‘పేలుడు శబ్దం వినగానే పరుగెత్తుకుంటూ వెళ్లి చూశాను.. అప్పటికే అమ్మ చనిపోయింది’

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా బటాలా పట్టణంలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు బటాలా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దీపక్ భాటియా తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది పది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు.

ఓ పెళ్లి వేడుక కోసం బాణసంచా తయారుచేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

పేలుడు అనంతరం భవనం కుప్పకూలడంతో శిథిలాల్లో ఇంకా కొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నారు.

లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి.

ఈ దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు.

సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

గుర్‌దాస్‌పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ట్వీట్ చేశారు. బటాలా ఫ్యాక్టరీలో జరిగిన ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

వెంటనే వెళ్లి చూశాను.. అప్పటికే అమ్మచనిపోయింది

పేలుడు జరిగిన కర్మగారానికి సమీపంలోనే నివసించే అమన్ అనే ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ‘‘నేనప్పటికి షాపులో ఉన్నాను. పేలుడు శబ్దం వినగానే వెంటనే ఇంట్లోకి పరుగెత్తి వెళ్లి చూశాను. అప్పటికే అమ్మ చనిపోయింది’’ అన్నారు.

కర్మాగారం పక్కనే వీరి ఇల్లు ఉండడంతో పేలుడు ధాటికి వీరి ఇల్లు కూడా దెబ్బతింది. అమన్ తల్లి ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)