‘‘కరోనావైరస్ కేసులు, మరణాలపై నిజాలు దాస్తే ప్రమాదం’’ – సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఉధృతి దృష్ట్యా స్థానికంగా వాస్తవాలను తొక్కిపెట్టడం మంచిది కాదని, ఎప్పటికప్పుడు నిజాలను వెల్లడించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు కోరినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ‘‘పాజిటివ్‌ కేసులను దాచిపెడుతున్నారు. కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కరోనా వల్ల చనిపోయినా ప్రభుత్వం చెప్పడం లేదనే వార్తలున్నాయి. లెక్క తక్కువ చెబుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. నిజాలను దాచిపెడితే పెనుప్రమాదం తప్పదు’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈమేరకు చంద్రబాబు గురువారం సీఎంకు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చకుండా, సమస్య జటిలం కాకుండా వైద్య పరీక్షలు పెంచడం, పాజిటివ్‌ కేసులను గుర్తించడం, వైరస్‌ సోకినవారిని వేరు చేసి ప్రత్యేక చికిత్స చర్యలు తీసుకోవడం, ప్రజలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే చర్యలు తీసుకోవడం, అన్న క్యాంటీన్లు తెరిచి పేదలకు పోషకాహారం అందించడం వంటి తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

‘‘లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు పస్తులుండకుండా అన్నక్యాంటీన్లు తెరిచి ఆదుకోవాలి. లక్షలాది అసంఘటిత కార్మికులు, రిక్షా, ఆటో,చేనేత, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, జీవాల పెంపకందారులు పస్తులుండే పరిస్థితి ఏర్పడింది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘‘ఎవరూ పస్తులుండరాదని కేంద్రం రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. మూడు నెలలకు రేషన్‌ సరుకులు, పింఛన్‌ ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలకు ఆదేశించింది. హైదరాబాద్‌లో పేదలకు అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా జీహెచ్‌ఎంసీ ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. మహారాష్ట్రలో 11 నెలలుగా మూతపడ్డ క్యాంటీన్లను పునఃప్రారంభించారు’’ అని గుర్తుచేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు ఆపొద్దని ఇతర రాష్ట్రాల సీఎంలు చెప్తుంటే, లాక్‌డౌన్‌ వంకతో ఉద్యోగులు, పెన్షన్ల వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టడం, వాయిదా వేయడం సరికాదన్నారు చంద్రబాబు.

కరోనా నుంచి రక్షణకు బయోసూట్‌ను రూపొందించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు

కరోనావైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్యులు, ఇతర సిబ్బంది ఆ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు డీఆర్‌డీవో వినూత్న బయోసూట్‌ను రూపొందించిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. వివిధ డీఆర్‌డీవో లేబొరేటరీలకు చెందిన శాస్త్రవేత్తలు టెక్స్‌టైల్, కోటింగ్, నానోటెక్నాలజీ తదితర సాంకేతికతలను పరిశీలించి వినూత్నమైన కోటింగ్‌ ద్వారా పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) సూట్‌ను తయారుచేశారు.

ఈ సూట్‌లను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి, వైద్యులు, ఇతర సిబ్బందిని కరోనా నుంచి కాపాడేందుకు శ్రమిస్తున్నట్టు డీఆర్‌డీవో గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కుసుంఘర్‌ ఇండస్ట్రీస్‌ అనే సంస్థ ఈ సూట్‌ తయారీకి సంబంధించిన ముడి సరుకు సహా, కోటింగ్‌ మెటీరియల్‌ ఉత్పత్తి చేయడమే కాకుండా, పూర్తి సూట్‌ను కూడా తయారు చేస్తున్నట్టు వెల్లడించింది.

ప్రస్తుతం రోజుకు 7 వేల సూట్లను తయారుచేసే సామర్థ్యం ఉన్నట్టు పేర్కొంది. వస్త్ర రంగంలో అనుభవం ఉన్న మరో సంస్థతో కలసి రోజుకు 15 వేల సూట్లను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించింది. సూట్‌ను అతికించే టేప్‌ల కొరత కారణంగా వీటి ఉత్పిత్తి తగ్గుతోందని తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయంగా సబ్‌మెరైన్‌ల తయారీలో ఉపయోగించే ఓ పదార్ధాన్ని వినియోగిస్తున్నట్టు వెల్లడించింది.

‘ఈఎంఐ మారటోరియం’ పేరుతో సైబర్‌ మోసగాళ్లు.. జాగ్రత్తగా ఉండాలని పోలీసుల సూచన

కరోనావైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో ఈఎంఐ వాయిదాల చెల్లింపుల మీద ఆర్‌బీఐ మారటోరియం విధించడంతో దానిని ఆసరగా చేసుకుని సైబర్‌ క్రిమినల్స్‌ పంజా విసిరే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు అనుమానిస్తున్నట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ‘వాయిదాలు నిర్ధారించుకోవాలనుకుంటున్నారా.. అయితే మీ ఖాతా వివరాలు, సీవీవీ నంబరు, పిన్‌ నంబర్లు, అన్ని వివరాలు చెప్పితే మీకు ఈఎంఐ మూడు నెలల పాటు వాయిదా పడుతుంది’ అని నమ్మించి.. క్యూఆర్‌ కోడ్‌, ఇతర యాప్‌లను డౌన్‌ లోడ్‌ చేయించి సైబర్‌ నేరగాళ్లు నగదును కొట్టేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆర్‌బీఐ, బ్యాంకు అధికారులు వ్యక్తిగత ఖాతాల వివరాలు, ఈఎంఐ వాయిదాల కోసం ఫోన్‌లో వివరాలు అడుగరని గుర్తించుకోవాలని సూచిస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)