You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 2.08 లక్షల మరణాలు; భారత్‌లో 28,380 బాధితులు, 886 మృతులు

ప్రపంచదేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. భారతదేశంలో మొదటిసారి 24 గంటల వ్యవధిలో 60 మరణాలు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం 28,380 మంది కోవిడ్ బాధితులలో 6,362 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

లైవ్ కవరేజీ

  1. లాక్‌డౌన్ పొడిగించమని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు: పుదుచ్చేరి సీఎం వెల్లడి, మే 3 తరువాత లాక్‌డౌన్ పొడిగించమని కోరాను: మేఘాలయ సీఎం

    బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులలో చాలామంది లాక్‌డౌన్ కొనసాగించాలని కోరినట్లు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

    మరోవైపు మే 3 తరువాత కూడా లాక్‌డౌన్ కొనసాగించాలని కేంద్రాన్ని కోరినట్లు మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా చెప్పారు.

    ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న ఆయన అనంతరం ట్విటర్‌లో ఈ విషయం వెల్లడించారు.

    కోవిడ్ ప్రభావం లేని జిల్లాలు, గ్రీన్ జోన్లలో కొన్ని కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తూ ఈ లాక్‌డౌన్ కొనసాగించాలని సూచించినట్లు చెప్పారు.

  2. లాక్‌డౌన్ సత్ఫలితాలనిచ్చింది.. ఆర్థిక వ్యవస్థ గురించీ ఆలోచించాలి: మోదీ, ముఖ్యమంత్రులతో ముగిసిన వీడియో కాన్ఫరెన్స్

    వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది.

    ముందుముందు కూడా కరోనావైరస్ ప్రభావం ఉంటుంది కాబట్టి మాస్కులు, ముఖానికి ముసుగులు మన జీవితంలో భాగం కావాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు.

    మార్చి ప్రారంభంలో భారత్‌ సహా వివిధ దేశాల్లో పరిస్థితులు ఒకేలా ఉన్నాయని.. కానీ, సకాలంలో సరైన చర్యలు తీసుకోవడం వల్ల భారత్ అనేకమంది ప్రాణాలను కాపాడుకోగలిగిందని ప్రధాని చెప్పారు.

    గత నెలన్నర కాలంలో లాక్‌డౌన్ సత్ఫలితాలనిచ్చిందని.. వేల మంది ప్రాణాలను కాపాగలిగామని ఆయన గుర్తుచేశారు.

    అధిక జనాభా గల భారత్‌లో వైరస్‌ను కట్టడి చేయలేకపోతే అది పెను ప్రమాదానికి దారితీస్తుందన్నారు.

    కోవిడ్-19తో పోరాడడానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు ఆర్థిక వ్యవస్థకూ ప్రాధాన్యమివ్వాలని మోదీ అన్నారు.

    ప్రజలంతా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

  3. లాక్ డౌన్‌ను పొడిగించాల్సిందే-పీఎంతో సమావేశంలో ఒడిషా ప్రభుత్వం

    లాక్ డౌన్‌ను కనీసం మరో నెల లేదా అంత కన్నా ఎక్కువ రోజులు పొడిగించాలని ప్రధానిని కోరినట్టు ఒడిషా ఆరోగ్య శాఖ మంత్రి నబ దాస్ ఏఎన్ఐతో చెప్పారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు నబ దాస్ కూడా ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరయ్యారు. లాక్ డౌన్‌ను పొడిగించని పక్షంలో మున్ముందు రాష్ట్రంలో తలెత్తబోయే పరిస్థితుల్ని ఎదుర్కోవడం కష్టమవుతుందని ప్రధానికి తెలిపినట్టు ఏఎన్ఐ పేర్కొంది.

  4. లాక్ డౌన్ నిబంధనలను సడలించేందుకు ఇటలీ ప్రణాళికలు

    మార్చి రెండో వారం తర్వాత నుంచి రోజువారీ మరణాల సంఖ్య అతి తక్కువగా నమోదు అవుతుండటంతో ఏడు వారాలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ నిబంధనలను సడలించేందుకు ఇటలీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

    మే 4 నుంచి లాక్ డౌన్ నిబంధనల సడలింపు మొదలు పెడతామని ఇటలీ ప్రధాని గిసెప్పీ కాంటే వెల్లడించారు. ఆరోజు నుంచి పరిమిత సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతిస్తామని, కానీ మాస్కులు తప్పక ధరించాలని ఆయన తెలిపారు.

  5. మణిపూర్‌లో లాక్ డౌన్ దృశ్యాలు

    మణిపూర్‌లోని తౌబుల్ పట్టణంలో డ్రోన్‌తో చిత్రీకరించిన లాక్ డౌన్ దృశ్యాలు.

  6. గంటల వ్యవధిలో 10లక్షల డౌన్‌లోడ్లు-కరోనా ట్రేసింగ్ యాప్ కోసం ఎగబడ్డ ఆస్ట్రేలియన్లు

    కరోనావైరస్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం విడుదల చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే 10 లక్షలమందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు.

    డిజిటల్ హ్యాండ్ షేక్ కోసం ది కొవిడ్ సేఫ్ అనే స్మార్ట్ ఫోన్ యాప్ ను ఉపయోగిస్తారు. బ్లూటూత్ సిగ్నల్స్ ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది. ఈ యాప్ ఉన్న వేరే వ్యక్తి1.5 మీటర్ల దూరం (4.5 అడుగులు) లో ఉండగానే ఈ యాప్ పని చేయడం ప్రారంభమవుతుంది.

    దీని యూజర్ 15 నిమిషాల కంటే ఎక్కువసేపు కరోనా పాజిటివ్ అయిన వ్యక్తికి సమీపంలో ఉంటే ఇది వెంటనే ఆ విషయాన్ని తెలియజేస్తుంది.

    జాన్స్ హాప్కిన్ యూనివర్సిటీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 6 వేల 694 పాజిటివ్ కేసులు నమోదు కాగా...80మంది చనిపోయారు.

    ఈ యాప్ ఇచ్చిన సమాచారాన్ని కొద్దికాలంపాటు తమ వద్ద ఉంచుకుంటామని, కేవలం కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఈ సమాచారాన్ని ఉపయోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే మే రెండోవారం వరకు పార్లమెంటు సమావేశాలు లేకపోవడంతో ఇది చట్టబద్దమైన రక్షణ చర్య కాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

    అటు, బ్రిటన్‌లో కూడా త్వరలోనే ఈ తరహా కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ విడుదల చేస్తామని ఆరోగ్యమంత్రి ప్రకటన చేసిన వెంటనే అక్కడ కూడా ఇలాంటి గోప్యతకు సంబంధించిన వివాదాలు వినిపించాయి.

  7. ఏపీ రాజ్‌ భవన్‌లో నలుగురికి కరోనా పాజిటివ్

    ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యాలయంలో నలుగురు సిబ్బందికి కరోనావైరస్ సోకినట్టు అధికారికంగా ప్రకటించారు.

    వైరస్ సోకిన వారిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, వైద్య సహాయకుడు, హౌస్ కీపింగ్ సిబ్బంది ఉన్నారు.

    గవర్నర్‌ విశ్వ భూషణ్ హరిచందన్‌కు కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు.

  8. కరోన కట్టడిలో వైఫల్యాల విమర్శల నడుమ ఆఫీసుకు బ్రిటన్ ప్రధాని

    కరోనావైరస్ బారిన పడి నెల రోజుల పాటు చికిత్స తీసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ తన కార్యాలయానికి వస్తున్నారు.

    అయితే ఆయన రాకకు ముందే ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాను కట్టడిలో కృషి చేస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్ సిబ్బందికి సరైన రక్షణ సదుపాయాలు కల్పించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు లాక్ డౌన్ ఎత్తివేయడంపై సరైన ప్రణాళిక సిద్ధం చేయాలన్న ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి.

    ఎంపీలకు అందిన తాజా నివేదిక ప్రకారంబ్రిటన్ లో లాక్ డౌన్ కాలంలో గృహహింస కేసులకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్స్ 49 శాతం పెరగగా, హత్యలు రెట్టింపయ్యాయి.

  9. వీఐపీ కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను నిలిపేసిన చెన్నై పోలీసులు

    చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్ సమీపంలో వీఐపీ కాన్వాయ్‌ కోసం పోలీసులు అంబులెన్స్‌ను నిలిపివేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రయాణీకుల్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు.

  10. ప్రపంచవ్యాప్తంగా 30లక్షలకు చేరువగా కరోనా కేసులు

    జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదైనకరోనా వైరస్ పాజిటివ్ కేసులు 30 లక్షలకు చేరువవుతున్నాయి.

    ప్రస్తుతం 29 లక్షల 71 వేల 831 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు2లక్షల 6వేల 542మంది మరణించారు. అమెరికాలో అత్యధికంగా 9 లక్షల 65వేల 910 కేసులు నమోదయ్యాయి. 2 లక్షల 26 వేలకు పైగా కేసులతో స్పెయిన్ రెండో స్థానంలో నిలిచింది.

    అయితే కొన్ని టెస్టుల ఫలితాలు ఇంకా రాకపోవడం, మరికొన్ని అసలు నమోదుకాకపోవడంతో ఈ కేసుల సంఖ్య అనుకున్నదానికంటే ఎక్కువగానే ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

  11. స్వరాష్ట్రానికి చేరుకునేందుకు బెంగాలీలకు సాయమందిస్తాం-మమతా బెనర్జీ

    లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన బెంగాలీలందరికీ స్వరాష్ట్రం చేరుకునేందుకు ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

  12. చైనా స్కూళ్లలో పెరుగుతున్న పిల్లల హాజరు

    లాక్ డౌన్ తర్వాత షాంఘై, బీజీంగ్ నగరాలలో విద్యార్ధులు స్కూళ్లకు బయలుదేరారు.

    షాంఘైలో మిడిల్, హైస్కూలు చివరి సంవత్సరం చదువుతున్న పిల్లలు స్కూళ్లకు వెళ్తుండగా, బీజింగ్‌లో సీనియర్ హైస్కూలు విద్యార్ధులు అత్యంత క్లిష్టమైన ‘గావ్ కావ్’ అనే యూనివర్సిటీ ఎంట్రన్స్టెస్టుకు ప్రిపేరయ్యేందుకు బడులకు వస్తున్నారు.

    చైనావ్యాప్తంగా గత నెల మొత్తం స్కూళ్లు మూతపడి, ఆన్ లైన్ లోనే పాఠాలు నడిచాయి. కరోనా పుట్టినిల్లు వూహాన్ లో మే 6 నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి.

    ఇక హాంగ్ఝౌ ప్రావిన్సులో విద్యార్ధులు సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ఒక మీటరు వెడల్పుండే టోపీలను వాడుతున్నారు. ఆ మీటర్ హ్యాట్ ఎలా ఉంటుందో ఈ ట్విట్టర్ లింక్‌లో చూడవచ్చు.

  13. రంజాన్ మాసం సందర్భంగా దేశంలో కొవిడ్ -19 కేసులు పెరగవచ్చు: ప్రజలకు పాక్ ప్రభుత్వం హెచ్చరిక

    రంజాన్ సందర్భంగా మసీదుల్లో సామూహిక ప్రార్ధనలకు అనుమతించడంతో ఈ మాసంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందే ప్రమాదముందని దేశ ప్రజలను హెచ్చరించింది పాకిస్థాన్ ప్రభుత్వం.

    లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తే దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతుందని, అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనివైద్యరంగ నిపుణులు ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో పాక్ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

    పాకిస్థాన్ లో ఇప్పటికే 12 వేల 500ల కరోనా కేసులు నమోదు కాగా....269మంది చనిపోయారు

  14. ఏపీలో కొత్తగా 80 కరోనావైరస్ పాజిటివ్ కేసులు

    ఆంధ్రప్రదేశ్‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కోవిడ్-19 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177కి చేరింది. ఇప్పటి వరకు 235 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 13, గుంటూరు 23, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు7, శ్రీకాకుళం1, పశ్చిమ గోదావరి 3, చొప్పున కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు అధికారులు తాజా బులిటెన్లో వెల్లడించారు.

  15. 1700కి.మి. సైకిల్ ప్రయాణం-క్వారంటైన్ అనంతరం క్షేమంగా ఇంటికి, మహారాష్ట్ర నుంచి సొంత ఊరు జైపూర్(ఒడిషా)కు సైకిల్ పై ప్రయాణించిన యువకుడు

    మహారాష్ట్ర నుంచి 1700 కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కుకొని ఒడిషాలోని జైపూర్ చేరుకున్న 20 ఏళ్ల మహేశ్ జినా 14రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్నారు. లాక్ డౌన్ కారణంగా సరైన ఆదాయం లేకపోవడంతో స్నేహితుని వద్ద రూ.3000 అప్పు చేసి సొంత ఊరు బయల్దేరానని ఆయన ఏఎన్ఐకి చెప్పారు. ఏప్రిల్1 తన సైకిల్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన రోజుకు 17 గంటల పాటు తొక్కి ఏప్రిల్ 7 జైపూర్ చేరుకున్నానని అన్నారు. ఆపై జైపూర్ నగర సరిహద్దుల్లో అధికారుల వద్దకు వెళ్లి వారు సూచించిన ప్రకారం క్వారంటైన్‌లో ఉన్నానని అన్నారు. చాలా రాష్ట్రాలలో పోలీసులు అడ్డగించినప్పటికీ తన విషయం తెలుసుకొని విడిచిపెట్టారని మహేశ్ తెలిపినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

  16. ముఖ్యమంత్రులతో ముగిసిన ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ సమావేశం

    వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసింది. లాక్ డౌన్ సహా వివిధ అంశాలపై సీఎంలతో ఆయన చర్చించారు.కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు మరిన్ని నిధులు ఇవ్వాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్‌ను దశల వారీగా తొలగించాలని కొన్ని రాష్ట్రాలు కోరగా.. మే 3 తర్వాత కూడా కొనసాగించాలని మరి కొన్ని రాష్ట్రాలు కోరాయి.

    ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సహా హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, దిల్లీ, మధ్యప్రదేశ్, కర్నాటక, అస్సాం, తమిళనాడు, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

    కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్, లధ్దాఖ్ లెఫ్ట్‌ నెంట్ గవర్నర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

    కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇవాళ్టి మీటింగ్‌లో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరవుతారని అధికార వర్గాలు తెలిపినట్టు ఏఎన్ఐ పేర్కొంది.

  17. క్వారంటైన్, సామాజిక దూరం నియమాలకు వ్యతిరకంగా బ్రెజిల్‌లో ర్యాలీ

    బ్రెజిల్‌లో కరోనావైరస్‌ను అరికట్టేందుకు క్వారంటైన్, సామాజిక దూరం పాటించాలంటూ గవర్నర్లు, మేయర్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

  18. నాగసాకి క్రూయిజ్ షిప్‌లో 148మంది సిబ్బందికి కరోనా వైరస్

    నాగసాకి డాక్‌లో నిలిపి ఉన్నక్రూయిజ్ షిప్‌లో 148మందికి కరోనావైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.

    కోవిడ్-19 పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన ప్రయాణికులను వారి వారి దేశాలు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు జపాన్ అధికారులు

    ఇటలీకి చెందిన కోస్టా అట్లాంటికా క్రూయిజ్ షిప్ ఈ జనవరిలో మరమ్మత్తుల నిమిత్తం జపాన్‌లోని నాగసాకి డాక్‌కు చేరుకుంది. అయితే ఇందులో ప్రయాణికులెవ్వరూ లేరు. ఉన్న 623మందీ నౌకలో పని చేస్తున్న సిబ్బందే.

  19. రాజస్థాన్‌లో 2,221కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

    గడచిన 24గంటల్లో రాజస్థాన్‌లో కొత్తగా 36 కోవిడ్-19 కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2221కి చేరింది.

  20. గాలి పటాలు ఎగరవేస్తే జైలుకే-పాట ద్వారా ప్రజల్ని హెచ్చరిస్తున్న కాన్పూర్ పోలీసులు

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో గాలి పటాలు ఎగురవేయద్దంటూ తన పాట ద్వారా జనాల్ని హెచ్చరిస్తున్న పోలీస్ ఉద్యోగి