జీ20 సదస్సులో మోదీ: ‘‘విభజించడంపై కాదు, ఐక్యతపై దృష్టి సారించండి’’
భారతీయ నాగరికత స్ఫూర్తితో విభజనపై కాకుండా ఐక్యంగా ఉండటంపై దృష్టి సారించాలని జీ20 సదస్సులో పాల్గొన్న విదేశాంగ మంత్రులను భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
దిల్లీలో గురువారం రెండోరోజు జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు జరుగుతోంది.
ఈ సందర్భంగా విదేశాంగ మంత్రులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘‘ఈరోజు మీరు గాంధీ, బుద్ధుడు నడయాడిన భూమిపై సమావేశం అవుతున్నారు. అందుకే మిమ్మల్ని నేను ఒకటి అభ్యర్థిస్తున్నా. భారతీయ నాగరికత స్ఫూర్తితో విభజించడంపై కాకుండా ఐక్యతపై దృష్టి సారించాలని మిమ్మల్ని కోరుతున్నా’’ అని అన్నారు.
‘‘ఇటీవలే మనం శతాబ్ధంలోనే అత్యంత వినాశకరమైన అంటువ్యాధిని ఎదుర్కొన్నాం. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, వేలాది మంది మరణాలకు కారణం అయ్యాయి.
ఎన్నో ఆర్థిక సవాళ్లను, సంక్షోభాలను కూడా ఎదుర్కొన్నాం.ఈ సమస్యలను పరిష్కరించడంలో జీ20దేశాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశం చాలా కీలకం.ఈ భేటీలో మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నా.
గత కొన్ని సంవత్సరాలలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, అంటువ్యాధి, తీవ్రవాదం, యుద్ధం వంటి వాటిని పరిశీలిస్తే, ప్రపంచ వ్యవస్థ విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని ఆయన ప్రసంగించారు.