మహారాష్ట్ర: షిర్డీ వెళుతున్న బస్సును ఢీకొన్న లారీ, 10మంది మృతి
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్-షిర్డీ హైవేపై పాథారే గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సాయిబాబా భక్తులతో వెళుతున్న బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని నాసిక్ పోలీసులు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ ప్రైవేటు లగ్జరీ బస్సులో 50మంది ప్రయాణిస్తున్నారు. అంబర్ నాథ్ ప్రాంతం నుంచి షిర్డీ సాయిబాబా భక్తులు 15 బస్సుల్లో షిర్డీ బయలుదేరారు. ప్రమాదానికి గురైన బస్సు ఆ బస్సుల్లో ఒకటి.
భారీ లోడుతో వస్తున్న లారీ, బస్సును బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
సింగిల్ లైన్ రోడ్డు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.