపయోగించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

    తమ దేశం నుంచి 50 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ఆర్డర్‌ను భారత్ రద్దు చేయడంపై చైనా అసహనం వ్యక్తం చేసింది. తమ టెస్టింగ్ కిట్లలో లోపాలపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆ దేశ రాయబార కార్యాలయ ప్రతినిధి వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ తెలిపింది.