కోవిడ్: నాసిక్‌లోని ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 22 మంది మృతి... ట్యాంకర్ భారీగా లీక్ అవడమే కారణం

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

మహారాష్ట్రలోని నాసిక్‌లో జాకిర్ హుసేన్ ఆసుపత్రిలో ఓ ట్యాంకర్‌లో ఉన్న ఆక్సిజన్ భారీ ఎత్తున లీకైందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ ఘటన తర్వాత ఆక్సిజన్ అందక 22 మంది మరణించారని నాసిక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ఈ ప్రమాదంలో 11 మరణించినట్లు తమకు సమాచారం అందిందని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రాజేశ్ శింగానే చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

ఇది దురదృష్టకర ఘటన అని, అయితే ఇంకా దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉందని, అలాగే ఘటనపై విచారణకు కూడా ఆదేశించామని మంత్రి వెల్లడించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

ప్రమాద ఘటనతో ఏం జరిగింది?

ఆక్సిజన్ ట్యాంకులో లీకేజ్ వల్ల... సుమారు అర గంటకు పైగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. ఆక్సిజన్ తీసుకుంటున్న రోగుల్లో తక్కువ ఆక్సిజన్‌తో ఉన్న సరఫరా నిలిచిపోతే బతకడం సాధ్యమేనని, కానీ వెంటిలేటర్ మీద ఉన్న రోగులు మాత్రం ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతే బతకడం కష్టమని వైద్యాధికారులు చెప్తున్నారు.

‘‘మా నాయనమ్మకు ఆక్సిజన్ అందిస్తున్నారు. అది ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమయిందని నేను వైద్యులను అడిగితే, ఆక్సిజన్ అయిపోందని చెప్పారు.’’ అని విక్కీ జాదవ్ అనే యువకుడు మీడియాతో అన్నారు.

ఈ ఘటనలో విక్కీ జాదవ్ నాయనమ్మ మరణించారు.

టెక్నికల్ ఇంజినీర్ల సాయంతో లీకేజీని అరికట్టామని, ప్రస్తుతం ట్యాంకుల్లో 25 శాతం మాత్రమే ఆక్సిజన్ మిగిలి ఉందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నాసిక్ మున్సిపల్ కమిషనర్ కైలాష్ జాదవ్ అన్నారు.

ఆసుపత్రిలో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు?

ఆసుపత్రిలో 131 మంది పేషెంట్లు ఆక్సిజన్ మీద ఉండగా, 15మంది వెంటిలేటర్ మీదున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ నితిన్ రౌతే తెలిపారు.

నాసిక్ లో 139 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా, ప్రస్తుతం 84 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.

ప్రధాని తీవ్ర విచారం

నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకేజ్ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

'' ఈ ఘటన హృదయ విదారకమైంది. ఈ మరణాలు కలచి వేస్తున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను'' అంటూ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.

నాసిక్ ఘటన ఆందోళనకరమని, ఆ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లను వెంటనే ఇతర ఆసుపత్రులకు తరలించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వాన్ని కోరారు.

మరోవైపు మృతుల సంఖ్య 30 నుంచి 35కు పెరిగే అవకాశం ఉందని స్థానిక శివసేన నేత సుధాకర్ బడ్గూజర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)