ఆంగ్ సాన్ సూచీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) పార్టీని రద్దు చేయనున్నట్టు సైన్యం నియంత్రణలో పనిచేసే మియన్మార్ ఎన్నికల కమిషన్ ప్రకటించిందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
కొత్త ఎన్నికల చట్టం ప్రకారం రీరిజిస్టర్ చేసుకోనుందుకే ఎన్ఎల్డీని ఎన్నికల కమిషన్ రద్దు చేయందని ప్రభుత్వ మీడియాను ఉటంకిస్తూ మీడియా సంస్థ అల్ జజీరా తెలిపిందని ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది.
ఎన్నికల కమిషన్ విధించిన రిజిస్ట్రేషన్ గడువులోపు ప్రక్రియ పూర్తిచేయలేకపోయిన 40 పార్టీల్లో ఎన్ఎల్డీ ఒకటని తెలిపింది.
కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తామని సైనిక ప్రభుత్వం ఇంతకుముందు హామీ ఇచ్చింది. ఈ విషయమై కఠినమైన ఎన్నికల చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ చట్టం కింద రిజిస్టర్ చేసుకొనేందుకు రాజకీయ పార్టీలకు జనవరిలో రెండు నెలల గడువును సైనిక ప్రభుత్వం విధించింది.
ఈ ఎన్నికలు స్వేచ్ఛగాగాని, నిష్పక్షపాతంగాగాని జరగవని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
ఈ ఎన్నికలు అక్రమమైనవని, తాము పోటీచేయబోమని ఎన్ఎల్డీ ప్రకటించింది.
వివిధ కేసుల్లో ఆంగ్ సాన్ సూచీకి మొత్తం 33 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమె ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు.
ఆగ్నేయాసియాలోని మియన్మార్ (రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ మియన్మార్, ఒకప్పటి బర్మా) ఒక చిన్న దేశం. దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంత విస్తీర్ణంలో ఉన్న మియన్మార్ దేశ జనాభా 5 కోట్ల 70 లక్షలు.
2020 నవంబరులో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని సైన్యం దాదాపు మూడు నెలలకే కూలదోసి, అధికారాన్ని చేజిక్కించుకొంది. సైనిక అధికారానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు ఉద్యమించారు. కొంత మంది ఆయుధాలు చేత పట్టారు.