జీ20 సదస్సుకు దిల్లీ సిద్ధమైంది. సెప్టెంబర్ 9,
10 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచ దేశాల నేతలు
వస్తుండడంతో ముందెన్నడూ లేని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సెంట్రల్ దిల్లీ అంతటా వాహనాల రాకపోకలపై
నియంత్రణ ఉంది.
మెట్రో రైల్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ సదస్సు జరిగే
స్థలానికి సమీపంలోని మెట్రో స్టేషన్ అయిన సుప్రీంకోర్ట్-ప్రగతి మైదాన్ మెట్రో
స్టేషన్ను మాత్ర మూసి ఉంచుతున్నారు.
మరోవైపు విదేశీ అతిథులు బస చేసే హోటళ్లకు సమీపంలో కోతుల బెడద నివారణకు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు.
కొండముచ్చుల కటౌట్లు ఏర్పాటు చేయడం, కొండ ముచ్చుల్లా అరిచే వ్యక్తులను నియమించడం వంటివి చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు.
జీ20 దేశాల అధినేతల్లో కొందరు ఇప్పటికే భారత్
చేరుకోగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకా చేరుకోవాల్సి ఉంది. ఆయన ఇప్పటికే
అమెరికా నుంచి తన ప్రత్యేక విమానంలో ప్రయాణం ప్రారంభించారు.
అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్
దిల్లీ చేరుకున్నారు. ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్
కులస్తె ఆయనకు స్వాగతం పలికారు.
కోవిడ్తో స్పెయిన్ అధ్యక్షుడు జీ20 సదస్సుకు
దూరం
స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ భారత
పర్యటన రద్దయింది. గురువారం ఆయనకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధరణ కావడంతో శనివారం
నుంచి దిల్లీలో జరగబోయే జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరు కాబోవడం లేదని ఏఎన్ఐ
వార్తాసంస్థ తెలిపింది.
దీంతో ఆయన స్థానంలో ఆ దేశ ఫస్ట్ వైస్
ప్రెసిడెంట్ నాదియా కాల్వినో భారత్ రానున్నారు. నాదియాతో పాటు స్పెయిన్ విదేశీ వ్యవహారాల
మంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర అధికారులు బృందం వస్తోంది.
స్పెయిన్ అధ్యక్షుడు రాలేకపోతుండడంతో ఈ
ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరుకాని మూడో నేత కానున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు
పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు తాము రావడం లేదని చెప్పగా తాజాగా పెడ్రో
సాంచెజ్ కోవిడ్ కారణంగా రావడంలేదు.
బైడెన్కు తొలగిన కోవిడ్ అడ్డంకి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ పరీక్షలలో
నెగటివ్ రావడంతో ఆయన భారత పర్యటనకు అడ్డంకి తొలగినట్లయింది. జో బైడెన్ భార్య జిల్
బైడెన్కు కోవిడ్ పాజిటివ్ అని సోమవారం నాటి పరీక్షలలో వచ్చినా గురువారం నాటికి
ఆమెకూ కోవిడ్ నెగటివ్ అని టెస్ట్ల ఫలితాలు వచ్చాయి.
అయితే, ఇంకా ఆమెకు కోవిడ్ లక్షణాలు ఉండడంతో
భారత్ రావడం లేదని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
దీంతో గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) జో బైడెన్
తన ఎయిర్ఫోర్స్ వన్లో భారత్ బయలుదేరారు.
బైడెన్.. జర్మనీ మీదుగా భారత్కు..
అమెరికాలోని ఆండ్రూస్ ఎయిర్ బేస్ నుంచి తన
ఎయిర్ఫోర్స్ వన్లో బయలుదేరిన జో బైడెన్ శుక్రవారం జర్మనీలోని రామ్స్టెయిన్లో
దిగనున్నారు.
స్వల్ప విరామం తరువాత తిరిగి అక్కడి నుంచి బయలుదేరి
శుక్రవారమే భారత్ చేరుకుంటారు.
శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ, అమెరికా
అధ్యక్షుడి మధ్య ద్వైపాక్షిక సమావేశం ఉంటుందని వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
దిల్లీలో బైడెన్ ఏమేం చేస్తారు?
శుక్రవారమే దిల్లీ చేరుకునే బైడెన్కు శనివారం
అధికారిక స్వాగతం, ప్రధాని మోదీతో కరచాలనం ఉంటుంది.
అనంతరం శనివారం జీ20 సదస్సులోని తొలి సెషన్
‘వన్ ఎర్త్’లో ఆయన పాల్గొంటారు.
అనంతరం సెషన్ 2 ‘వన్ ఫ్యామిలీ’లొ పాల్గొంటారు.
అనంతరం ‘గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్’ ఈవెంట్లో పాల్గొంటారు.
ఇతర జీ20 నేతలతో డిన్నర్, సాంస్కృతిక
కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆదివారం ఆయన ఇతర జీ20 నేతలతో కలిసి దిల్లీలో
మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ను సందర్శిస్తారు. అనంతరం ఆదివారమే(సెప్టెంబర్ 10)
దిల్లీ నుంచి బయలుదేరుతారు.
దిల్లీ నుంచి వియత్నాంలోని హనోయి వెళ్తారు.