తెలంగాణ సీఎం కేసీఆర్: కేంద్ర మంత్రులతో ఏకాంత మంతనాలు- ప్రెస్‌ రివ్యూ

ప్రచురణ

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దిల్లీలో కేంద్ర మంత్రులతో ఏకాంత సమావేశాలు నిర్వహించారని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రముఖంగా రాసింది. దిల్లీ పర్యటనలో సీఎం పలువురు మంత్రులతో భేటీ అయ్యారని అయితే వీటిలో ఎక్కువగా ఏకాంత సమవేశాలేనని పేర్కొంది.

రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలనెవరినీ దిల్లీకి రావద్దని సూచించిన సీఎం ఒంటరిగానే దిల్లీ పర్యటన చేస్తున్నారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది. హోంమంత్రి అమిత్‌షా, జలశక్తి శాఖామంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ల నివాసాలకు అధికారులతో కలిసి వచ్చినా, సమావేశం మాత్రం ఏకాంతంగానే జరిపారని ఈ కథనం పేర్కొంది.

మంత్రి షెకావత్‌తో ఏ అంశంపై సమావేశమవుతున్నారో కూడా అధికారులకు సమాచారమివ్వలేదని వెల్లడించిది. హోంమంత్రి అమిత్‌షా ఇంటికి కూడా ఒంటరిగానే వెళ్లిన సీఎం కేసీఆర్‌ భేటీ తర్వాత వివరాలను మీడియాకు కూడా వెల్లడించలేదని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

చిత్తూరు జిల్లాలో టీడీపీ వైసీపీ వార్‌

చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు గ్రామంలో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని ఈనాడు పత్రిక రాసింది. ఇటీవల మరణించిన తమ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు అంగళ్లు గ్రామానికి వచ్చిన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది.

తెలుగుదేశం నాయకులు తమ నియోజకవర్గంలోకి రావద్దంటూ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని, దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని ఈనాడు కథనం వెల్లడించింది. వీరి గొడవ ముంబయి చెన్నై రహదారి మీద జరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయిందని పేర్కొంది.

ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయని టీడీపీ నేత నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించినట్లు ఈ కథనం పేర్కొంది.

ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ రవి మధునోహరాచారి తెలిపినట్లు ఈనాడు కథనం వెల్లడించింది.

కేంద్రంతో మమత ఢీ అంటే ఢీ

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమబెంగాల్‌లో జరిగిన దాడి వ్యవహారం మరోసారి కేంద్రం, మమతా బెనర్జీల మధ్య చిచ్చుపెట్టిందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

ఈ వ్యవహారం తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్రానికి గవర్నర్‌ నివేదిక పంపగా దీనిపై దిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలకు కేంద్రం సమన్లు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్న మమతా బెనర్జీ సర్కారు దీనిపై స్పందించరాదని నిర్ణయించినట్లు ఈ కథనం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం పంపిన సమన్లపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌, ఇదే వ్యవహారంపై ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వ సమావేశం ఉన్నందున దిల్లీకి రాలేకపోతున్నట్లు కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటన మీద పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ ధన్‌కర్‌ కూడా తీవ్ రవ్యాఖ్యలు చేశారని సాక్షి పేర్కొంది. మమతా బెనర్జీ ప్రభుత్వం నిప్పుతో చెలగాటమాడుతోందని, సీఎం స్పందన చూస్తే ఆమెకు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నట్లు కనిపించడం లేదని గవర్నర్‌ వ్యాఖ్యానించారని తెలిపింది.

మరోవైపు మమతా బెనర్జీ కూడా ఈ వ్యవహారమంతా బీజేపీ కార్యకర్తల నాటకమని ఆరోపించినట్లు సాక్షి కథనం వెల్లడించింది.

రూ.10కోట్ల చిట్టీల డబ్బుతో కుటుంబం పరార్‌

హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఓ కుటుంబం రూ.10కోట్లు వసూలు చేసి ఆ డబ్బుతో పరారైందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి పాతబస్తీలోని బండ్లగూడ-పటేల్‌నగర్‌లో నివాసముంటున్న సీఆర్‌పీఎఫ్‌ రిటైర్డ్‌ ఉద్యోగి బాబూరావు, ఆయన భార్య అంజలీ దేవి చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. చుట్టుపక్కల కుటుంబాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరు గత 30 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నారు.

అయితే ఈ నెల 5న హఠాత్తుగా ఈ కుటుంబం ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయింది. ఫోన్‌లు చేస్తే స్విచ్ఛాప్‌ అని వస్తుండటంతో ఆందోళన చెందిన కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 85 మంది బాధితులు సీసీఎస్‌ పోలీసులకు కంప్లయింట్‌ ఇచ్చారు.

ఈ కుటుంబం వద్ద చిట్టీల రూపంలో డబ్బులు పెట్టిన వారు 300మంది వరకు ఉంటారని అంచనా. కేసు నమోదు చేసుకున్నపోలీసులు బాబూరావు కుటుంబం కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)