మలేసియా పెట్రోనాస్ టవర్ల రూపకర్త సీజర్ పెలీ కన్నుమూత

ప్రచురణ

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ టవర్ల రూపకర్త, అర్జెంటీనా-అమెరికా ఆర్కిటెక్ట్ సీజర్ పెలీ తన నివాసం న్యూ హెవెన్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు.

1998లో పెట్రోనాస్ టవర్లు ప్రారంభమయ్యే సమయానికి ప్రపంచంలో అవే అత్యంత ఎత్తైన భవంతులు. ఆ తర్వాత కూడా ఆరేళ్లపాటు ఆ రికార్డు అలాగే పదిలంగా ఉంది.

లండన్‌లోని ఒన్ కెనడా స్క్వేర్ టవర్, జపాన్‌లోని ఒసాకాలో ఉన్న నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్‌ల రూపకర్త కూడా పెలీనే.

పెలీ మరణాన్ని అర్జెంటీనా గవర్నర్ కార్యాలయం ధృవీకరించింది. "గొప్ప ఆర్కిటెక్ట్ సీజర్ పెలీ మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాం" అని గవర్నర్ జువాన్ మంజుర్ ట్విటర్లో ప్రకటించారు.

"నిస్సందేహంగా ఆయనో గొప్ప సృష్టికర్త. ఆయన వారసత్వం ఆయన రూపొందించిన కట్టడాల్లో కొనసాగుతూనే ఉంటుంది. ఆయన కుటుంబానికి నా సానుభూతి వ్యక్తంచేస్తున్నా" అని గవర్నర్ తెలిపారు.

అర్జెంటీనాకు పెలీ గర్వకారణమని అధ్యక్షుడు మౌరిసియో మాక్రి ట్వీట్ చేశారు.

అర్జెంటీనాలోని తుకుమన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పెలీ 1952లో అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.

1977 నుంచి 1984 వరకూ యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కు డీన్‌గా పనిచేశారు. ఆయన పదుల సంఖ్యలో అవార్డులు పొందారు. అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి బంగారు పతకం కూడా అందుకున్నారు.

న్యూయార్క్ లోని వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్, చిలీలోని గ్రాన్ టొరే శాంటియాగో భవనం, శాన్‌ఫ్రాన్సిస్కోలో 2018లో ప్రారంభమైన ట్రాన్స్‌బే ట్రాన్సిట్ సెంటర్ కూడా ఈయన డిజైన్ చేసినవే.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)