'కోవిడ్ సోకిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు?' ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. మే 3కి విచారణ వాయిదా - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

'కోవిడ్ సోకిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు?' ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. మే 3కి విచారణ వాయిదా

ఇంటర్మీడియట్ పరీక్షలపై ఆంధ్రప్రదేశే ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని హైకోర్టు సూచించింది. ''సుమారు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధన సిబ్బంది ఈ పరీక్షల ప్రక్రియలో భాగం కావాల్సిఉంటుంది. అందువల్ల ప్రభుత్వం దీనిపై మరోసారి ఆలోచించాలి. మే 3కి విచారణ వాయిదా వేస్తున్నాం'' అని కోర్టు పేర్కొంది.

మే 3న విచారణ సందర్భంగా ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పాలని కోర్టు సూచించింది.

''కోవిడ్ సోకిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు? నిబంధనల ప్రకారం వారు ఐసోలేషన్‌లో ఉండాలి కదా'' అని కోర్టు ప్రశ్నించింది.

అయితే, కోవిడ్ సోకిన వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పగా అదెలా సాధ్యమని కోర్టు ప్రశ్నించింది.

కోవిడ్ సోకిన విద్యార్థులు మానసికంగానూ పరీక్షలకు సిద్ధంగా ఉండలేరని.. ఇతర రాష్ట్రాలలో పరీక్షలు వాయిదా, రద్దు చేసిన విషయాలతో పాటు రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది.

అమెరికా నుంచి దిల్లీ చేరిన మొదటి విడత సాయం

కరోనా సంక్షోభంలో విలవిలలాడుతున్న భారత్‌కు సాయం అందిస్తామని అమెరికా ప్రకటించిన తర్వాత శుక్రవారం ఉదయం ఆ దేశం నుంచి సహాయ సామగ్రితో వచ్చిన మొదటి విమానం దిల్లీ చేరింది.

వచ్చే వారం నుంచి ఇలాంటి మరిన్ని విమానాలు దేశానికి రానున్నట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది.

ఈ విమానాల్లో ఆక్సిజన్ సపోర్ట్ సిస్టమ్స్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, ఆక్సిజన్ జనరేషన్ యూనిట్స్, పీపీఈ, వాక్సీన్ తయారీకి అవసరమైన పదార్థాలు, రాపిడ్ టెస్టులు, ఇతర సామగ్రి కూడా పంపుతున్నారు.

కోవిడ్: 24 గంటల్లో కొత్తగా 3,86,452 పాజిటివ్ కేసులు.. 3,498 మరణాలు

భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,86,452 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,498 మంది ప్రాణాలు కోల్పోయారు.

శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,87,62,976కి చేరగా 2,08,330 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో 31,70,228 యాక్టివ్ కేసులున్నాయి.

ఇప్పటివరకు 15,22,45,179 మందికి వ్యాక్సీన్ వేసుకున్నారు.

మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ కన్నుమూత

మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ కోవిడ్‌తో మరణించారు. దిల్లీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 91 ఏళ్ల సొరాబ్జీ శుక్రవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు.

1953లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన రెండు సార్లు అటార్నీ జనరల్‌గా పనిచేశారు.

2002లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం వరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)