You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?
నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు వేలాది మంది యువకులు జూన్ 20 నుంచి నిరసనలు చేపట్టారు.
సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష, పార్లమెంట్ మార్చ్ సమయంలో దిల్లీ పోలీసులు జరిపిన లాఠీచార్జ్ వంటి అనేక సంఘటనలను ఎదుర్కొని సాగిన ఈ నిరసనల ఫలితంగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
దేశమంతటా చర్చనీయాంశమై, మద్దతు కూడగట్టుకున్న ఈ పోరాటం ఎలా సాగిందో ఇక్కడ చూద్దాం.
అభిజిత్ దీప్కే ప్రారంభించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 6న తన తొలి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల్లో అవకతవకలు, విద్యార్థుల భవిష్యత్తుపై నిరసనకారులు ఆందోళన లేవనెత్తారు. ఆ ఆందోళన ఒక పెద్ద ఉద్యమానికి ఆరంభం మాత్రమేనని అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో, జూన్ 20న కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసనను ప్రారంభించారు.
పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావడం తదితర డిమాండ్లను కేంద్రం ముందుంచారు.
ఆ తర్వాత, జులై 20న 'పార్లమెంట్ మార్చ్'కు సీజేపీ పిలుపునిచ్చింది.
అయితే, 'పార్లమెంట్ మార్చ్'కు సీజేపీ ఎలాంటి అనుమతి కోరలేదని, పోలీసులు అనుమతి ఇవ్వలేదని జులై 19(పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు రోజు)న దిల్లీ పోలీసులు ప్రకటించారు.
జులై 20న, వేలాది మంది నిరసనకారులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బారికేడ్లు, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆ ఘటనలో కొందరు యువకులు, పోలీసులు గాయపడ్డారు. దీంతో, పోలీసుల తీరుపై పలు ప్రశ్నలు తలెత్తాయి.
కొన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ సంఘటన జంతర్ మంతర్ నిరసనను ఒక ముఖ్యమైన జాతీయ రాజకీయ అంశంగా మార్చింది.
ఆ తర్వాత జులై 21 నుంచి 23 మధ్య, జంతర్ మంతర్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు, పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు.
పోలీసుల చర్యలపై దిల్లీ హైకోర్టు వివరణ కోరింది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు నిరసన స్థలానికి సమీపంలోని ఒక తటస్థ ప్రదేశంలో సీజేపీ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.
జులై 24న, సోనమ్ వాంగ్చుక్ ప్రభుత్వ హామీల నేపథ్యంలో జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో తన నిరాహార దీక్షను విరమించారు.
అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది.
దిల్లీలో కేంద్ర ప్రభుత్వం తరపున జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, కాక్రోచ్ జనతా పార్టీ తరపున ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా చర్చల్లో పాల్గొన్నారు.
డిమాండ్లపై సమాధానం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒకరోజు వరకు సమయం కోరిందని జులై 24న జరిగిన చర్చల ముగింపులో సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.
జవాబుదారీతనం, పరీక్షా విధానంలో సంస్కరణల డిమాండ్లను స్పష్టంగా చెబుతూనే, ఈ పరిణామాన్ని సీజేపీ ఒక భారీ విజయంగా అభివర్ణించింది.
"ఇది ప్రజాస్వామ్య విజయం, ఇది శాంతి, ఓర్పు, పట్టుదలకు లభించిన విజయం" అని సోనమ్ వాంగ్చుక్ వ్యాఖ్యానించారు.
"ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, కానీ నీట్ పరీక్ష అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలి, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి అనే రెండు డిమాండ్లు ఇంకా మిగిలే ఉన్నాయి" అని అభిజిత్ దీప్కే తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)