You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్ వణికిస్తున్నా, మే నెలలోనే ఎన్నికలు జరుపుతామంటున్న పోలాండ్

కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 13 లక్షలు దాటింది. ఇప్పటివరకూ 74వేల మంది దీని బారినపడి మరణించారు. 2,76,000 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై ఏపీ సీఎం వైఎస్‌.జగన్‌ సమీక్ష

    కోవిడ్‌-19 నివారణా చర్యలపై సీఎం వైఎస్.జగన్‌ సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు.

    రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని అధికారులు విశ్లేషించారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలు అందించారు. సోమవారం సాయంత్రం 6 గంటనుంచి మంగళవారం ఉదయం వరకూ 150 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించామని, ఒక పాజిటివ్ కేసు నమోదైందని సీఎంకు తెలిపారు.

    ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తి చేశామని చెప్పారు. రాష్ట్రంలో క్రమంగా కేసులు సంఖ్య తగ్గవచ్చని భావిస్తున్నారు.

    ఈరోజు ఉదయం 9 గంటలవరకూ మొత్తం 304 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన మొత్తం 997 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 196 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

    వీరితో కాంటాక్ట్‌ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3–4 గంటలు వారితో ఉన్నవారిలో 2400 మందికి కూడా పరీక్షలు నిర్వహించారు. వారిలో 84 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

    విదేశాలనుంచి వచ్చిన 205 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిత కాంటాక్ట్ అయిన 120 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.

    కరోనా లక్షణాలు ఉన్నట్లు కనిపించిన 134 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి నెగటివ్ వచ్చింది.

    సమీక్ష సమావేశంలో హాట్‌స్పాట్లు, కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారు, ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

    కుటుంబ సర్వేద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏదో ఒక లక్షణంతో ఎవరైనా బాధపడుతుంటే వారిని గుర్తించి వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

    హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్‌ సర్వేపైన కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.

    క్వారంటైన్లు, క్యాంపుల్లో ఉన్నవారికి వసతులను పెంచడంపై ప్రధానంగా దృష్టిపెట్టాలని సూచించారు.

  2. బోరిస్ జాన్సన్ వెంటిలేటరు మీద లేరు

    బ్రిటన్ ప్రధానిలో కరోనా లక్షణాలు తీవ్రంగా లేకపోయినా, ముందుజాగ్రత్తగా ఆయనను సెయిట్ థామస్ ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించారు.

    సెయింట్ థామస్ ఐసీయూ వైద్యులకు కరోనావైరస్ రోగులకు చికిత్స చేసిన అనుభవం ఉంది.

    దేశంలో ఈసీఎంఓ(ఎక్స్ ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సీజెనేషన్) అనే లైఫ్ సపోర్ట్ మెషిన్లు ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో ఇది ఒకటి.

    ఈ ఆస్పత్రిలో గుండె, ఊపిరిత్తుల సమస్యలున్న వారికోసం అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. దేశంలో ఇలాంటి పరికరాలు ఉన్న ఆస్పత్రులు చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి.

    జ్వరంతోపాటు, లక్షణాలు కొనసాగుతుండడంతో ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆదివారం సెయింట్ థామస్ ఆస్పత్రిలో చేర్చారు.

    కరోనావైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బోరిస్ జాన్సన్‌కు శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ ఆయన్ను వెంటిలేటర్ మీద ఉంచాల్సిన అవసరం రాలేదు.

    ఐసీయూలో ఉన్న కరోనా రోగులందరికీ శ్వాస తీసుకోడానికి వెంటిలేటర్ అవసరం రాదు. కొందరిని సీపీఏపీ(కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్) సపోర్టు మీద ఉంచుతారు. మాస్క్ ద్వారా మెల్లగా ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ పంపిస్తారు. ఇది పెట్టే రోగులకు మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు.

  3. చిరునవ్వులను రోగులతో పంచుకుంటున్న వైద్య సిబ్బంది

    ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది తమ విధులను సురక్షితంగా నిర్వహించేలా రక్షిత దుస్తులు(పీపీఈ) అందేలా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

    కానీ, కొంతమంది వైద్య సిబ్బంది మాస్కులు, రక్షిత దుస్తులు ధరించడం వల్ల రోగులతో పనిచేయడం మరింత కష్టం అవుతోందని భావిస్తున్నారు. అవి ధరించడం తప్పనిసరి కాబట్టి, తమ గురించి రోగులకు తెలిసేలా ఒక దారి కనుగొన్నారు.

    ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు తాము ఎవరో తెలిసేలా చిరునవ్వుతో ఉన్న ఫొటోలను తాము ధరించిన రక్షిత దుస్తులపై అతికించుకున్నారు. కరోనారోగుల ఒత్తిడి దూరం చేస్తున్నారు.

  4. మాస్క్‌లు, కిట్ల కోసం పాకిస్తాన్‌లో వైద్య సిబ్బంది నిరసనలు, - ఇల్యాస్ ఖాన్, బీబీసీ ప్రతినిధి

    పాకిస్తాన్‌లోని క్వెట్టాలో కరోనావైరస్ నుంచి రక్షణ కల్పించే మాస్కులు, కిట్ల కొరత గురించి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఆందోళనకు దిగారు. పోలీసులు పదుల సంఖ్యలో నిరసనకారులను అరెస్టు చేశారు.

    బలూచిస్తాన్ కేబినెట్ సమావేశం జరుగుతున్న చోటుకు వైద్య సిబ్బంది ర్యాలీగా వస్తుండగా, పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

    బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి తమకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చి, విస్మరించారని వైద్య సిబ్బంది విమర్శించారు. మరోవైపు కరోనావైరస్ రోగులకు సేవలందించే వైద్య సిబ్బందికి మాస్క్‌లు, కిట్లు అందించామని ప్రభుత్వం చెబుతోంది.

    కానీ, సాధారణ రోగులను చూసేవారికి కూడా ముప్పు ఉందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ ఉండి, ఇంకా బయటపడని రోగులు వారిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    బలూచిస్తాన్‌లో పన్నెండుకుపైగా మంది వైద్యులకు కరోనావైరస్ సోకిందని, వీళ్లంతా కరోనావైరస్ రోగులకు చికిత్స అందించేవారు కాదని వాళ్లు అంటున్నారు.

    దేశ రాజధాని ఇస్లామాబాద్ సహా చాలా ప్రాంతాల్లో గత రెండు వారాలుగా వైద్య సిబ్బంది మాస్క్‌లు, కిట్ల కొరత గురించి చాలాసార్లు నిరసనలకు దిగారు. పాకిస్తాన్‌లో ఇప్పటివరకూ ముగ్గురు వైద్యులు కరోనావైరస్ సోకి మృతి చెందారు.

  5. నేనో ఇడియట్‌ను అని చెప్పుకున్న న్యూజీలాండ్ మంత్రి

    న్యూజీలాండ్‌ ఆరోగ్య శాఖ మంత్రి డేవిడ్ క్లార్క్ లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి, తన కుటుంబాన్ని తీసుకుని బీచ్‌కు వెళ్లారు. ఈ విషయంలో ఆయన తన తప్పును అంగీకరించారు.

    తనని తాను ‘ఇడియట్‌గా వర్ణించుకున్నారు.

    ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌కు డేవిడ్ క్లార్క్ తన రాజీనామా కూడా సమర్పించారు. అయితే, సంక్షోభ పరిస్థితులున్న నేపథ్యంలో ఆయన పదవిలోనే కొనసాగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, కేబినెట్‌లో డేవిడ్‌ హోదాను తగ్గించింది.

    న్యూజీలాండ్‌లో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతున్న సమయంలో మార్చి 25న డేవిడ్ క్లార్క్ కుటుంబ సభ్యులను తీసుకుని 20 కి.మీ.ల దూరంలోని బీచ్‌కు వెళ్లారు.

    అంతకుముందు వారం కూడా ఆయన స్వయంగా వ్యాన్ నడుపుకుంటూ ఓ ప్రయాణం చేశారు. ఆ ఫొటో బయటకు వచ్చింది.

    సాధారణ పరిస్థితుల్లోనైతే డేవిడ్‌పై వేటు వేసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఆరోగ్య శాఖ కుదేలవడాన్ని తాము తట్టుకోలేమని జెసిండా అన్నారు.

    నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.

  6. కరోనావైరస్‌కు వివక్ష లేదని తేలింది, లారా క్యూన్స్‌బర్గ్, బీబీసీ పొలిటికల్ ఎడిటర్

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఐసీయూలో చేర్చారని డౌనింగ్ స్ట్రీట్ వెల్లడించింది. అయితే ఆయనకు వెంటిలేటర్ అమర్చలేదు.

    జాన్సన్‌ను సెయింట్ థామస్ హాస్పటల్‌లో చేర్చారు. అక్కడ అవసరమైతే వెంటిలేటర్ సదుపాయాన్ని వెంటనే వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ హాస్పటల్‌కు జాన్సన్‌ను తీసుకెళ్లారు.

    జాన్సన్ కోలుకోవడానికి ముందుగా ఊహించిన దానికన్నా ఎక్కువ సమయమే పడుతుందని అర్థమవుతోంది.

    తాను కొన్ని ప్రాథమిక లక్షణాలతో బాధపడుతున్నానని, వైద్యుల సలహాలు పాటిస్తున్నానని బోరిస్ జాన్సన్ తరచుగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

    సోమవారం ఉదయం వరకూ కూడా ఆయన అధికారిక కార్యకలాపాలు నిర్వహించారని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. కానీ, సోమవారం మధ్యాహ్నం నుంచి ఆయన అనారోగ్యం కొద్దిగా తీవ్రమైంది.

    విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్‌ను ప్రధాని బాధ్యతలు తాత్కాలికంగా నిర్వర్తించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    “ప్రభుత్వ కార్యకలాపాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి జాన్సన్ సూచించిన ప్రణాళికల అమలుపై మంత్రులు దృష్టిసారిస్తారు” అని రాబ్ సోమవారం రాత్రి వెల్లడించారు.

    అయితే, ఈ మార్పుపై రాబ్ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించింది.

    కరోనావైరస్‌కు ఎలాంటి వివక్షా ఉండదు, ఇన్ఫెక్షన్‌కు ఎలాంటి భేదాలు ఉండవు అని రాజకీయ నాయకులు తరచూ చెబుతున్నారు.

    బోరిస్ జాన్సన్‌ను ఇంటెన్సివ్ కేర్‌లో చేర్చడంతో ఇది నిజమేనని మరోసారి నిరూపణైంది. అధికారంతో ఇలాంటి వాటిని అడ్డుకోలేమని తేలింది.

  7. ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కరోనావైరస్‌కి గురై జ్వరంతో బాధపడుతున్న ఆయన్ను శనివారం సెయింట్ థామస్ హాస్పిటల్లో చేర్పించారు.

    ఇది కేవలం ఆరోగ్యం విషమించకుండా, వైద్యుల సలహా అనుసరించి ముందు జాగ్రత్త కోసం తీసుకున్న చర్య అని 10-డౌనింగ్ స్ట్రీట్ (ప్రధానమంత్రి కార్యాలయం) తెలిపింది.

    ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి?... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

  8. చైనాలో సోమవారం ఒకటే మరణం నమోదు, కొన్ని రోజులుగా రోజువారీ మరణాల సంఖ్య 10లోపే

    గత 24 గంటల్లో తమ దేశంలో కేవలం ఒకే ఒక కరోనావైరస్ సంబంధిత మరణం నమోదైనట్లు చైనా వెల్లడించింది.

    కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ మరణాల సంఖ్య 10లోపే ఉంటోంది. అయితే, చైనా అందిస్తున్న ఈ సమాచారం విశ్వసనీయతపై ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ దేశంలో అసలు మరణాలు లేవు అని చెప్పేందుకు చేసే ప్రయత్నంలో భాగమే ఈ ప్రకటనలనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

    కరోనావైరస్ మహమ్మారికి కేంద్ర బిందువైన వుహాన్‌లో లాక్ డౌన్ ఆంక్షలను మరింత సడలించడానికి ఒక్క రోజు ముందు ఈ పరిస్థితి నెలకొంది. జనవరి 23న ఆంక్షలు లాక్ డౌన్ విధించిన తర్వాత తొలిసారిగా ప్రజలు నగరం విడిచి బయటకు రావడానికి అనుమతినిచ్చారు.

    మహమ్మారిపై విజయం చైనా అధికారులకు సంతోషాన్నిస్తోంది. ప్రస్తుతం అమెరికా ఈ మహమ్మారితో తీవ్రంగా పోరాడుతోంది. అమెరికాలో రోజువారీ మరణాల సంఖ్య పెరుగుతూ పోతోంది.

    ఆసియా, యూరప్‌లలో వైరస్ బారిన పడిన దేశాలకు సాయం అందిస్తామంటూ చైనా కొన్నివారాలుగా ప్రకటనలు చేస్తోంది.

    గత 24 గంటల్లో చైనాలో 32 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే వచ్చాయని చైనా చెబుతోంది.

  9. 24 రకాల ఔషధ ముడిపదార్ధాలు, ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన భారత్

    24 రకాల ఔషధ తయారీ ముడిపదార్ధాలు (ఏపీఐ), వాటితో తయారయ్యే ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు భారత్ వెల్లడించింది.

    అయితే, ఈ జాబితాలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ లేదు అని భారత డ్రగ్ తయారీదారుల సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పష్టం చేశారు.

  10. భారత్‌ స్పందించకపోతే ప్రతిస్పందన ఉంటుందన్న ట్రంప్

    హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేయాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని భారత్ తిరస్కరిస్తే దానికి ప్రతిచర్య ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.

    “కోవిడ్-19పై తమ పోరాటంలో గేమ్-చేంజర్ అని భావిస్తున్న డ్రగ్ ఎగుమతిపై మా విజ్ఞప్తిని భారత్ తిరస్కరిస్తే, ఫర్వాలేదు. కానీ, దానికి తగిన ప్రతిస్పందన ఉంటుంది” అని డోనల్డ్ ట్రంప్ అన్నారు.

    ట్రంప్ ఆదివారం మోదీకి ఫోన్ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. భారత్ ఈ ఔషధాన్ని భారీ స్థాయిలో తయారు చేస్తుంది.

  11. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఇద్దరికి పాజిటివ్, కిలోమీటరు పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు

    విశాఖ జిల్లా నర్సీపట్నంలో రెండు పాజిటివ్ కేసులు బయటపడటంతో పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌ అని నిర్థరణైన వ్యక్తులు నివాసమున్న ప్రాంతాన్ని పరిశీలించి, దానికి చుట్టూ కిలోమీటరు పరిధిని రెడ్ జోన్‌గా అధికారులు ప్రకటించారు.

    “తమిళనాడు నుంచి మత ప్రచారానికి గత నెల 18న ఐదుగురు భార్యాభర్తలు నర్సీపట్నం వచ్చారు. వీరికి నర్సీపట్నానికి చెందిన ఇస్మాయిల్ తన నివాసానికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఆశ్రయమిచ్చారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో వీరిని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ పది మందిని క్వారెంటైన్ నిమిత్తం విశాఖ ఛాతి ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మహిళలకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించాం” అని విశాఖ అడిషినల్ డీజీపీ సునీల్ కుమార్ అన్నారు.

    పరిస్థితి సద్దుమణిగే వరకు ఈ జోన్ నుంచి బయటకు రావడం కాని, బయటి వ్యక్తులు లోపలకు వెళ్లడం గానీ చెయ్యకూడదన్నారు. వీరికి అవసరమైన నిత్యావసరాలను రెవెన్యూ అధికారులు అందిస్తారని చెప్పారు.

    జిల్లా వ్యాప్తంగా 68 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై 2,000 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.

    ఇప్పటివరకు 290 మందిని క్వారంటైన్‌లో చేసి నెగటివ్ వచ్చిన తరువాత ఇంటికి పంపించామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 338 మందిని ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉంచామన్నారు. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవారి కదలికలు గమనించేందుకు డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నట్టు చెప్పారు.

  12. బోరిస్ జాన్సన్‌కు అత్యుత్తమ చికిత్స

    కరోనావైరస్ తీవ్ర లక్షణాలతో రాత్రికిరాత్రే ఐసీయూలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యుత్తమ చికిత్స అందుతోందని ప్రధాని కార్యాలయం తెలిపింది.

    లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో చేరిన ఆయనకు వైద్యులు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు అని ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.

    ఆయన పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఇంతవరకూ ఎలాంటి సమాచారం అందలేదు.

  13. కరోనావైరస్ లాక్‌డౌన్‌తో పెరుగుతున్న గృహహింస

  14. అమెరికాలో ఒక్కరోజులో 1150మంది మృతి

    గడిచిన 24 గంటల్లో అమెరికాలో కరోనావైరస్ కారణంగా 1150 మంది చనిపోయారు. ఒక దేశంలో కోవిడ్-19 కారణంగా ఒక్కరోజులో ఇంత మంది మరణించడం ఇదే మొదటిసారి అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

    ఫ్రాన్స్‌లో సోమవారం 830మంది మరణించగా, స్పెయిన్‌లో 630కి పైగా ప్రజలు చనిపోయారు.

    ప్రస్తుతం అమెరికాలో మరణాల సంఖ్య 10,783కు చేరింది. దేశంలో 3.67లక్షల కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 30,000 కేసులు వెలుగుచూశాయి.

  15. ఐసీయూలో బోరిస్ జాన్సన్

    కరోనావైరస్‌తో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఇంటెన్సివ్ కేర్‌కు తరలించారు. కోవిడ్-19 లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఇంటెన్సివ్ కేర్‌కు మార్చినట్లు డౌనింగ్ స్ట్రీట్ వెల్లడించింది.

    వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

    అవసరమైన సందర్భాల్లో తన బాధ్యతలను నిర్వర్తించాలని విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్‌ను జాన్సన్ కోరినట్లు డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి తెలిపారు.

    55ఏళ్ల జాన్సన్‌ను ఆదివారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై బ్రిటన్ రాణికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారని బకింగ్‌హామ్ ప్యాలస్ వర్గాలు తెలిపాయి.

    సోమవారం మధ్యాహ్నం నుంచి జాన్సన్‌కు ఆక్సిజన్ అందిస్తున్నారని, ఆ తర్వాత కాసేపటికి ఐసీయూకు తరలించారని బీబీసీ పొలిటికల్ కరస్పాండెంట్ క్రిస్ మాసన్ తెలిపారు. అయితే, ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ అమర్చలేదు.