You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 29,20,660 కోవిడ్ కేసులు... 2,03,670 మంది మృతులు

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కరోనా రిసోర్స్ సెంటర్ తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 29,20,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 2,03,670 మంది కోవిడ్-19 రోగులు మృతిచెందారు.

లైవ్ కవరేజీ

  1. స్కాట్లాండ్‌లో 13 మంది పిల్లల తండ్రికి కరోనా పాజిటివ్

    స్కాట్‌లాండ్‌లో 13 మంది పిల్లలతో కలిసి లాక్‌డౌన్‌లో ఉన్న ఒక తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చింది.

    డుండీ ప్రాంతంలోని రాయ్ హన్‌కు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.

    స్కాట్‌లాండ్‌లోని అతిపెద్ద కుటుంబాల్లో హన్ కుటుంబం ఒకటి.

    నర్సుగా పనిచేస్తున్న రాయ్ తనకు చాలా స్వల్పంగా జబ్బు చేసిందని, విధుల్లో ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ వేసుకున్నప్పటికీ, పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడం చూసి ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పాడు.

  2. ఏపీలో కొత్తగా 81 కేసులు నమోదు

    ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 81 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒక్క కృష్ణా జిల్లాలోనే 51 కొత్త కేసులు బయటపడ్డాయి.

    కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1097కు చేరింది. వీరిలో 231 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు.

    గత 24 గంటల్లో కొత్త మరణాలు ఏవీ నమోదు కాలేదు. ప్రస్తుతం 835 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

    ఇప్పటివరకూ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 239 యాక్టివ్ కేసులు ఉండగా, గుంటూరులో 177, కృష్ణా జిల్లాలో 140 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  3. ప్రపంచవ్యాప్తంగా 29 లక్షలు దాటిన కోవిడ్ కేసులు... 2 లక్షలకు పైగా మృతులు

    జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కరోనా రిసోర్స్ సెంటర్ తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 29,00,422 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,03,055 మంది మరణించారు.

    అమెరికాలో 9.39 లక్షల మందికి కోవిడ్ సోకింది, 53 వేలకు పైగా ప్రజలు మరణించారు. భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 26,496కు చేరింది.

  4. కరోనా మహమ్మారిపై పోరాటానికి జీ-20 చొరవ

    కరోనావైరస్‌తో అంతర్జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు అవసరమైన ఆరోగ్య సదుపాయాలను సమకూర్చాలని ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల బృందం జీ20 అపీల్ చేసింది.

    “ఒక అంచనా ప్రకారం కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి అవసరమయ్యే 8 బిలియన్ డాలర్ల నిధుల లోటును భర్తీ చేయడానికి గ్రూప్‌ ప్రయత్నిస్తోందని జీ-20 ప్రస్తుత అధ్యక్ష దేశం సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి చెప్పారు” అని రాయిటర్స్ తెలిపింది.

    సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్ జదాన్ ‘యాక్సెస్ టూ కోవిడ్-19 టూల్స్ యాక్సిలేటర్’ చొరవ సమయంలో ఒక ప్రకటన చేస్తూ “అన్ని వేదికలపై ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడాన్ని జీ-20 కొనసాగిస్తుంది. ముఖ్యంగా కోవిడ్-19ను అడ్డుకోవడంలో నిధుల లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తుంది” అని చెప్పారు.

    ఈ ఆరోగ్య సంక్షోభం తీవ్రత, ఇది ఎప్పటివరకూ ఇలాగే కొనసాగుతుందో అంతర్జాతీయ సమాజానికి ఇంకా తెలీడం లేదు. ఈ నెల మొదట్లో కరోనావైరస్‌ను అడ్డుకునేందుకు చేపడుతున్న ప్రపంచ ప్రయత్నాల కోసం 50 కోట్ల డాలర్ల సాయం అందిస్తామని సౌదీ అరేబియా హామీ ఇచ్చింది. ఆ ఆర్థిక లోటును పూడ్చడానికి అన్ని దేశాలు, ప్రభుత్వేతర సంస్థలు, దాతలు, ప్రైవేటు రంగాలకు ఆర్థిక సాయం చేసేవారు అందరూ సాయం చేయాలని కోరింది.

  5. అమెరికా అధ్యక్షుడు మరో పెద్ద నిర్ణయం తీసుకోనున్నారా?

    అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 52 వేలు దాటింది. అధ్యక్షుడు ట్రంప్ ఇక కరోనా గురించి రోజూ ప్రెస్ బ్రీఫింగ్‌ ఇక ఇవ్వకూడదని నిర్ణయించారు.

    ఆయన ఇప్పుడు మరో పెద్ద మార్పు గురించి యోచిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుత హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ ఎలెక్స్ అజర్‌ను ట్రంప్ ప్రభుత్వం తొలగించవచ్చని భావిస్తున్నారు.

    కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో జరిగిన గందరగోళం కారణంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనిని ఇంకా ధ్రువీకరించలేదు. కానీ ట్రంప్ సర్కార్ దాని గురించి యోచిస్తోందని అంటున్నారు.

    న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ మాత్రం వైట్ హౌస్ ప్రతినిధి జూడ్ డీరె ఈ విషయాన్ని ఖండించారు అని చెప్పింది. “అజర్ నేతృత్వంలో హెచ్‌హెచ్‌ఎస్ అధ్యక్షుడికి ప్రాధన్యాలను బట్టి ఇక ముందు కూడా పని చేస్తుంది, ఒకరి గురించి అలా అంచనా వేయడం బాధ్యతారాహిత్యమే. ఇలా చెప్పడం కోవిడ్-19తో ప్రస్తుత మా పోరాటం పైనుంచి దృష్టి మళ్లించడం లాంటిదే” అన్నారని తెలిపింది.

    దీనిపై స్పందించిన హెచ్‌హెచ్‌ఎస్ ప్రతినిధి కెటలిన్ ఓక్లే “అజర్ ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బిజీగా ఉన్నారు. వీటన్నిటికీ ఆయన దగ్గర సమయం లేదు అని చెప్పారు.

  6. 'కరోనాపై పోరాటంలో ప్రతి భారతీయుడూ ఓ సైనికుడే' -మన్ కీ బాత్‌లో మోదీ

    ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు;

    - కరోనావైరస్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరోనా రహిత దేశం కోసం వైద్యులు, వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు.

    - ఆయుష్ మంత్రిత్వశాఖ సూచిస్తున్న సూచనలు పాటించడం ద్వారా మీరు మీ రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి.

    - పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. గత ఏడాది రంజాన్ పండుగ జరుపుకునేటప్పుడు ఎవరూ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉండరు. ఈసారం రంజాన్ పండుగను సహనానికి, మత సామరస్యానికి, సేవా దృక్పథానికి సంకేతంగా జరుపుకుందాం.

    - కరోనాపై పోరాటంలో ప్రతి భారతీయుడు ఒక సైనికుడే.గల్లీ నుంచి దిల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ పాటిస్తున్నారు. కోవిడ్-19పై సమరంలో దేశమంతా ఒక్కతాటిపై నిలబడి పోరాటం చేస్తోంది.

    - కరోనావైరస్ కారణంగా కొన్ని సానుకూల మార్పులు కూడా సంభవించాయి.

    - ఒకప్పుడు మాస్క్ వేసుకుంటే రోగిగా భావించే వారు. కానీ, ఇకపై మాస్కులు మన జీవితంలో ఒక భాగం. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి.

    - ఈ అక్షయ తృతీయ రోజు మనం మన చుట్టూ ఉన్న పర్యావరణం గురించి మనం ఆలోచించాలి. టువంటి విపత్కాలంలో మనం చేసే చిన్న సాయం కూడా ఎంతో విలువైనదే.

    మనం యుద్ధం మధ్యలో ఉన్నామని చెప్పిన మోదీ, "భవిష్యత్తులో ఎప్పుడైనా కరోనా మహమ్మారిపై పోరాటం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కచ్చితంగా భారత ప్రజలు చేసిన పోరాటం చర్చకు వస్తుంది" అని అన్నారు.

  7. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఊహాగానాలు

    ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వ్యాపిస్తన్నాయి. ఆయన ఏప్రిల్ 15న తన తాత కిమ్ ఇల్ సుంగ్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదు.

    అంతేకాదు, శనివారం జరిగిన ఉత్తర కొరియా సైనిక స్థాపన దినోత్సవానికీ ఆయన హాజరు కాలేదు.

    దీంతో, కిమ్ ఆరోగ్యంపై ఊహాగానాలు మరింత పెరిగాయి. న్యూస్‌వీక్ కథనం ప్రకారం ఎలాంటి అసాధారణ సైనిక కార్యకలాపాలు అమెరికా గూఢచర్య విభాగం దృష్టికి రాలేదు. అయితే, వారు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.

    పెంటగాన్ సీనియర్ అధికారి న్యూస్‌వీక్ పత్రికతో మాట్లాడుతూ, "ఉత్తరకొరియా అధినేత ఆరోగ్య స్థితిపై ఎలాంటి సమాచారం లేదు. ఆయన ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఎలాంటి ప్రాతిపదిక కూడా లభించలేదు" అని అన్నారు.

    కిమ్ ప్రయాణించే రైలు వోన్సాన్‌లో ఉండడం, ఇటీవలి అధికారిక కార్యక్రమాలకు హాజరుకాకపోవడం ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు బలం చేకూర్చుతున్నాయి.

    ఉత్తర కొరియా మీడియా చివరిసారిగా కిమ్ పాల్గొన్న సమావేశం గురించిన వార్తను ఏప్రిల్ 11న ప్రచురించింది.

  8. భారత్‌లో 26,496 కోవిడ్ కేసులు, 824 మృతులు

    గత 24 గంటల్లో 1,990 కరోనావైరస్ కేసులు నమోదు కావడంతో భారతదేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 26,496కు చేరుకుందని, ఇప్పటివరకు ఈ వ్యాధితో 824 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ఈ మొత్తం కేసుల్లో 19,868 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,804 మందికి వ్యాధి నయమైంది. వారు డిశ్చార్జి అ్య్యారు. గత 24 గంటల్లో 49 మరణాలు రికార్డు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 824కు చేరుకుంది.

    ఆదివారం ఉదయం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర కరోనావైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైంది. ఈ రాష్ట్రంలో 7,628 కరోనా కేసులు నమోదయ్యాయి. 323 మంది చనిపోయారు.

    ఆ తరువాత స్థానంలో ఉన్న గుజరాత్‌లో 3,071 కేసులు నమోదు కాగా, 133 మంది చనిపోయారు.

    తమిళనాడులో కోవిడ్ బాధితుల సంఖ్య 1,821కి చేరింది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 23 మంది మరణించారు.

    2,096 పాజిటివ్ కేసులు నమోదైన మధ్యప్రదేశ్‌లో 210 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 99 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 1,793 మందికి వైరస్ సోకింది. 27 మంది మృతి చెందారు.

    దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో 457 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరించారు.

  9. అమెరికాలో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోతున్న వారి విషాధ గాథలు

    గత అయిదు వారాల్లో 2.6కోట్ల మందికి పైగా అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే, ఆ దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో 15శాతానికి పైగా ఇప్పుడు ఉపాధి కోల్పోయారు.

    చిరు వ్యాపారాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. చిన్ని చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రుణాలు ఇచ్చేందుకు కేటాయించిన 349 బిలియన్ డాలర్ల నిధి రెండు వారాల్లోనే ఖాళీ అయిపోయింది.

    అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఉపాధి లేక అనేక మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారిలో ఎవరిని కదిలించినా ఆందోళన, భయం, కొంత ఆశ కనిపిస్తున్నాయి.

    కరోనావైరస్ మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితమైన కొందరు అమెరికన్ల మనగతం ఎలా ఉందో చూడండి.

  10. చైనాలో గత 24 గంటల్లో 11 కొత్త కోవిడ్ కేసులు

    ఏప్రిల్ 25న చైనాలో 11 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

    అంతకుముందు రోజున కూడా అక్కడ 12 మందికి కోవిడ్ నిర్ధరణ అయింది.అయితే, కొత్తగా మరణాలేమీ నమోదు కాలేదు.

    చైనాలో ఇప్పటివరకు 82,827 మందికి వైరస్ సోకింది. 4,632 మంది చనిపోయారు.

  11. సౌదీ అరేబియాలో కర్ఫ్యూ సడలింపు

    కర్ఫ్యూను సడలిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. ఆదివారం నుుంచి దాదాపు అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు సౌదీ మీడియా వెల్లడించింది. దీనితో, చాలా చోట్ల మళ్ళీ షాపులు పరమిత వేళల్లో తెరుచుకునే అవకాశం ఉంది.

    అయితే, మక్కాలో మాత్రం 24 గంటల కర్ఫ్యూ కొనసాగుతుంది. రంజాన్ మాసంలో రీటైల్ షాపులు తెరుచుకుంటాయి.

  12. ప్రధాని మోదీ మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు

    కరోనావైరస్ లాక్‌డౌన్‌లో దేశమంతా బందీ అయిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు 64వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడతారు.

    ఈసారి మన్ కీ బాత్‌లో కొన్ని కీలకమైన ఆలోచనలు పంచుకోవాలని భావిస్తున్నట్లు, 11 గంటలకు అందరూ ఈ కార్యక్రమానికి ట్యూన్ చేసుకోవాలని కోరుతూ మోదీ నిన్న ట్వీట్ చేశారు.

    ప్రధాని మోదీ మార్చి 24న దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మే 3 వరకూ పొడిగించారు.

    కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 24,942 మందికి వైరస్ సోకింది. వారిలో 5,210 మందికి వ్యాధి నయమైంది. 779 మంది చనిపోయారు.

  13. బీబీసీ తెలుగు LIVE అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం

    ఇవీ ఈనాటి ముఖ్యాంశాలు:

    - ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మృతులు 2 లక్షలు దాటిపోయాయి. వైరస్ సోకిన వారి సంఖ్య 29 లక్షలకు చేరువలో ఉంది.

    - భారతదేశంలో శనివారం నాటికి 24,942 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 5,210 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ వైరస్‌తో ఇప్పటివరకు 779 మంది మరణించారు.

    - తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు పెరిగింది. 25 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.016. ఇప్పటివరకు 31 మంది మరణించారు.

    - లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగే వేగం తగ్గిందని.. ఎన్నో ప్రాణాలను కాపాడడం సాధ్యమైనట్లు తమ విశ్లేషణలో తేలిందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పారు.