నౌదీప్ కౌర్ బెయిలుపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్న పంజాబ్-హరియాణా హైకోర్టు: Newsreel

ప్రచురణ

కార్మికుల హక్కుల కోసం గళమెత్తిన 23 ఏళ్ల నౌదీప్ కౌర్ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు(ఫిబ్రవరి 22) పంజాబ్, హరియాణా హైకోర్టులో విచారణ జరగనుంది. నౌదీప్ కౌర్ నెలకు పైగా జైల్లో ఉన్నారు.

సోనిపత్ పోలీసులు పంజాబ్ ముక్తసర్‌కు చెందిన నౌదీప్ కౌర్‌ను జనవరి 12న అరెస్ట్ చేశారు. ఆమెపై కుండలీ ఇండస్ట్రియల్ ఏరియాలో హత్యాయత్నం, అక్రమ వసూళ్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

హరియాణా కుండలీ ఇండస్ట్రియల్ ఏరియాలో వేతన బకాయిల కోసం పోరాడుతున్న కార్మికులతో కలిసి నౌదీప్ కౌర్ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

పోలీసులు ఆమెను అక్కడినుంచే అరెస్ట్ చేశారు. నౌదీప్‌పై రెండు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 148, 149, 186, 332, 379-బి, 307(హత్యాయత్నం) ప్రకారం ఈ కేసులు నమోదయ్యాయి. పోలీసులపై ఆమె కర్రతో దాడి చేశారని కూడా ఆరోపణలున్నాయి.

ఇంతకు ముందు, గత ఏడాది డిసెంబర్ 28న సోనిపత్‌లోని కుండలీ పోలీస్ స్టేషన్‌లోనే ఆమెపై ఒక కేసు నమోదైంది.

ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని, వారిపై దాడి చేశారని అప్పట్లో ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

నౌదీప్ కౌర్ ప్రస్తుతం హరియాణాలో కర్నాల్ జైల్లో ఉన్నారు. డిసెంబర్ 28, జనవరి 12న నమోదైన కేసుల్లో ఆమెకు బెయిల్ లభించింది.

ఇప్పుడు ఫిబ్రవరి 22న హత్యాయత్నం కేసులో ఆమె వేసిన బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగనుంది.

ఈ కేసులో సోనిపత్ జిల్లా సెషన్స్ కోర్టు గత సోమవారం ఆమెకు బెయిల్‌ మంజూరు చేయలేదని నౌదీప్ కౌర్ లాయర్ హరిందర్ సింగ్ బైంస్ చెప్పారు.

టెక్సాస్ పడిపోయిన ఉష్ణోగ్రతలు, చుక్కలు చూపిస్తున్న కరెంటు బిల్లులు

అమెరికాలోని టెక్సాస్‌లో గత వారం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో కొందరి కరెంట్ బిల్లులు చుక్కలనంటాయని, వాటిని టెక్సాస్ ప్రభుత్వమే చెల్లించాలని హూస్టన్ మేయర్ డిమాండ్ చేశారు.

"భారీగా వచ్చిన కరెంటు బిల్లులన్నీ టెక్సాస్ ప్రభుత్వానికి వెళ్లాలి" అని మేయర్ సిల్విస్టర్ టర్నర్ సీబీఎస్ న్యూస్‌తో అన్నారు.

పోయిన వారం కొన్ని రోజులు వాడినందుకే తమ కరెంట్ బిల్లులో 16 వేల డాలర్లు అనదపు చార్జీలు వచ్చాయని కొంతమంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు.

ఇక్కడ చలి మైనస్ 18 డిగ్రీలకు చేరింది. టెక్సాస్‌లో గత 30 ఏళ్లలో లేనంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

శీతాకాలంలో మంచు దుప్పటి కప్పేసే టెక్సాస్‌లో సాధారణంగా శీతాకాలం వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. కానీ, ప్రస్తుత అసాధారణ వాతావరణం వల్ల అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో 70 మంది చనిపోయారు.

అతి శీతల ఉష్ణోగ్రతల నుంచి టెక్సాస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

టెక్సాస్‌లో కరెంటు కోతల వల్ల లక్షల మంది సతమతం అవుతున్నారు. విద్యుత్ సరఫరాను చాలావరకూ పునరుద్ధరించినప్పటికీ, ఆదివారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో 30 వేల మంది ఇంకా కరెంటు లేకుండానే ఉన్నారని poweroutage.us చెప్పింది.

సేవింగ్స్‌తో కరెంటు బిల్లు కట్టారు

"కరెంటు బిల్లు 16 వేల డాలర్లకు పైగా రావడంతో, దాన్ని కట్టడానికి నా సేవింగ్స్ మొత్తం ఖర్చు చేశాను" అని డల్లాస్‌లోని అమెరికా మాజీ సైనికుడు విటెరన్ స్కాట్ విల్లోబీ న్యూయార్క్ టైమ్స్‌కు చెప్పారు.

వాతావరణం వల్ల ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలా వ్యవస్థ లేదని సీబీఎస్‌తో మాట్లాడిన మేయర్ టర్నర్ ఆరోపించారు.

"ఇవన్నీ ఊహించగలిగేవే. నేను 2011లో కూడా ఇదే చెప్పాను. చుక్కలనంటేలా ఉన్న ఈ కరెంటు బిల్లులు చెల్లించాల్సింది వినియోగదారులు కాదు, ఈ వారం ఇలా జరగడంలో వాళ్ల తప్పేం లేదు" అన్నారు.

భారీగా వచ్చిన కరెంటు బిల్లులు చెల్లించడానికి టెక్సాస్, ఫెడరల్ ప్రభుత్వాలు సాయం చేయాలని ఫోర్ట్ వర్త్ మేయర్ బెస్టీ ప్రైస్ కూడా సీబీఎస్‌తో అన్నారు.

ఆకాశాన్నంటిన కరెంటు బిల్లులతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ అధికారులను ఆదేశించారు.

"అతి శీతల వాతావరణం వల్ల పెరిగిన కరెంటు బిల్లుల నుంచి టెక్సాస్ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది" అని ఆయన తమ ప్రతినిధులతో జరిగిన ఒక సమావేశంలో అన్నారు.

టెక్సాస్‌లో పెను విపత్తు వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం ప్రకటించారు. ఆయన ప్రకటనతో సహాయక చర్యలకు ఫెడరల్ ప్రభుత్వం మరిన్ని నిధులు అందనున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)