Uttar Pradesh auto: ఆటోలో 27 మంది ప్రయాణీకులు.. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ కింద ఆటోను సీజ్ చేసిన పోలీసులు

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

ఒక ఆటోలో ఎంత మంది పడతారు? మాములుగా అయితే డ్రైవర్ కాకుండా నలుగురు లేదా అయిదుగురు. కొందరు వెనుక కూడా కూర్చొబెడతారు కాబట్టి సుమారు 10 లేదా 12 దాకా ఎక్కుతుంటారు.

కానీ 27 మందిని ఎక్కించడం సాధ్యమేనా?

ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు ఉత్తర్ ప్రదేశ్ ఫతేపుర్‌కు చెందిన ఒక ఆటో డ్రైవర్. ఆటోలో కెపాసిటీకి మించి ఎక్కించుకోవడం మాములే కానీ ఇలా 27 మందిని చూసి పోలీసులు సైతం ఆశ్చర్య పోయారు.

బజాజ్ మాక్సిమా ఆటోలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు మొత్తం 27 మంది ఎక్కారు. ఆటో నుంచి దిగుతున్నప్పుడు ఒక్కోక్కరిని పోలీసులు లెక్కించారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఫతేపుర్‌లో ఓవర్ స్పీడ్‌లో వెళ్తున్న ఆ ఆటోను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా డ్రైవర్ ఆపకుండా వెళ్లారు. దీంతో చేజ్ చేసి ఆటోను పోలీసులు పట్టుకున్నారు.

‘20 మందికి పైగా ఉన్న ప్రయాణికులను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వారు షాక్‌కు గురయ్యారు’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికతో ఫతేపుర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ రాజేశ్ కుమార్ తెలిపారు.

ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ కింద ఆటోను పోలీసులు సీజ్ చేశారు.

సాధారణంగా మన వద్ద ఆటోలు, ట్రక్కుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు. చిన్నచిన్న పట్టణాలు, పల్లెటూర్లలో పోలీసుల నిఘా తక్కువగా ఉంటుంది కాబట్టి ఓవర్ లోడ్‌తో ఆటోలు ప్రయాణిస్తూ ఉంటాయి. కూలీలు, విద్యార్థులతో కిక్కిరిసి ప్రయాణించే ఆటోలను మనం సర్వసాధారణంగా చూస్తుంటాం.

ఇక ఫతేపుర్‌లో ఒకే ఆటోలో 27 మందిని ఎక్కించడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆటో నుంచి ప్రయాణికులు దిగుతున్న ఆ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలా మంది యూజర్లు ఫన్నీగా కామెంట్లు కూడా పెడుతున్నారు.

ఇది ఆటో కాదు 27 సీట్ల బస్సు అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు.

కొందరు గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వాలంటూ ట్వీట్ చేస్తున్నారు.

మరికొందరు ఈ ఆటోను మ్యూజియంలో పెట్టాలని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)