టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి వార్నింగ్ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించేందుకు నేను రూ.25 కోట్లు లంచం తీసుకున్నానని ఆరోపించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఏడు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ హెచ్చరించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘క్షమాపణ చెప్పకపోతే రూ.కోటి పరువునష్టం దావా వేస్తా' అని ఠాగూర్‌ హెచ్చరించారు.

ఈ మేరకు న్యాయవాది ఆర్‌.రవీంద్రన్‌ ద్వారా లీగల్‌ నోటీసులు పంపించారు.

ఈ నెల 3న టీఆర్‌‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సుధీర్‌రెడ్డి తనపై నిరాధా రమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

ఆ వ్యాఖ్యలు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయన్నారు.

తన ప్రతిష్ఠను దిగజార్చేలా చేసిన తప్పుడు ఆరోపణలు తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని, తాను మానసిక క్షోభకు గురయ్యాయని, అందుకే లీగల్‌ నోటీసు పంపినట్లు వెల్లడించార’’ని ఆ కథనంలో రాశారు.

అనుపమ పరమేశ్వరన్: 'ఒకరిని బాగా ప్రేమించాను, తరువాత బ్రేకప్ అయింది'

'గతంలో ఒకరిని ప్రేమించాను. అతన్ని బాగా ఇష్టపడ్డాను. కానీ తర్వాత బ్రేక్‌ అప్‌ అయింది.'' అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ చెప్పారంటూ ‘ఈనాడు’ కథనం ప్రచురించింది.

‘‘ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనుపమ సమాధానాలిచ్చారు.

'మీ ప్రేమ గురించి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చ నడుస్తోంది. దీనికి మీరేమంటారు? అని ప్రశ్నిస్తే.. పై విధంగా స్పందించారు.

''అయితే నేనిప్పుడు దాని నుంచి బయటపడ్డాను. పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టా. పనిని ప్రేమిస్తే అంతకంటే ఆనందం ఎక్కడ ఉంటుంది?'' అని వివరించారు.

ప్రస్తుతం అనుపమ '18పేజెస్‌', 'కార్తికేయ-2', 'రౌడీబాయ్స్‌' చిత్రాల్లో నటిస్తోంది. మలయాళంలోనూ ఓ సినిమా ఒప్పుకొన్నట్లు ఈ సందర్భంగా తెలిపార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

భూముల డిజిటల్‌ సర్వేకు ప్రత్యేక నెట్‌వర్క్‌

ఏపీలో భూవివాదాల సమస్యకు శాశ్వతంగా తెరదించడంతోపాటు భూ రికార్డుల తారుమారుకు వీల్లేని విధంగా భూముల డిజిటల్‌ సర్వే చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇందులో భాగంగా భూముల హద్దులే కాకుండా వాటి విస్తీర్ణాన్నీ ఖరారు చేయాలనే యోచనతో ముందుకెళ్తోందని ‘సాక్షి’ తన కథనంలో తెలిపింది.

‘‘ఇందుకోసం రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది.

డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌) విధానంలో కేవలం భూముల హద్దులు (బౌండరీలు) మాత్రమే నిర్ధారించగలమని, ఆయా భూముల విస్తీర్ణం తేల్చలేమని భావిస్తున్న రెవెన్యూ శాఖ... ఇందుకోసం ప్రత్యేక నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

విజువల్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌ (వీఆర్‌ఎస్‌)-గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) పరిజ్ఞానాలను ఉపయోగించి రూపొందించే ఈ నెట్‌వర్క్‌తో గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్ల (జీసీపీ)ను అనుసంధానించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ఇందుకోసం డ్రోన్లను ఉపయోగించి తీసిన భూముల చిత్రాలను వాడాలని నివేదికలో పేర్కొంద’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)