You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

దిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు

ఈ కేసుతో కలుపుకుని ఇప్పటివరకు దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇంతకు ముందు గుర్తించిన మూడు కేసుల్లోని వ్యక్తులు విదేశీ ప్రయాణం చేసి వచ్చారు

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. భారత్‌లో కొత్తగా 16,866 కరోనా కేసులు

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో 16,866 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    తాజా కేసులతో క్రియాశీల కేసుల సంఖ్య 1,50,877కు చేరగా, రోజువారీ పాజిటివిటీ రేటు 7.03గా ఉంది.

    కరోనాతో ఆదివారం 41 మంది మృతి చెందగా, 18,148 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

  2. ద్రౌపది ముర్ము: నేడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం

    భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    దేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఆమె దేశానికి 15వ రాష్ట్రపతి కానున్నారు.

    కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో ఉదయం 10:15 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

    భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. దీని తర్వాత దేశాన్ని ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.

    ఈ కార్యక్రమం తర్వాత ఆమె రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరతారు. అక్కడ త్రివిధ దళాలకు చెందిన సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. తర్వాత పదవి నుంచి నిష్క్రమించనున్న రామ్‌నాథ్ కోవింద్‌ను సత్కరిస్తారు.

    ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మంత్రి మండలి సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, పార్లమెంట్ సభ్యులు, మిలిటరీ అధికారులు పాల్గొంటారు.

    ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో గెలిచారు.

  3. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు? ఏపీ, తెలంగాణ అప్పులు ఎంతెంత?

  4. మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'

  5. నేటి ముఖ్యాంశాలు

    • రష్యా రాజధాని నగరం మాస్కోలో జరిగిన ఒక చెస్ మ్యాచ్‌లో ఏడేళ్ల బాలుడి వేలును ఒక రోబో విరగ్గొట్టింది.
    • దేశ రాజధాని దిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. 31 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు.
    • భారతదేశంలో ఏటా 60 వేల మంది సైనికులు పదవీ విరమణ చేస్తారు. కానీ, వారిలో కేవలం మూడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారంటూ కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
    • ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా భారత్‌కు మరోసారి పతకాన్ని అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ త్రోలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
    • నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయంలో 250కి పైగా గోవులు వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి.
    • ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మొహమ్మద్ జుబేర్ జైలు నుంచి విడుదలై, బెంగళూరులోని స్వగృహానికి చేరుకున్నారు. ఆయనపై వివిధ కేసులు మోపడంతో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో 23 రోజుల పాటు జైలులో, పోలీసు కస్టడీలో ఉన్నారు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    ధన్యవాదాలు.

  6. మాస్కో ఓపెన్: ఏడేళ్ల బాలుడి వేలు విరగ్గొట్టిన చెస్ రోబో, ఎల్సా మైష్మాన్, బీబీసీ ప్రతినిధి

    రష్యా రాజధాని నగరం మాస్కోలో జరిగిన ఒక చెస్ మ్యాచ్‌లో ఏడేళ్ల బాలుడి వేలును ఒక రోబో విరగ్గొట్టింది.

    గతవారం జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుందని పలు రష్యా వార్తా సంస్థలు నివేదించాయి.

    ‘‘పిల్లాడి వేలును రోబో విరగ్గొట్టింది. ఇది చాలా దురదృష్టకరం’’ అని మాస్కో చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సెర్గీ లజరెవ్ టాస్ న్యూస్ ఏజెన్సీతో అన్నారు.

    ఈ సంఘటన తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఆ వీడియోలో.. చెస్ బోర్డులోని బాలుడికి చెందిన పావుల్లో ఒకదానిని రోబో తీస్తోంది, అప్పుడే ఈ బాలుడు మరొక పావును కదిపేందుకు ప్రయత్నించాడు. దీంతో రోబో బాలుడి వేలును పట్టుకుంది.

    నలుగురు పెద్దవాళ్లు పరుగెత్తుకుని వెళ్లి బాలుడికి సహాయం చేశారు. రోబో నుంచి బాలుడిని రక్షించి, అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

    కాగా, ఈ చెస్ రోబో గతంలో ఇలాంటి సంఘటనలేవీ లేకుండా చాలా మ్యాచుల్లో ఆడిందని లజరెవ్ అన్నారు.

    ఆ బాలుడు టోర్నమెంట్‌లోని తదుపరి మ్యాచ్‌లను వేరొకరి సహాయంతో ఆడినట్లు టాస్ వార్తా సంస్థ పేర్కొంది.

  7. గోవాలో చట్ట వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కూతురు బార్ నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపణ.. లీగల్ నోటీసు ఇచ్చిన సృతి ఇరానీ

  8. సుధ కొంగర: 'ఆకాశం నీ హద్దురా మూవీలో ఒక డైలాగ్ పెట్టొదన్నారు, ఇది నా సినిమా అని చెప్పాను'

  9. విడాకుల సమయంలో భరణం తర్వాత మెయింటెనెన్స్ కూడా చెల్లించాలా? హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది?

  10. కియారా అద్వానీ: ‘మొదట్లో నన్ను కలవడానికి కూడా భయపడ్డారు.. ఇప్పుడు వాళ్లే ఆఫర్లిస్తున్నారు’

  11. దిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు

    దేశ రాజధాని దిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. 31 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు.

    ఆ వ్యక్తి విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేవని, అయినా మంకీపాక్స్ సోకిందని అధికారులు వెల్లడించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ విషయాన్ని దిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ ధృవీకరించారని ఏఎన్ఐ తెలిపింది.

    ఈ కేసుతో కలుపుకుని ఇప్పటివరకు దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇంతకు ముందు గుర్తించిన మూడు కేసుల్లోని వ్యక్తులు విదేశీ ప్రయాణం చేసి వచ్చారు.

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విటర్ ద్వారా నగరంలోని మొదటి మంకీపాక్స్ కేసును ధృవీకరించారు.

    అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితులు అదుపులో ఉన్నాయని చెప్పారు.

    ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఉత్తమ డాక్టర్ల బృందం ఈ కేసును పరిశీలిస్తోందని చెప్పారు.

  12. అగ్నిపథ్ పథకంపై ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ

    భారతదేశంలో ఏటా 60 వేల మంది సైనికులు పదవీ విరమణ చేస్తారు. కానీ, వారిలో కేవలం మూడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారంటూ కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

    అటువంటప్పుడు, అగ్నిపథ్ పథకం కింద ఉద్యోగాలు సంపాదించి, నాలుగేళ్లల్లో పదవీ విరమణ పొందేవారి భవిష్యత్తు ఏమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

    ప్రధానమంత్రి ప్రయోగశాలలో తయారైన ఈ ప్రయోగం వలన దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తు ముప్పులో పడుతుందని విమర్శించారు. ఆ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

    గతంలో కూడా రాహుల్ గాంధీ ఇదే విషయమై ప్రధాని మోదీని విమర్శించారు.

    "ప్రధానమంత్రి తమ మిత్రులకు 50 ఏళ్లకుగానూ ఎయిర్‌పోర్టులు ఇచ్చి వాళ్లని దౌలర్‌వీర్ చేశారు. ఇప్పుడు యువతకు నాలుగేళ్లు ఉద్యోగాలిచ్చి అగ్నివీర్‌లు చేస్తున్నారు" అంటూ వ్యాఖ్యానించారు.

  13. నీరజ్ చోప్రా: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు

  14. నంద్యాల: వెలుగోడు జలాశయం వరద ప్రవాహంలో చిక్కుకున్న వందల గోవులు

    నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయంలో 250కి పైగా గోవులు వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి.

    వెలుగోడు గట్టు తండా సమీప గ్రామాల్లోని గోవులు వెలుగోడు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లగా, వాటిని అడవిపందులు బెదిరించడంతో జలాశయంలోని వరద ప్రవాహంలో పడిపోయాయి.

    కొట్టుకుపోతున్న ఆవులను జలాశయం సమీపంలో ఉన్న మత్స్యకారులు, రైతులు రక్షించడానికి ప్రయత్నించారు.

    చాలా గోవులను జలాశయం ఒడ్డుకి చేర్చారు. మిగిలిన గోవుల కోసం గాలిస్తున్నారు.

    గోవులు జలాశయంలో చిక్కుకున్న సమాచారం అధికారుల దృష్టికి వెళ్లడంతో, వారు వెంటనే స్పందించి ఎన్‌డీఆర్ఎఫ్ బృందలను రంగంలోకి దింపారు.

    మిగిలిన గోవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  15. స్వర్ణం సాధించలేకపోయినందుకు కారణాలు చెప్పిన నీరజ్ చోప్రా

    రజత పతకం సాధించిన అనంతరం నీరజ్ చోప్రా మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్‌లో పరిస్థితులు, తన ప్రదర్శన గురించి ఓపెన్‌గా మాట్లాడాడు.

    "గాలి వల్ల మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైనా మళ్లీ ఆటలో నిలదొక్కుకోగలగడం ఆనందం కలిగించిందని" చెప్పాడు.

    ఇది చాలా కఠినమైన పోటీ అని, దీని నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పాడు. మొదటి రౌండ్‌లో ఫౌల్ విసిరి, రెండో రౌండ్‌లో మంచి ఆటతీరు కనబరచడంపై నీరజ్ మాట్లాడాడు.

    "ఈ రోజు పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు. కానీ, నేను పతకం గెలవాలనే సంకల్పంతో జావెలిన్ విసిరాను. ముందు ముందు చాలా అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు మరింత ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాను" అన్నాడు.

    "నాల్గవ స్థానంలో నిలదొక్కుకోవాలనే ఒత్తిడి ఉంది. ఆట కఠినంగా ఉంది. ఎదురు నుంచి గాలి వీస్తుండడంతో ఇబ్బంది ఎదురైంది. అయినప్పటికీ నేను బాగా ఆడాను" అంటూ తన ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు నీరజ్.

    స్వర్ణం గెలుచుకున్న ఆండర్సన్ పీటర్స్ చాలా బాగా ఆడాడని ప్రశంసించాడు.

    "పీటర్స్ 90 మీటర్లు చాలా తేలికగా విసిరాడని చూసేవారికి అనిపిస్తుంది. కానీ అది అంత సులభం కాదు. అది ఎలా విసిరాడో అతడు మాత్రమే చెప్పగలడు. ఒకటి మాత్రం చెప్తాను..ప్రతి అథ్లెట్‌కు ఒక రోజు వస్తుంది. అందుకే ఎవరినీ ఎవరితోనూ పోల్చకూడదు" అని నీరజ్ అన్నాడు.

    స్వర్ణం సాధించలేకపోయినందుకు కారణాలు చెప్పాడు.

    "నా మీద స్వర్ణం ఆశలు ఉన్నాయని నాకు తెలుసు. అయితే, వాస్తవంలో ఏ పతకం కూడా రాకపోవచ్చు. క్రీడలలో ఎత్తుపల్లాలు ఉంటూనే ఉంటాయి. మన ప్రయత్నం మన చేయడమే. నేను ఎప్పుడూ నా వంతు కృషి చేస్తూనే ఉంటాను" అన్నాడు.

    తదుపరి ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన కోచ్‌కి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. తనకు ఒక విదేశీ కోచ్ దొరికారని, ఆయన బాగా శిక్షణ ఇస్తున్నారని, బయట మ్యాచ్‌లలో కూడా బలమైన ప్రదర్శన కనబరచగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు.

    "నాకు, నా ఆటకు ఇదే విధమైన మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాను" అంటూ ముగించాడు.

  16. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అయిదవ స్థానంలో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీం

    ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీం అయిదవ స్థానంలో నిలిచాడు. నదీం చివరి రౌండ్‌లో జావెలిన్‌ను 86.16 మీటర్ల దూరంలో విసిరాడు.

    ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

    పాకిస్తాన్‌లో అర్షద్ ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మాజీ మీడియా సలహాదారు ఉమర్ ఆర్ ఖురేషీ ట్వీట్ చేస్తూ, "ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు పాకిస్తాన్ అథ్లెట్ అర్హత సాధించడం ఇదే తొలిసారి" అంటూ ప్రశంసించారు.

    గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో కూడా పాకిస్తాన్‌కు చెందిన నదీం అయిదవ స్థానంలో నిలిచారు. ఆ పోటీల్లో గరిష్టంగా 84.62 మీటర్లకు జావెలిన్‌ను విసిరాడు.

  17. నీరజ్ చోప్రా: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు

  18. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మొహమ్మద్ జుబేర్ జైలు నుంచి విడుదల

    ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మొహమ్మద్ జుబేర్ జైలు నుంచి విడుదలై, బెంగళూరులోని స్వగృహానికి చేరుకున్నారు. ఆయనపై వివిధ కేసులు మోపడంతో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో 23 రోజుల పాటు జైలులో, పోలీసు కస్టడీలో ఉన్నారు.

    అరెస్టు, తదనంతర పరిణామాలపై జుబేర్ ఆంగ్ల పత్రిక్ 'ది హిందూ'తో మాట్లాడారు.

    “నిజం చెప్పాలంటే, నన్ను అరెస్ట్ చేస్తారని ముందే ఊహించాను. ఆల్ట్ న్యూస్‌లో పనిచేస్తున్నప్పుడు, ప్రతీక్ సిన్హా, నేను ఎప్పుడైనా అరెస్టు కావచ్చని తెలుసు. అయితే, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ టీవీలో పాల్గొన్న చర్చకు సంబంధించిన క్లిప్‌ నేను పోస్ట్ చేసినప్పుడు, అది వైరల్ అయి అంతర్జాతీయ స్థాయిలో స్పందనలు వచ్చినప్పుడు, నన్ను కచ్చితంగా అరెస్ట్ చేస్తారని అనుకున్నా.

    ఇదేం రహస్యంగా జరిగింది కాదు. నాకు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ నడిచింది. నన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో దేశంలో జరిగిన సంఘటనలకు నేనే కారణమంటూ ట్విట్టర్‌లో ప్రచారం చేశారు" అంటూ జుబేర్ చెప్పుకొచ్చారు.

    జైల్లో, పోలీసు కస్టడీలో తన అనుభవాలను వివరించారు.

    "నేను చాలా మంది పోలీసులతో కలిసి ఉన్నాను. జైలు అధికారులు నన్ను గౌరవంగా చూశారు. కానీ వారు నాపై నమోదు చేస్తున్న కేసులు నన్ను బాగా భయపెట్టాయి. దిల్లీ కేసులో నన్ను తీహార్ జైలుకు పంపినప్పుడు, నేను బెయిల్ కోసం ఎదురు చూశాను. కానీ, ఒక వారం తరువాత ఉత్తరప్రదేశ్‌లో నాపై ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వాటిపై దర్యాప్తు కోసం ఒక సిట్ కూడా ఏర్పాటుచేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల సిట్ ఎలా పనిచేస్తుందో తెలిసు కాబట్టి, నా ఆశలన్నీ వదులుకున్నాను.

    నేను చాలా కాలం జైలులో ఉండటానికి సిద్ధపడిపోయాను. నన్ను ఏదో ఒక పెద్ద కేసులో ఇరికిస్తారేమోనని భయపడ్డాను. అందుకే సుప్రీంకోర్టు తీర్పు నాకు చాలా కీలకం. అధికార పీఠం టార్గెట్ చేసిన వారి స్వేచ్ఛను కాపాడండంలో ఇది చారిత్రక నిర్ణయమని భావిస్తున్నాను" అని చెప్పారు.

    జుబేర్‌నే ఎందుకు టార్గెట్ చేశారన్న ప్రశ్నపై స్పందిస్తూ, "అసమ్మతి తెలిపేవారిని, ఫ్యాక్ట్-చెక్ చేసే జర్నలిస్టుల నోరు నొక్కేయాలని చూస్తోందీ ప్రభుత్వం. ఈ మొత్తం వ్యవహారంలో నా మతం కూడా ఒక చిన్న పాత్ర పోషించదని అనుకుంటున్నారు. ఇతరులకు నన్ను ఒక ఉదాహరణగా చూపించాలనుకున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే 10-15 రాష్ట్రాల్లో మీపై యాదృచ్చిక ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగలదు, ఏళ్ల తరబడి జైల్లో పెట్టగలదన్న సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. నా మీద యాదృచ్చికంగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు" అని ఆయన చెప్పారు.

  19. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు రజత పతకం

    ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా భారత్‌కు మరోసారి పతకాన్ని అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ త్రోలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

    నీరజ్ చోప్రా నాలుగో ప్రయత్నంలో 88.13 మీ. లాంగ్ త్రో చేశాడు.

    దాదాపు 20 ఏళ్ల తరువాత మళ్లీ భారతీయుడికి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం లభించింది.

    అంతకుముందు, 2003లో మహిళల లాంగ్ జంప్‌లో అంజు బాబీ జార్జ్ కాంస్య పతకాన్ని సాధించారు.

    గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తన చివరి త్రోలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ, జావెలిన్‌ను 90.54 మీటర్ల దూరంలో విసిరాడు.

    అమెరికాలో ఒరెగాన్‌లోని యూజీన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ విభాగంలో భారత్‌కు క్రీడాకారులు నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్ క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి ఫైనల్‌కు చేరుకున్నారు.

    ఫైనల్స్‌లో మూడు రౌండ్ల తరువాత రోహిత్ యాదవ్ ఆట నుంచి నిష్క్రమించాడు.

    నీరజ్ మొదటి మూడు అవకాశాల్లో ఒకటి ఫౌల్ కాగా, తరువాతి రెండు వరుసగా 82.39 మీటర్లు, 86.37 మీటర్ల వద్ద విసిరాడు. అయిదవ అవకాశం కూడా ఫౌల్ అయింది. ఫౌల్స్ వల్ల స్వర్ణం సాధించే అవకాశం చేజార్చుకున్నాడు.

    మరో పక్క ఆండర్సన్ పీటర్స్ రెండో ప్రయత్నంలో 90.46 మీటర్ల దూరంలో విసిరి అగ్రస్థానంలో కొనసాగాడు.

    చివరి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆండర్సన్ పీటర్స్ ప్రారంభంలోనే 90.21 మీటర్ల జావెలిన్ త్రోతో ముందంజ వేశాడు. నీరజ్ చోప్రా 88.13 మీ. దూరం విసిరి రజత పతకం గెలుచుకున్నాడు.

    ఆరు రౌండ్లు ముగిసేసరికి అండర్సన్ స్వర్ణ పతకాన్ని, నీరజ్ చోప్రా రజత పతకాన్ని, జాకబ్ వడ్లెక్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

    నీరజ్ దాదాపు 20 ఏళ్ల భారతీయుల ఆకాంక్షను తీర్చాడు.

  20. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ పేజీని ఫాలో అవండి.