ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మొహమ్మద్ జుబేర్ జైలు నుంచి విడుదలై, బెంగళూరులోని స్వగృహానికి చేరుకున్నారు. ఆయనపై వివిధ కేసులు మోపడంతో దిల్లీ, ఉత్తరప్రదేశ్లలో 23 రోజుల పాటు జైలులో, పోలీసు కస్టడీలో ఉన్నారు.
అరెస్టు, తదనంతర పరిణామాలపై జుబేర్ ఆంగ్ల పత్రిక్ 'ది హిందూ'తో మాట్లాడారు.
“నిజం చెప్పాలంటే, నన్ను అరెస్ట్ చేస్తారని ముందే ఊహించాను. ఆల్ట్ న్యూస్లో పనిచేస్తున్నప్పుడు, ప్రతీక్ సిన్హా, నేను ఎప్పుడైనా అరెస్టు కావచ్చని తెలుసు. అయితే, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ టీవీలో పాల్గొన్న చర్చకు సంబంధించిన క్లిప్ నేను పోస్ట్ చేసినప్పుడు, అది వైరల్ అయి అంతర్జాతీయ స్థాయిలో స్పందనలు వచ్చినప్పుడు, నన్ను కచ్చితంగా అరెస్ట్ చేస్తారని అనుకున్నా.
ఇదేం రహస్యంగా జరిగింది కాదు. నాకు వ్యతిరేకంగా ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ నడిచింది. నన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో దేశంలో జరిగిన సంఘటనలకు నేనే కారణమంటూ ట్విట్టర్లో ప్రచారం చేశారు" అంటూ జుబేర్ చెప్పుకొచ్చారు.
జైల్లో, పోలీసు కస్టడీలో తన అనుభవాలను వివరించారు.
"నేను చాలా మంది పోలీసులతో కలిసి ఉన్నాను. జైలు అధికారులు నన్ను గౌరవంగా చూశారు. కానీ వారు నాపై నమోదు చేస్తున్న కేసులు నన్ను బాగా భయపెట్టాయి. దిల్లీ కేసులో నన్ను తీహార్ జైలుకు పంపినప్పుడు, నేను బెయిల్ కోసం ఎదురు చూశాను. కానీ, ఒక వారం తరువాత ఉత్తరప్రదేశ్లో నాపై ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వాటిపై దర్యాప్తు కోసం ఒక సిట్ కూడా ఏర్పాటుచేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల సిట్ ఎలా పనిచేస్తుందో తెలిసు కాబట్టి, నా ఆశలన్నీ వదులుకున్నాను.
నేను చాలా కాలం జైలులో ఉండటానికి సిద్ధపడిపోయాను. నన్ను ఏదో ఒక పెద్ద కేసులో ఇరికిస్తారేమోనని భయపడ్డాను. అందుకే సుప్రీంకోర్టు తీర్పు నాకు చాలా కీలకం. అధికార పీఠం టార్గెట్ చేసిన వారి స్వేచ్ఛను కాపాడండంలో ఇది చారిత్రక నిర్ణయమని భావిస్తున్నాను" అని చెప్పారు.
జుబేర్నే ఎందుకు టార్గెట్ చేశారన్న ప్రశ్నపై స్పందిస్తూ, "అసమ్మతి తెలిపేవారిని, ఫ్యాక్ట్-చెక్ చేసే జర్నలిస్టుల నోరు నొక్కేయాలని చూస్తోందీ ప్రభుత్వం. ఈ మొత్తం వ్యవహారంలో నా మతం కూడా ఒక చిన్న పాత్ర పోషించదని అనుకుంటున్నారు. ఇతరులకు నన్ను ఒక ఉదాహరణగా చూపించాలనుకున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే 10-15 రాష్ట్రాల్లో మీపై యాదృచ్చిక ఎఫ్ఐఆర్లు నమోదు చేయగలదు, ఏళ్ల తరబడి జైల్లో పెట్టగలదన్న సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. నా మీద యాదృచ్చికంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు" అని ఆయన చెప్పారు.