వైఎస్ జగన్ బయోపిక్: 'యాత్ర' దర్శకుడు ఇప్పుడు ఏపీ సీఎం జీవిత చరిత్ర తెరకెక్కిస్తున్నారా - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'యాత్ర'కు సీక్వెల్‌ ఉంటుందని ఆ సినిమా దర్శకుడు మహీ వి.రాఘవ్ గతంలోనే ప్రకటించారని.. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బయోపిక్‌ని రూపొందించాలనుకుంటున్నారని తెలిసిందంటూ ‘సాక్షి’ పత్రిక కథనం రాసింది.

‘‘జగన్‌ జీవితంపై సినిమా అనే వార్త వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై వైఎస్‌ జగన్‌ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో, చిత్రపరిశ్రమలో చర్చలు మొదలయ్యాయి.

జగన్‌ పాత్రలో ఎవరు కనిపిస్తారు? అనేది మరింత ఆసక్తిగా మారింది. 'జగన్‌గారి పాత్రలో నటించేందుకు నన్ను సంప్రదిస్తే కచ్చితంగా నటిస్తా' అని తమిళ హీరో సూర్య ఓ ఇంటర్వ్యూలో విలేకరి అడిగితే చెప్పారు. దీంతో సూర్య నటిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి.

ఆ తర్వాత అజ్మల్‌ నటిస్తారనే వార్తలూ వచ్చాయి. అయితే తాజాగా జగన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు, 'స్కామ్‌ 1992' వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ ప్రతీక్‌ గాంధీ నటించనున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది.

ప్రతీక్‌ ఆహార్యం, హావభావాలు జగన్‌కి దగ్గరగా ఉంటాయని భావించి, మహీ ఆయన్ను ఎంపిక చేశారని సమాచారం.

ఈ బయోపిక్‌ గురించి దర్శకుడు చెప్పగానే నటించడానికి ప్రతీక్‌ అంగీకారం తెలిపారని భోగట్టా. దీన్ని ప్యాన్‌ ఇండియా చిత్రంగా తీయనున్నారట. జగన్‌ సొంతంగా పార్టీ స్థాపించడం, పాదయాత్ర, ఎదుర్కొన్న సవాళ్లు, ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలిసింద’’ని ఆ కథనంలో రాశారు.

పరుచూరి మల్లిక్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు

కోవిడ్‌పై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారన్న అభియోగంపై విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన కెమికల్‌ ఇంజనీర్‌ పరుచూరి మల్లిక్‌కు తెలంగాణ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీచేశారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.

‘‘ఈ నెల 5న హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని మల్లిక్‌ను ఆదేశించారు.

గత నెల 7న ఓ టీవీ చానల్‌లో చర్చ సందర్భంగా మల్లిక్‌ కొవిడ్‌పై ప్రజల్లో భయం కలిగించేలా అభ్యంతరకర పదజాలం వాడారని తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ గత నెల 14న సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా, కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాను అడ్మిన్‌గా నిర్వహిస్తున్న కొవీకేర్‌ వాట్సాప్‌ గ్రూపును గురువారం నుంచి అర్ధంతరంగా నిలిపివేశారని మల్లిక్‌ ఆరోపించారు.

దీనికి నిరసనగా శుక్రవారం ఆలూరి టవర్స్‌లో రిలే దీక్ష నిర్వహిచార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

'వారసత్వ' రేసులో రామప్ప

తెలంగాణ గడ్డపై అద్భుత శిల్ప సంపదకు నెలవైన చారిత్రక రామప్ప ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే అవకాశం చేరువైందని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

‘‘ఈ అద్భుత ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్‌ చేసింది.

ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా సాధించాలని రాష్ట్రప్రభుత్వం ఎంతోకాలంగా కృషిచేస్తున్న విషయం తెలిసిందే.

గత నెల 23న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ అధ్వర్యంలో ఎంపీలు, ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పాటిల్‌ను కలిసి రామప్పకు ప్రపంచవారసత్వ హోదా వచ్చేలా కృషిచేయాలని కోరారు.

దాంతో కేంద్ర ప్రభుత్వం రుద్రేశ్వర (రామప్ప) దేవాలయంతోపాటు గుజరాత్‌లోని సింధు నాగరికత నాటి పట్టణమైన ధోలవీరను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాకు నామినేట్‌ చేసింది.

చైనాలో ఈ నెల 16 నుంచి 31వరకు వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ 44వ సమావేశాలు జరుగనున్నాయి.

ఇందులో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 255 ప్రతిపాదనలను పరిశీలించనున్నారు.

ఈ సమావేశాల్లోనే రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ 167 దేశాలకు చెందిన 1,121 కట్టడాలు, ప్రదేశాలను ఇప్పటివరకు ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో చేర్చగా, భారత్‌ నుంచి 38 వారసత్వ ఆస్తులకు స్థానం దక్కింది. యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌ (ఐకోమాస్‌) ప్రతినిధి వాసుపోశానందన 2019లో రామప్పను పరిశీలించి వెళ్లారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరేందుకు ఈ ఆలయానికి అన్ని అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)