అసోం: తప్పిపోయిన చిరుతపులి పిల్లను తల్లి వద్దకు ఇలా క్షేమంగా చేర్చారు

ప్రచురణ

ఈశాన్య భారతదేశంలోని అసోం రాష్ట్రంలో అటవీ శాఖ అధికారులు తప్పిపోయిన పులి పిల్లను తల్లితో కలిపారు.

అసోంలోని ఒక తేయాకు తోటలోని కందకంలో చిక్కుకున్న రెండు నెలల ఆడ పులిపిల్లను గ్రామస్థులు కనిపెట్టారు.

ఆ "పులి పిల్ల ఉత్సాహంగా ఉందని, దానికి ఎటువంటి గాయాలు అవ్వలేదని, కాకపొతే శరీరంలో నీటి స్థాయి కాస్త తగ్గింది" అని దానిని పరీక్షించడానికి వెళ్లిన వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో పని చేసే వెటెర్నేరియన్ డాక్టర్ ఖానిన్ చాంగ్‌మయి బీబీసీకి చెప్పారు.

భారతదేశంలో 12,500కు పైగా చిరుత పులులు ఉన్నాయి. పులుల ఆవాసాలు క్షీణిస్తుండటంతో, అవి చాలా సార్లు అడవులకు దగ్గరగా ఉండే గ్రామాల్లోకి చొరబడుతూ ఉంటాయి.

ఇటీవల కాలంలో చిరుతలు గ్రామాల్లోకి ప్రవేశించి పశుసంపదకు ప్రాణనష్టం కలిగిస్తుండటంతో మనుషులకు - జంతువులకు మధ్య వైరం పెరుగుతోంది. అవి కొన్ని సార్లు జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి చొరబడి మనుషుల పై కూడా దాడులు చేశాయి.

ఇటువంటి సంఘటన టిన్‌సుకియా జిల్లాలో నాటున్‌గావ్ గ్రామంలో మే 23న చోటు చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

"తేయాకు తోటలో పని చేసే కార్మికులు చిరుతను చూడగానే, చుట్టు పక్కల గ్రామాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వారు అప్రమత్తమై అలారం మోగించడంతో, అది పారిపోయింది" అని డాక్టర్ చాంగ్‌మయి చెప్పారు.

తేయాకు తోటల యజమాని పులి పిల్ల రోదన విని కందకం వరకు వెళ్లారని చెప్పారు. అది దానంతట అదే బయటకు రాలేకపోవడంతో, గ్రామస్థులు దానిని రక్షించి, దగ్గర్లో ఉన్నవారి ఇంటికి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు.

పులి శరీరంలో నీరు బాగా పోవడంతో, దానికి 12-20 మిల్లీలీటర్ల ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్) ఇచ్చినట్లు చాంగ్‌మయి చెప్పారు.

ఈ గ్రామం రెండు చిన్న అభయారణ్యాలకు దగ్గరగా ఉంది. ఈ గ్రామాన్ని పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులకు కేంద్రంగా ఉన్న డిబ్రు సోయిఖోవా నేషనల్ పార్కు నుంచి ఒక నది వేరు చేస్తుంది.

"ఆ పులి పిల్ల కోసం వెతుకుతూ చిరుత వెనక్కి వస్తుందేమోనని గ్రామస్థులు ఆందోళన చెందినట్లు డాక్టర్ చాంగ్‌మయి చెప్పారు. దాంతో గ్రామస్థులు ఆ పులి పిల్లను తీసుకుని వెళ్లి, తల్లిని పట్టుకునేందుకు వల పన్నాలని పట్టుబట్టారు. కానీ, ఆ పులి పిల్ల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోకుండా అది దొరికిన చోటే వదిలిపెట్టమని గ్రామస్థులను ఒప్పించాం" అని ఆయన చెప్పారు.

ఆ పులి పిల్లను ఒక కార్డుబోర్డు పెట్టెలో పెట్టి అది దొరికిన ప్రదేశంలోనే వదిలిపెట్టారు. ఆ పులి పిల్ల దానంతట అదే బయటకు రాకుండా ఆ పెట్టెను తేలికగా టేప్‌‌తో సీల్ చేసి తల్లి మాత్రమే దానిని తెరవగలిగేటట్లుగా అమర్చారు.

"పులి పిల్లను వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఆ పులిపిల్ల ఆరోగ్య పరిస్థితిని ఆ సాయంత్రం పరిశీలించి మరి కాస్త ఓఆర్‌ఎస్ ద్రవం ఇచ్చాం. ఆ పులి పిల్ల పై కుక్కలు దాడి చేయకుండా గ్రామస్థులు కూడా కాపలా ఉన్నారు" అని డాక్టర్ చాంగ్‌మయి చెప్పారు.

"తల్లీ పిల్లా వేరు పడిన 12 గంటల లోపే, తల్లి తన బిడ్డను కనిపెట్టగలిగింది" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)