You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

జీ20: భారత్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీతో భేటీ

"ప్రధాని మోదీ, అధ్యక్షుడు బైడెన్ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు భారత్, అమెరికా సంబంధాలను మరింత పటిష్టం చేస్తాయి" అని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

లైవ్ కవరేజీ

  1. జీ20సదస్సు: మోదీ ప్రారంభోపన్యాసం, మొరాకో భూకంప మృతులకు ప్రధాని సంతాపం

    భారత్ అధ్యక్షతన దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది.

    భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ20 సదస్సు ప్రారంభ ప్రసంగం చేశారు.

    ‘‘జీ20 సదస్సు ప్రారంభించడానికి ముందుమొరాకో భూకంపంలో చనిపోయిన ప్రజలకు సంతాపం తెలియజేస్తున్నా.

    ఈ ప్రకృతి విపత్తులో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

    ఈ కష్ట సమయంలో మొరాకోకు అవసరమైన సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ’’ అని మోదీ తెలిపారు.

  2. చంద్రబాబు అరెస్ట్: ప్రజలే అండగా ఉండాలన్న భువనేశ్వరి.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి జోక్యం కోరుతూ లేఖ రాసిన ఎంపీ రామ్మోహన్

  3. జీ20 సదస్సు: ప్రపంచ నేతలకు ఆహ్వానం పలికిన మోదీ, కాసేపట్లో సదస్సు ప్రారంభం

    ప్రపంచానికి దిశానిర్దేశం చేసే జీ20 సదస్సు రెండు రోజుల పాటు దేశ రాజధాని దిల్లీలో జరుగనుంది.

    మరికాసేపట్లో సదస్సు ప్రారంభం కానుంది.

    ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో ఈ సదస్సును నిర్వహిస్తారు.

    ఈ మేరకు సదస్సు జరుగనున్న ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

    అందరి కంటే ముందుగానే భారత మండపానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ఆహ్వానం పలికారు.

    సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు విచ్చేస్తున్నారు.

    వారందరికీ ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు.

    యూకే ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండేజ్, సింగపూర్ ప్రధాని లీ హీన్ లూంగ్ తదితరులను మోదీ స్వాగతించారు.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సదస్సులో పాల్గొనేందుకు భారత మండపానికి చేరుకున్నారు.

  4. చంద్రబాబు అరెస్ట్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ

  5. పవన్ కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  6. బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం

    బీబీసీ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

    జీ20 సదస్సుకు సంబంధించిన తాజా సమాచారంతో పాటు ఇతర అప్డేట్లను మీకు ఎప్పటికప్పుడు అందించేందుకు మళ్ళీ రేపు ఉదయం లైవ్ పేజీలో కలుసుకుందాం.

    ధన్యవాదాలు. గుడ్ నైట్.

  7. జీ20: భారత్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీతో భేటీ

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం రాత్రి దిల్లీ విమానాశ్రయంలో దిగారు బైడెన్.

    అనంతరం దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత మోదీతో భేటీ అయ్యారు బైడెన్ .

    "ప్రధాని నరేంద్ర మోదీ, బైడెన్ భేటీ అయ్యారు. అనేక రకాల సమస్యలపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు భారత్, అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి" అని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

    అంతకుముందు దిల్లీ విమానాశ్రయంలో బైడెన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిలో ఓ చిన్న అమ్మాయి కూడా ఉంది. బైడెన్ ఆ చిన్నారితో ముచ్చటించారు.

    ఆ అమ్మాయి ఇండియాలో అమెరికా రాయబారి అయిన ఎరిక్ గార్సెట్టి కూతురు మాయా గార్సెట్టిగా రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

  8. 'ఈ రహదారి ప్రపంచపు ఎనిమిదో వింత'

  9. జీ20: ఈ సదస్సు నిర్వహిస్తే భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటి?

  10. 'జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి సంతోషంగా ఉన్నాం'.. సభ్య దేశాలకు భారత ప్రధాని మోదీ సందేశం

    దిల్లీలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగబోయే జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు.

    ఈ సదస్సు 'మానవ-కేంద్రీకృత, సమ్మిళిత అభివృద్ధి'లో కొత్త మార్గాన్ని నిర్దేశిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

    నిరుపేదలకు, క్యూలో ఉన్న చివరి వ్యక్తికి కూడా సేవ చేయాలనే గాంధీజీ లక్ష్యాన్ని అనుసరించడం చాలా ముఖ్యమని మోదీ తెలిపారు.

    న్యూదిల్లీలోని భారత్ మండపంలో 18వ జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఆనందంగా ఉందని తెలిపారు మోదీ.

    జీ20 సదస్సు భారత్‌లో జరగడం ఇదే తొలిసారని, రాబోయే రెండు రోజుల్లో ప్రపంచ నాయకులతో చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

    "సాంకేతిక మార్పు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి భవిష్యత్ రంగాలకు మేం చాలా ప్రాముఖ్యతనిస్తాం. లింగ సమానత్వం, మహిళా సాధికారత, ప్రపంచ శాంతి కోసం మేం సమిష్టిగా పని చేస్తాం" అని తెలిపారు మోదీ.

    ఈ సదస్సు ఇతివృత్తం వసుధైక కుటుంబమని, ఇది ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడటాన్ని చాటిచెబుతుందని ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు.

    ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు.

  11. జీ 20: మోదీ ఇంటికి వస్తున్న అమెరికా ప్రెసిడెంట్ బైడెన్... చైనా దూకుడుతో ఇద్దరి మధ్యా పెరుగుతున్న స్నేహం

  12. క్రాబ్ వాక్ చేస్తూ జైలు నుంచి పారిపోయిన ‘డేంజరస్ కిల్లర్’

  13. ధోనీ, ట్రంప్ కలిసి గోల్ఫ్ ఆడారు

    టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కలిసి గోల్ఫ్ ఆడుతున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ధోనీ స్నేహితుడు హితేశ్ సంఘ్వి తొలుత ఈ చిత్రాలను తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేయగా అక్కడి నుంచి అనేక మంది షేర్ చేస్తున్నారు.

    ధోనీ, ట్రంప్‌లు అమెరికాలోని ‘ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్’లో కలిసి ఆడారు. ఈ ఫొటోను షేర్ చేసిన హితేశ్.. ధోనీకి ఆతిథ్యమిచ్చినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాలో రాశారు.

    కాగా ట్రంప్, ధోనీ కలవడానికి ఒక రోజు ముందు హితేశ్ సంఘ్వి, ధోనీలు కలిసి యూఎస్ ఓపెన్ టెన్నిస్ మ్యాచ్ వీక్షించారు.

  14. భారత్: ‘ఇండియా’ అనే పేరుపై జిన్నా అప్పట్లో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు?

  15. కిమ్ జోంగ్ ఉన్: న్యూక్లియర్ ఎటాక్ సబ్‌మెరైన్‌ను సిద్ధం చేసిన ఉత్తర కొరియా

    ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ను ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్నట్లు దేశ మీడియా వెల్లడించింది.

    ఉత్తర కొరియా అధికారిక మీడియా దీనిపై ప్రకటన విడుదల చేసింది. కిమ్ వేడుకల్లో పాల్గొన్న ఫొటోలతోపాటు ఈ సబ్‌మెరైన్ ఆవిష్కరణతో దేశ అణు సామర్థ్యం మరింత పటిష్టంగా మారిందని పేర్కొంది.

    ఉత్తర కొరియా సిద్ధం చేసుకోవాలనుకుంటున్న ఆయుధాల జాబితాలో ఈ న్యూక్లియర్ ఎటాక్ సబ్‌మెరైన్ ఎప్పటి నుంచో ఉంది. మీడియా విడుదల చేసిన ఫొటోల్లో కిమ్ నేవీ అధికారుల రక్షణ వలయం మధ్య నల్లటి రంగులో ఉన్న భారీ జలాంతర్గామిని పరిశీలిస్తున్నారు. ఈ జలంతర్గామికి అణు ఆయుధాలను ప్రయోగించే సామర్థ్యం ఉందని మీడియా పేర్కొంది.

    కిమ్ అణు ఆయుధాలను ప్రయోగించే జలంతర్గామిని అభివృద్ధి చేయడంపై చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఆయుధాల కూర్పులో ఇది కీలకమైనదిగా భావిస్తున్నారు.

    జలంతర్గాములు నీటిలో ఉన్న సమయంలో గుర్తించడం అంత సులభం కాదు. ఒకవేళ నేలపై ఉన్న ఆయుధాలన్ని దాడిలో నాశనం అయిపోతే, ఈ సబ్‌మెరైన్‌తో ప్యాంగ్యాంగ్ నుంచి న్యూక్లియర్ మిసైల్స్‌ను ప్రయోగిస్తారు.

    అయితే ఈ జలంతర్గామి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నదీ లేనిదీ ఇంకా తెలియలేదు. న్యూక్లియర్ మిసైల్స్ ప్రయోగించే సామర్థ్యాన్ని ఇంకా పరీక్షించాల్సి ఉంది.

  16. జీ20: సర్వసన్నద్ధమైన భారత్ – బైడెన్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశం, కోవిడ్ కారణంగా స్పెయిన్ అధ్యక్షుడు దూరం

    జీ20 సదస్సుకు దిల్లీ సిద్ధమైంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచ దేశాల నేతలు వస్తుండడంతో ముందెన్నడూ లేని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

    సెంట్రల్ దిల్లీ అంతటా వాహనాల రాకపోకలపై నియంత్రణ ఉంది.

    మెట్రో రైల్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ సదస్సు జరిగే స్థలానికి సమీపంలోని మెట్రో స్టేషన్ అయిన సుప్రీంకోర్ట్-ప్రగతి మైదాన్ మెట్రో స్టేషన్‌ను మాత్ర మూసి ఉంచుతున్నారు.

    మరోవైపు విదేశీ అతిథులు బస చేసే హోటళ్లకు సమీపంలో కోతుల బెడద నివారణకు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు.

    కొండముచ్చుల కటౌట్లు ఏర్పాటు చేయడం, కొండ ముచ్చుల్లా అరిచే వ్యక్తులను నియమించడం వంటివి చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు.

    జీ20 దేశాల అధినేతల్లో కొందరు ఇప్పటికే భారత్ చేరుకోగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకా చేరుకోవాల్సి ఉంది. ఆయన ఇప్పటికే అమెరికా నుంచి తన ప్రత్యేక విమానంలో ప్రయాణం ప్రారంభించారు.

    అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్ దిల్లీ చేరుకున్నారు. ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తె ఆయనకు స్వాగతం పలికారు.

    కోవిడ్‌తో స్పెయిన్ అధ్యక్షుడు జీ20 సదస్సుకు దూరం

    స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ భారత పర్యటన రద్దయింది. గురువారం ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో శనివారం నుంచి దిల్లీలో జరగబోయే జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరు కాబోవడం లేదని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

    దీంతో ఆయన స్థానంలో ఆ దేశ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నాదియా కాల్వినో భారత్ రానున్నారు. నాదియాతో పాటు స్పెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర అధికారులు బృందం వస్తోంది.

    స్పెయిన్ అధ్యక్షుడు రాలేకపోతుండడంతో ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరుకాని మూడో నేత కానున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు తాము రావడం లేదని చెప్పగా తాజాగా పెడ్రో సాంచెజ్ కోవిడ్ కారణంగా రావడంలేదు.

    బైడెన్‌కు తొలగిన కోవిడ్ అడ్డంకి

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కోవిడ్ పరీక్షలలో నెగటివ్ రావడంతో ఆయన భారత పర్యటనకు అడ్డంకి తొలగినట్లయింది. జో బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్ అని సోమవారం నాటి పరీక్షలలో వచ్చినా గురువారం నాటికి ఆమెకూ కోవిడ్ నెగటివ్ అని టెస్ట్‌ల ఫలితాలు వచ్చాయి.

    అయితే, ఇంకా ఆమెకు కోవిడ్ లక్షణాలు ఉండడంతో భారత్ రావడం లేదని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

    దీంతో గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) జో బైడెన్ తన ఎయిర్‌ఫోర్స్ వన్‌లో భారత్ బయలుదేరారు.

    బైడెన్.. జర్మనీ మీదుగా భారత్‌కు..

    అమెరికాలోని ఆండ్రూస్ ఎయిర్ బేస్ నుంచి తన ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బయలుదేరిన జో బైడెన్ శుక్రవారం జర్మనీలోని రామ్‌స్టెయిన్‌లో దిగనున్నారు.

    స్వల్ప విరామం తరువాత తిరిగి అక్కడి నుంచి బయలుదేరి శుక్రవారమే భారత్ చేరుకుంటారు.

    శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి మధ్య ద్వైపాక్షిక సమావేశం ఉంటుందని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

    దిల్లీలో బైడెన్ ఏమేం చేస్తారు?

    శుక్రవారమే దిల్లీ చేరుకునే బైడెన్‌కు శనివారం అధికారిక స్వాగతం, ప్రధాని మోదీతో కరచాలనం ఉంటుంది.

    అనంతరం శనివారం జీ20 సదస్సులోని తొలి సెషన్ ‘వన్ ఎర్త్’లో ఆయన పాల్గొంటారు.

    అనంతరం సెషన్ 2 ‘వన్ ఫ్యామిలీ’లొ పాల్గొంటారు. అనంతరం ‘గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్’ ఈవెంట్‌లో పాల్గొంటారు.

    ఇతర జీ20 నేతలతో డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

    ఆదివారం ఆయన ఇతర జీ20 నేతలతో కలిసి దిల్లీలో మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్‌ను సందర్శిస్తారు. అనంతరం ఆదివారమే(సెప్టెంబర్ 10) దిల్లీ నుంచి బయలుదేరుతారు.

    దిల్లీ నుంచి వియత్నాంలోని హనోయి వెళ్తారు.

  17. గుడ్ మార్నింగ్.

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసంఇక్కడక్లిక్ చేయండి.