షర్మిళ అరెస్ట్.. పాదయాత్రకు అనుమతి రద్దు, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఆమె పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు.
మహబూబాబాద్లో పర్యటిస్తోన్న షర్మిళ స్థానిక ఎమ్మెల్యే శంకర నాయక్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
శంకర్ నాయక్, ప్రతిపక్షాలను థర్డ్ జెండర్తో పోల్చి, ఉపయోగించరాని పదాలతో తిట్టారని షర్మిళ ఆరోపించారు. దానికి ప్రతిగా షర్మిళ థర్డ్ జెండర్ ను ప్రస్తావిస్తూ అవే పదాలు వాడి, అంతకంటే హీనం అంటూ తిట్టారు. తనకు థర్డ్ జెండర్ అంటే గౌరవం అంటూనే, ఆ పదాలు వాడారు షర్మిళ. ‘‘శంకర్ నాయక్ ను థర్డ్ జెండర్ వారితో పోలిస్తే వారినీ అవమానించినట్టే’’ అన్నారు షర్మిళ.
ఇచ్చిన మాట నిలబెట్టుకోని శంకర్ నాయక్ దద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారామె.‘‘నన్ను వలసదారు అంటున్నాడు. శంకర నాయక్ భార్యది నెల్లూరు. తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఆయన భార్యకు విడాకులు ఇచ్చేయాలి. ఆ మాటకొస్తే, ఒక మహిళా ఐఎఎస్ చేయి పట్టుకున్న కీచకుడైన శంకర్ నాయక్కే ఆయన భార్య విడాకులు ఇవ్వాలి’’ అంటూ ప్రసంగించారు వైయస్ షర్మిళ.
వాస్తవానికి గతంలో కూడా షర్మిళ పాదయాత్రల్లో భాగంగా ఆయా స్థానిక నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేసేవారు. దీంతో పోలీసులు ఆమె యాత్రకు అనుమతివ్వలేదు.
అనుమతుల కోసం హైకోర్టుకు వెళ్లారు షర్మిళ. తిట్లు వాడకూడదు అనే షరతుపై షర్మిళ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. తాజాగా మళ్లీ ఆమె తీవ్ర పదాలు వాడడంతో ఆమె యాత్రకు అనుమతి రద్దు చేసినట్టు తెలుస్తోంది.