రామ్ జెఠ్మలానీ మృతి: ఇందిరా గాంధీ హత్య కేసు నుంచి వైఎస్ జగన్ కేసుల వరకు..

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఆదివారం ఉదయం మృతిచెందారు. ఆయన వయసు 95 ఏళ్లు.

కొద్దివారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు.

ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌, శిఖర్‌పూర్‌లో 1923 సెప్టంబర్ 14న జన్మించిన ఆయన దేశ విభజన తర్వాత భారత్ వచ్చారు.

రామ్ జెఠ్మలానీ ఏపీ సీఎం జగన్ కేసులు సహా దేశంలోని వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఎన్నో హై-ప్రొఫైల్ కేసులు వాదించారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హంతకుల తరఫున, స్టాక్ మార్కెట్ కుంభకోణాల నిందితులు హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ తరఫున..పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు తరఫున ఆయన వాదించారు.

జెఠ్మలానీ హై ప్రొఫైల్ కేసుల్లో ఎల్కే అడ్వానీ హవాలా, జయలలిత అక్రమ ఆస్తులు, టూ-జీ కుంభకోణం, కేసు, జెసికా లాల్ కేసు, లాలూ యాదవ్ పశువుల దాణా కుంభకోణం, యడ్యూరప్ప తవ్వకాల కుంభకోణం కేసు, సహారా సెబీ కేసు, రాంలీలా మైదాన్ సెంటన్స్‌ కీలకంగా నిలిచాయి.

17 ఏళ్లకే లా డిగ్రీ

రాం జెఠ్మలానీ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. 17 ఏళ్ల వయసుకే లా డిగ్రీ అందుకున్నారు.

1959లో నానావతీ కేసులో జెఠ్మలానీ తన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన క్రిమినల్ లా ప్రాక్టీస్ ప్రముఖులు అయ్యారు.

జెఠ్మలానీకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో మహేశ్ జెఠ్మలానీ, రాణీ జెఠ్మలానీ ప్రముఖ న్యాయవాదులుగా ఉన్నారు.

మోదీకి మొదట మద్దతు, తర్వాత వ్యతిరేకం

2014 సార్వత్రిక ఎన్నికల్లో రామ్ జెఠ్మలానీ మొదట నరేంద్ర మోదీ ప్రధాని కావడాన్ని సమర్థించారు. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత త్వరలోనే ఆయనకు వ్యతిరేకం అయ్యారు.

2015లో అరుణ్ జైట్లీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేసినపుడు, జెఠ్మలానీ కేజ్రీవాల్ వైపు నిలిచారు.

2017లో రామ్ జెఠ్మలానీ న్యాయ వృత్తి నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు.

వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రి, ఆయనపైనే పోటీ

రామ్ జెఠ్మలానీ బీజేపీ తరఫున రెండుసార్లు ముంబయి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఆయన 1988లో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆ తర్వాత ప్రధాన స్రవంతి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1996లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో జెఠ్మలానీ న్యాయ మంత్రిగా ఉన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు ఆయనకు పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చారు.

1999లో ఆయన మరోసారి న్యాయ మంత్రి అయ్యారు. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎఎస్ ఆనంద్, అటార్నీ జనరల్‌తో అభిప్రాయ బేధాలు రావడంతో ప్రధానమంత్రి ఆయన్ను రాజీనామా ఇవ్వాలని కోరారు. అప్పుడు సోలీ సొరాబ్జీ అటార్నీ జనరల్‌గా ఉన్నారు.

వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన అనంతరం 2004లో లఖ్‌నవూలో వాజపేయిపైనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ప్రధాని మోదీ సంతాపం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ్ జెఠ్మలానీ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

మోదీ తన ట్వీట్‌లో "రాం జెఠ్మలానీ మృతితో భారత్ ఒక అసాధారణ న్యాయవాదిని, న్యాయస్థానం, పార్లమెంటు రెండిట్లో భాగస్వామ్యం అందించిన ఒక ఐకానిక్ పబ్లిక్ ఫిగర్‌ను కోల్పోయింది. ఆయన చమత్కారి, సాహసికులు. ఏ విషయం మీదైనా ఓపెన్‌గా మాట్లాడ్డానికి భయపడేవారు కాదు. ఆయనలోని మంచి కోణం తన మనసుతో మాట్లాడే సామర్థ్యం ఉండడం. ఆయన భయపడేవారు కాదు. అత్యవసర స్థితిలో జెఠ్మలానీ ప్రజల కోసం పోరాటం చేశారు. అవసరమైనవారికి సాయం చేయడం ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం. ఎన్నో సందర్భాల్లో ఆయనతో స్వయంగా మాట్లాడే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఆయన మన మధ్ లేకపోయినా, ఆయన చేసినవి సజీవంగా ఉంటాయి. ఓం శాంతి" అని పెట్టారు.

సుప్రీంకోర్టు ప్రముఖ వకీల్ ప్రశాంత్ భూషణ్, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.

అందులో ఆయన "ప్రముఖ న్యాయవాది, దేశంలో అత్యంత సమర్థుడైన క్రిమినల్ లాయర్ రాం జెఠ్మలానీ 95 ఏళ్ల వయసులో కన్నుమూశారని విషాద వార్తలు వస్తున్నాయి" అని రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)