ముంబయిలో 53 మంది జర్నలిస్టులకు కోవిడ్-19
ముంబయిలో 53 మంది జర్నలిస్టులకు కోవిడ్-19 నిర్ధరణ అయింది. వాళ్ళందరినీ ఐసోలేషన్లో ఉంచారు. ఫీల్డులో పని చేస్తున్న రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు 171 మంది రక్త నమూనాలను పరీక్షించిన తరువాత ఈ విషయం వెల్లడైంది.
కోవిడ్-19 వ్యాధి సోకిన జర్నలిస్టులో చాలా మంది అసింప్టోమాటిక్ అంటే లక్షణాలు పైకి కనిపించని వారేనని బృహన్ ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.
జర్నలిస్టులు కోవిడ్-19 వ్యాధికి గురవడంపై ముంబయి ప్రెస్ క్లబ్ ఆందోళన వ్యక్తం చేసింది.కోవిడ్ అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి 50 లక్షల రూపాయల బీమా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు విధి నిర్వహణను కూాడా అత్యవసర సేవలుగా గుర్తంచి, బీమా సౌకర్యాన్ని వారికి కూడా వర్తింప చేయాలని ముంబయి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది.
దీనిపై ముఖ్యమంత్రి ఉధవ్ ఠాక్రే వెంటనే స్పందించాలని ముంబయి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుర్బీర్ సింగ్ ట్విటర్ ద్వారా కోరారు.
టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ పరిణామంపై స్పందించారు. ముంబయి జర్నలిస్టులు కరోనావైరస్కు గురికావడం అత్యంత దురదృష్టకరమని, కరోనా మహమ్మారికి సంబంధించిన వార్తలను మా అందరికీ అందిస్తున్న జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కుటుంబ సభ్యుల క్షేమాన్ని చూసుకోవాలని కోరారు.