కోవిడ్-19: వంద కోట్ల డోసుల వ్యాక్సీన్లను ప్రజలకు చైనా ఎలా ఇవ్వగలిగింది?

కోవిడ్-19

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

వంద కోట్లకుపైగా డోసుల వ్యాక్సీన్లను ప్రజలకు ఇచ్చినట్లు చైనా అధికారులు వెల్లడించారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన వ్యాక్సీన్లలో మూడో వంతు చైనాలోనే వేశారు.

ఇక్కడ వైరస్ వ్యాప్తికి సమర్థంగా కళ్లెం వేయడంతో, మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలు నత్తనడకన సాగాయి. అయితే, డెల్టా వేరియంట్ వ్యాప్తి ఆందోళనలు, ఉచిత గుడ్లు లాంటి ఆఫర్లతో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది.

జులైనాటికి దేశ జనాభా 140 కోట్ల మందిలో 40 శాతానికి పూర్తిగా వ్యాక్సీన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఇక్కడ చైనా దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సీన్లను ప్రజలకు ఇస్తున్నారు. వీటిలో సినోఫార్మ్, సినోవాక్ వ్యాక్సీన్లు ఉన్నాయి. ఈ రెండు వ్యాక్సీన్లు రెండేసి డోసులు తీసుకోవాలి.

కోవిడ్-19

ఫొటో సోర్స్, Getty Images

మొదట్లో నెమ్మదిగా..

వరుస లాక్‌డౌన్‌లు, పెద్దయెత్తున టెస్టులు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించడం లాంటి చర్యలతో ఇక్కడ వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. దీంతో వ్యాక్సీన్లు వేసుకోవడం అవసరంలేదని చాలామంది చైనావాసులు భావించారు.

గతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియల్లో చోటుచేసుకున్న కుంభకోణాలు కూడా ప్రజలు వెనకడుగు వేసేలా చేశాయి.

మొదట్లో నెమ్మదిగా జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. కేవలం గత ఐదు రోజుల్లో పది కోట్ల డోసులను ప్రజలకు ఇచ్చినట్లు వివరించింది.

దక్షిణ గ్వాంగ్‌ఝౌ ప్రావిన్స్‌లో చెలరేగుతున్న డెల్టా వేరియంట్ కేసులు కూడా ప్రజల్ని వ్యాక్సినేషన్‌ వైపు నడిపిస్తున్నాయి.

కోవిడ్-19

ఫొటో సోర్స్, Reuters

భిన్నంగా లక్షణాలు..

గ్వాంగ్‌ఝౌ ప్రావిన్స్‌లో విజృంభిస్తున్న కరోనావైరస్ కొత్త వేరియంట్ లక్షణాలు చాలా భిన్నంగా ఉన్నాయని ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు. 2019లో వూహాన్‌లో వ్యాప్తి చెందిన వైరస్ కంటే ఇది చాలా ప్రమాదకరంగా ఉందని వివరించారు.

గ్వాంగ్‌ఝౌలోని షెంజెన్ నగరానికి చెందిన ఓ యువతి న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడారు. మొదట్లో తాను వ్యాక్సీన్ వేయించుకోవడానికి ఇష్టపడలేదని, కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నానని ఆమె చెప్పారు.

‘‘ఇప్పుడు ఎలాగైనా వ్యాక్సీన్ వేయించుకోవాలని అనుకుంటున్నాను. కానీ అపాయింట్‌మెంట్ దొరకడం లేదు’’అని ఆమె వివరించారు. ఉచితంగా గుడ్లు, వ్యాక్సినేషన్ సెంటర్‌కు ఉచిత రవాణా సదుపాయాలు లాంటివి ఇప్పుడు ఇవ్వడంలేదని ఆమె అన్నారు.

అయితే, కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సీన్ వేసుకుంటే కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. అన్హుయి ప్రావిన్స్‌లో అయితే ఉచితంగా గుడ్లు ఇస్తున్నారు. బీజింగ్‌లో షాపింగ్ ఓచర్లు ఇస్తున్నారు.

ఈ ఏడాది చివరినాటికి 70 శాతం మంది ప్రజలకు వ్యాక్సీన్లు వేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది.

కోవిడ్-19

ఫొటో సోర్స్, Getty Images

మూడు వ్యాక్సీన్లకు అనుమతి

అత్యవసరంగా ప్రజలకు ఇచ్చేందుకు మూడు వ్యాక్సీన్లకు చైనా అనుమతులు జారీ చేసింది. వీటిలో సినోఫార్మ్, సినోవాక్ వ్యాక్సీన్లు కూడా ఉన్నాయి. వీటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా ఆమోదం తెలిపింది.

ఫిలిప్పీన్స్, చిలీ, బ్రెజిల్, ఇండోనేసియా, మెక్సికో, థాయ్‌లాండ్, టర్కీ తదితర దేశాల్లో ఇప్పటికే ఈ రెండు వ్యాక్సీన్లను ప్రజలకు ఇస్తున్నారు.

సినోఫార్మ్ వ్యాక్సీన్ వేసుకుంటే తీవ్రమైన కోవిడ్-19 లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యే ముప్పు 79 శాతం వరకు తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

మరోవైపు సినోవాక్ తీసుకుంటే తీవ్రమైన లక్షణాలు వచ్చే ముప్పు 51 శాతం, ఆసుపత్రి పాలయ్యే ముప్పు 100 శాతం తగ్గుతుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)