కోవిడ్ చికిత్సకు కొత్త థెరపీ.. మరణం ముప్పును ఐదు రెట్లు తగ్గిస్తుందంటున్న పరిశోధకులు

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ హెల్త్ ఎడిటర్
  • ప్రచురణ

కోవిడ్ నుంచి రోగుల ప్రాణాలను కాపాడే కొత్త థెరపీని కనిపెట్టారు.

ఈ థెరపీలో శరీరంలోని వైరస్‌ను నాశనం చేయడానికి యాంటీబాడీలను నేరుగా నరాల్లోకి ఎక్కిస్తారు.

కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ముగ్గురు రోగుల్లో ఒకరికి ఈ థెరపీ పని చేస్తోందని రికవరీ ట్రయల్స్ ఫలితాల్లో తేలింది.

కోవిడ్ చికిత్సలో మలుపు

అయితే, వైరస్‌తో పోరాడేందుకు శరీరంలో సొంతంగా యాంటీబాడీలు తయారవ్వని వారికి మాత్రమే ఈ చికిత్సను చేయాలి. దీని ఖరీదు కాస్త ఎక్కువే. దీని ఖరీదు 1000-2000 పౌండ్లు (సుమారు 1,03,487 రూపాయిలు) ఉంటుంది.

ఈ ట్రయల్స్‌లో 37 సంవత్సరాల కింబర్లీ ఫెదర్‌స్టోన్ చికిత్స తీసుకున్నారు.

"నేను హాస్పిటల్‌లో చేరే నాటికి ఈ ట్రయల్స్ జరుగుతూ ఉండటం వల్ల ఈ చికిత్స తీసుకోగలిగాను. ఇది నిజంగా నా అదృష్టం" అని అన్నారు.

"ఈ చికిత్స పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి అవసరమైన ట్రయల్స్‌లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది" అని చెప్పారు.

రీజెనోరోన్ తయారు చేసిన ఈ మోనోక్లోనల్ యాంటీబాడీలు వైరస్‌కు అతుక్కుని, ఇన్ఫెక్షన్ ఇతర కణాలకు వ్యాపించి రెట్టింపు అవ్వకుండా నిరోధిస్తుంది.

యూకే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సుమారు 10,000 మంది రోగులపై ఈ ట్రయల్స్‌ నిర్వహించారు.

ఈ ఔషధం రోగుల్లో మరణించే ముప్పు, ఆసుపత్రిలో ఉండే రోజులను (సగటున నాలుగు రోజులు), వెంటిలేటర్‌పై ఉండే అవసరాన్ని గణనీయంగా తగ్గించింది.

"రెండు రకాల యాంటీబాడీలను నరాల ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టడం వల్ల మరణించే ముప్పును అయిదు రెట్లు తగ్గిస్తుంది" అని జాయింట్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ సర్ మార్టిన్ ల్యాండ్రే చెప్పారు.

"ఈ యాంటీబాడీలు తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మరణించే ముప్పు తగ్గించగలమని అర్ధమయింది" అని అన్నారు.

తీవ్రమైన అనిశ్చితి

ఈ చికిత్సను యాంటీ ఇన్ఫలమేటరీ ఔషధం డెక్సామెథాసోన్‌తో కలిపి చేస్తారు. దాంతో కరోనా బారిన తీవ్రంగా పడిన వారికి కూడా మరణించే ముప్పును మూడొంతులు తగ్గిస్తుంది.

అయితే యాంటీబాడీల ద్వారా చేసే చికిత్స సరైన విధానమా కాదా అనే అంశంపై చాలా అనిశ్చితి నెలకొని ఉందని మరో అధ్యయనకర్త సర్ పీటర్ హోర్బీ అన్నారు.

ఈ చికిత్స వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఉదాహరణకు కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో చికిత్స చేస్తే కోవిడ్ రోగులు త్వరగా కోలుకుంటారని గతంలో చెప్పారు. కానీ ఆ సిద్ధాంతం ఇప్పుడు పని చేయడం లేదని అంటున్నారు.

కానీ ఈ రికవరీ ట్రయల్స్‌లో వాడిన యాంటీబాడీ చికిత్సలో ల్యాబ్‌లో తయారు చేసిన రెండు ప్రత్యేకమైన యాంటీబాడీలతో కూడిన భారీ డోసులు ఉంటాయి. ఇవి వైరస్‌కు అతుక్కుని బాగా పని చేస్తాయని చెబుతున్నారు.

"సొంతంగా యాంటీబాడీలు తయారు చేసుకోలేని కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగుల్లో కూడా ఈ థెరపీ వైరస్‌పై దాడి చేసి ప్రాణాలు పోయే ముప్పును తగ్గిస్తుందని తెలుసుకోవడం చాలా మంచి విషయం" అని సర్ పీటర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)