ఫోన్ ట్యాపింగ్
కారణంగానే పార్టీని వీడుతున్నానని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్
రెడ్డి చెప్పారు.
పార్టీకి, వైఎస్
జగన్కు విధేయుడిగా ఉన్న తనను అవమానిస్తున్నారని, అవమానించే చోట ఉండాల్సిన అవసరం తనకు
లేదని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో
వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేయనని అన్నారు.
బుధవారం విలేఖరుల
సమావేశాన్ని నిర్వహించిన ఆయన తన అసంతృప్తిని వెలిబుచ్చారు. తన ఫోన్ను ట్యాప్
చేయడం న్యాయమా? అని ప్రశ్నించారు.
‘‘అధికారిక
పార్టీ ఎమ్మెల్యేలపై ఎందుకు నిఘా పెడుతున్నారు? ఇంత నిఘా అవసరమా? నాకు నటన, మోసం
చేయడం చేత కాదు. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నాతో మాట్లాడారు. నా ఫోన్ను
ట్యాప్ చేసి నేను మాట్లాడిన ఆడియోను నాకు పంపించారు. ఆ ఆడియోలో నాది, నా మిత్రుడి
గొంతు ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేశారనడానికి ఇంతకుమించిన ఆధారాలు ఏం కావాలి. ఫోన్
ట్యాప్ అయిందని నేను ఆధారాలతో బయటపెడుతున్నా. ఫోన్ ట్యాప్ చేయలేదని మీరు
నిరూపించండి.
ట్యాపింగ్
చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పి ఉంటారు. దొంగతనంగా పార్టీ
ఎమ్మెల్యేల మాటలు వినాల్సిన అవసరం ఏంటి? జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ
రెడ్డికి తెలియకుండా ఇలాంటిది జరుగుతుందా?నాయకుడే ఎమ్మెల్యేలను నమ్మకపోతే ఎలా? నాయకుడే
నమ్మకపోతే ఇంకా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణం కూడా పార్టీలో
ఉండాల్సినఅవసరం నాకు లేదు.
పార్టీ
ఎమ్మెల్యే ఉండగా వేరే వారిని ఇంచార్జి గా నియమించాల్సిన అవసరం ఏంటి?పార్టీ కోసం కష్టకాలంలో
పనిచేశాను, సముచిత స్థానం కోరుకోవడం తప్పా? ప్రజా సమస్యలపై
ప్రశ్నిస్తే ఇలా చేస్తారా? నన్ను గెలిపించిన ప్రజల కోసం పోరాడితే
అవమానిస్తారా?ఎమ్మెల్యేలపై నమ్మకం లేకపోతే ఇంకా ప్రజల మీద ఏం నమ్మకం ఉంటుంది. ఇదేం కర్మ
రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తితో’’ అని కోటం రెడ్డి అన్నారు.