తెలంగాణ: నాలుగు నెలల తరువాత గల్ఫ్ నుంచి సొంతూరికి చేరిన వలస కార్మికుడి మృతదేహం

రాజయ్య

ఫొటో సోర్స్, FACEBOOK

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ

గల్ఫ్‌లో మరణించిన తెలంగాణ వ్యక్తి మృతదేహం దాదాపు నాలుగు నెలల తరువాత స్వస్థలానికి చేరింది.

జగిత్యాల జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన సుంకె రాజయ్య సౌదీ అరేబియాలో కార్మికుడిగా పనిచేస్తూ మరణించారు. 55 ఏళ్ల రాజయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఈ ఏప్రిల్ ప్రారంభంలో బాత్‌రూంలో జారి పడడంతో రాజయ్య తలకు గాయం అయింది. చికిత్స సమయంలో కోమాలోకి వెళ్లారు. సౌదీ రాజధాని రియాద్‌లోనే చికిత్స పొందుతూ ఏప్రిల్ 14న ఆయన మరణించారు. ఆయన తలకు గాయమైన విషయం రాజయ్యతో కలసి పనిచేసే వారి ద్వారా ఇక్కడి కుటుంబ సభ్యులకు తెలిసింది.

''ఏప్రిల్ 14న కంపెనీ వాళ్లు ఫోన్ చేశారు. మా నాన్న చనిపోయారని చెప్పారు.'' అన్నారు రాజయ్య కుమారుడు సంకె తిరుపతి. శరీరాన్ని భారతదేశం పంపడానికి కొన్ని పత్రాలు పంపించాలని వారు కోరడంతో ఇక్కడ లాయర్లను కలసి పత్రాలు పంపించారు ఆయన కుమారుడు తిరుపతి.

అయితే అప్పటికే లాక్ డౌన్ విధించడం, అంతర్జాతీయ విమానాలు ఆగిపోవడంతో రాజయ్య మృతదేహం అప్పటి నుంచీ సౌదీలోనే ఉండిపోయింది.

''మృతదేహం తీసుకురావడం ఆలస్యం అవుతోందని గ్రామ పెద్దలం విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లాం.'' అని వివరించారు కొండాపూర్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు శేఖర్.

జగిత్యాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, సౌదీలోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు రాసి ఈ అంశంపై స్పందించాలని కోరారు.

కానీ దాదాపు నాలుగు నెలలుగా రాజయ్య మృతదేహం తరలింపులో ఎటువంటి పురోగతీ లేదు. అటు ఎన్నారైల కోసం పనిచేస్తోన్న స్వచ్చంద సంస్థలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకున్నాయి.

సౌదీలోనూ, తెలంగాణలోనూ పనినచేస్తోన్న ఎన్జీవోలు ఈ విషయంలో చట్టపరంగానూ, ఆర్థికంగానూ సహకరించాయి.

ఎట్టకేలకు శనివారం రాజయ్య మృతదేహం హైదరాబాద్ విమానాశ్రయానికి కార్గో విమానంలో వచ్చింది. అక్కడి నుంచి దాతల సహకారంతో స్వగ్రామం తరలించగా, ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి.

రాజయ్య కుమారుడు తిరుపతి

ఫొటో సోర్స్, Tirupati

ఫొటో క్యాప్షన్, రాజయ్య కుమారుడు తిరుపతి

రాజయ్య కుటుంబం పోషణ నిమిత్తం కూలి పనులపైనే ఆధారపడింది. ఒక కుమార్తెకు పెళ్లికాగా, మరో కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోంది. కుమారుడు ఐటీఐ చదువుతున్నారు.

''నాన్న అక్కడ (సౌదీలో) పనిచేసిన జీతమే ఇంకా రాలేదు. అప్పుడు జీతం గురించి అడిగితే, బాడీతో పాటూ పంపిస్తాం అన్నారు. మొదట్లో లాక్ డౌన్ కదా అనే వారు. తరువాత ఫోన్లు ఎత్తడం మానేశారు. ఫోన్ కట్ చేశారు. మధ్యలోనేమో, బాడీతో పాటూ పంపుతాం అనేవారు. మరణించిన దానికి పరిహారం కాదు కదా, అసలు ఆయన పనిచేసిన సమయంలో రావాల్సిన జీతమే ఇంకా రాలేదు'' అని బీబీసీతో చెప్పారు రాజయ్య కుమారుడు తిరుపతి.

గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయులు

అవగాహన లోపం, ఆర్థిక సమస్యలు, చట్ట పరమైన ప్రక్రియలో చిక్కులు, యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా విదేశాలలో పనిచేస్తూ మరణించిన వారి మృతదేహాలు భారతదేశానికి రావడంలో ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఇటువంటి కేసుల్లో పరిహారం పరిస్థితి అందడం కూడా గగనంగానే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)