నిర్మ‌లా సీతారామ‌న్: ‘కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్‌ను రూ. 2.7కు కొంటున్న ఏపీ ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు రూ.9కి అమ్ముతోంది’ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కేంద్ర ప్రభుత్వం ఒక యూనిట్‌కు రూ.2.70 చొప్పున విద్యుత్తు ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో వినియోగ‌దారుల‌ నుంచి రూ.9 చొప్పున‌ వ‌సూలు చేస్తారా? అని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌శ్నించిన‌ట్లు ఈనాడు క‌థ‌నం ప్ర‌చురించింది.

మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ ఏర్పాటుచేసిన జనసంవాద్‌ ర్యాలీని ఉద్దేశించి దిల్లీ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ధరకు తీసుకున్న విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం కొంత అటూఇటు ధరలకు విక్రయించుకోవచ్చు. అందులో ఇబ్బందేమీ ఉండదు. కానీ ఒక యూనిట్‌కు రూ.2.70 చొప్పున విద్యుత్తు ఇస్తే దాన్ని తొమ్మిది రూపాయ‌ల‌కు విక్ర‌యిస్తారా?’’ అని ఆమె ప్రశ్నించారు.

మ‌రోవైపు ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశమున్న ఆంధ్రప్రదేశ్‌లాంటి బలమైన రాష్ట్రం ఇప్పుడు కరప్షన్‌, కుటుంబం, కులం లాంటి రాజకీయ సమస్యల్లో చిక్కుకొని పురోగతి కరవై కష్టాలు పడుతోందని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రస్తుత సంక్లిష్ట సమయంలో పవన్‌కల్యాణ్‌ కూడా ప్రజలకు మంచి సేవలు అందించారని ప్రశంసించారు.

క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే మృత‌దేహాన్ని రోడ్డుపైనే వ‌దిలేశారు

క‌రోనావైర‌స్‌తో చ‌నిపోయిన వృద్ధుడి మృత‌దేహాన్ని మోసుకెళ్లేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో.. మున్సిప‌ల్ సిబ్బందే మృత‌దేహాన్ని జేసీబీలో త‌ర‌లించిన ఘ‌ట‌న ప‌లాస‌లో చోటుచేసుకుంద‌ని సాక్షి తెలిపింది.

శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రాజమ్మకాలనీలో శుక్రవారం ఉదయం 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ ప్రాంతం కంటైన్‌మెంట్‌ జోన్‌ కావడంతో అధికారుల ఆదేశాల‌పై మృతదేహం నుంచి శాంపిల్స్‌ సేకరించి అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్‌ల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు.

సంప్రదాయం ప్రకారం మృతదేహానికి అంత్యక్రియలకు ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు పూర్తి చేశారు.

మృతదేహాన్ని ఒక కిలోమీటరు దూరంలో ఉన్న స్థానిక శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా వైద్యులు ఫోన్‌ కాల్‌ ద్వారా ‌మృతుడు క‌రోనా పాజిటివ్ అని తెలిపారు.

అంతే.. అప్పటివరకు కలివిడిగా ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు, కాలనీవాసులు సహా భయంతో నడిరోడ్డుపై మృతదేహాన్ని విడిచి వెళ్లిపోయారు.

ఘటన జ‌రిగిన‌ ప్రాంతానికి వచ్చిన మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌.. సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీకి చెందిన జేసీబీతో శ్మశానానికి తరలించారు.

తెలంగాణ‌లోని ప్రైవేటు ల్యాబ్‌ల‌లో త‌ప్పుడు నిర్ధార‌ణ‌లు

కరోనావైర‌స్‌ మహమ్మారితో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తెలంగాణ‌లోని ప్రైవేటు ల్యాబ్‌లు సొమ్ముచేసుకుంటున్నాయని న‌మ‌స్తే తెలంగాణ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 16 ల్యాబ్‌ల‌ను సీనియర్‌ మైక్రో బయాలజిస్టులు, అధికారులతో కూడిన నాలుగు బృందాలు పరిశీలించాయి.

కొన్ని ల్యాబ్‌ల్లో పీపీఈ కిట్లు లేకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఎలాంటి శిక్షణలేని వారు వ్యాధి నిర్ధారణ చేస్తున్నారని బృందం తెలిపింది.

పెద్ద మొత్తంలో పరీక్షలుచేస్తూ, సరైన పద్ధతులు పాటించకపోవడంవల్ల ఫలితాల్లో తేడా వస్తున్నట్టు తెలిపింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఎక్కువమంది పాజిటివ్‌ అని తేలే అవకాశం అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది.

పలు ల్యాబులు ఐసీఎంఆర్‌, స్టేట్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన డేటాలో తేడా ఉన్నట్లు గుర్తించామని బృందం పేర్కొంది. ఓ ప్ర‌ముఖ‌ ల్యాబ్‌ 3,940 పరీక్షలు చేసినప్పటికీ 1,568 పరీక్షలు చేసినట్లు అప్‌లోడ్‌ చేశారని, ఇందులో 475 పాజిటివ్‌ వచ్చినట్లు చూపెట్టారని తెలిపింది. దీనివల్ల పాజిటివ్‌ రేటు ఎక్కువగా వస్తుందని పేర్కొంది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)