You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

విజయవాడ వద్ద కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

కృష్ణా నదిలో మరోసారి ప్రమాదం జరిగింది. ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి.

లైవ్ కవరేజీ

  1. అంధుల టీ20 ప్రపంచ కప్‌లో మూడోసారి విజేతగా నిలిచిన భారత జట్టు

  2. నేటి లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్‌పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  3. మాచర్లలో టీడీపీ, వైసీపీ ఘర్షణ.. టీడీపీ ఆఫీస్‌కు నిప్పు

    ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ శ్రేణులపై దాడులు జరిగాయి.

    ఈ దాడులు వైసీపీ కార్యకర్తల పనేనని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటితో పాటు పార్టీ కార్యాలయానికి వైసీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.

    టీడీపీకి చెందిన పలువురు నేతల వాహనాలూ మంటల్లో కాలిపోయాయి. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో భాగంగా మాచర్ల పట్టణంలో అక్కడి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు.

    టీడీపీ ప్రదర్శన సాగుతున్న దారిలో వైసీపీ శ్రేణులు ఎదురై రాళ్లు, సీసాలు విసిరారని టీడీపీ నాయకులు చెప్తున్నారు.

    పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి ఘర్షణలు ఆపారు. మాచర్ల పట్టణంలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది.

  4. ప్రధాని నరేంద్రమోదీపై పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం.. బీజేపీ నిరసనలు

    భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ‘‘అనాగరికమైన’’ వ్యాఖ్యల చేశారంటూ భారతదేశం తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్‌ ‘‘మరింతగా దిగజారింద’’ని వ్యాఖ్యానించింది.

    బిలావల్ తాజాగా అమెరికా టీవీ చానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై అధికార బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద ధర్నాకు దిగారు.

    అంతకుముందు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటంలో, వ్యాపించటంలో పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. పాక్ మంచి పొరుగుదేశంగా ఉండటానికి ప్రయత్నించాలని సూచించారు.

    విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ విలేకరి ఒకరు.. భారతదేశం ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని ఆరోపిస్తూ అడిగిన ఒక ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇస్తూ.. ‘‘పాకిస్తాన్ ఎంత కాలం ఉగ్రవాదాన్ని ఆచరిస్తుందనే ప్రశ్నకు సమాధానం చెప్పేది పాకిస్తాన్ మంత్రులు’’ అని బదులిచ్చారు.

    భారత విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో స్పందిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యక్తిగతంగా తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (ఆర్ఎస్‌ఎస్) మీద కూడా విమర్శలు ఎక్కుపెట్టారు.

    దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతిస్పందనను మీడియా ప్రతినిధులు కోరగా.. ఆ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు.

    ‘‘పాకిస్తాన్ తన ఉగ్రవాదులను, వారి తాబేదారులను ప్రయోగించటం అసాధ్యమవుతుండటం.. ఆ దేశ విదేశాంగ మంత్రి అనాగరిక ఆక్రోశానికి కారణంగా కనిపిస్తోంది. ఆయన తన నిస్పృహను తన సొంత దేశంలో.. ఉగ్రవాదాన్ని తమ విదేశాంగ విధానంగా మార్చిన ఉగ్రవాద సంస్థల సూత్రధారులపైకి మళ్లిస్తే మేలు. పాకిస్తాన్ తన సొంత ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సి ఉంది’’ అని బదులిచ్చారు.

    ఒసామా బిన్‌లాడెన్‌ను అమరవీరుడిగా కీర్తించే దేశం పాకిస్తాన్ అని, లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజహర్, సాజిద్ మిర్, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశమని ఆయన మండిపడ్డారు.

    ‘‘ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ప్రకటించిన వారిలో 127 మంది ఉగ్రవాదులను, ఐరాస ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన సంస్థల్లో 27 సంస్థలను అందించిన ఘనత తమదేనని (పాకిస్తాన్ మినహా) మరే దేశమూ గర్వంగా చెప్పుకోదు’’ అని ఎద్దేవా చేశారు.

    ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటువి, అవమానకరమైనవని బీజేపీ ఖండించింది.

    దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు శుక్రవారం నాడు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

    బిలావల్ వ్యాఖ్యలపై శనివారం నాడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ తెలిపింది.

  5. ‘ఏం సాధించారని ఈ ఊరేగింపు?’

  6. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  7. రాజస్థాన్: గ్యాస్ సిలిండర్ల పేలుడులో 32కు పెరిగిన మృతుల సంఖ్య.. పరిహారం పెంచాలంటూ బంధువుల ధర్నా

    రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఈ నెల 8వ తేదీన జరిగిన గ్యాస్ సిలిండర్ల పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. మరో 9 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

    షేర్‌గఢ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో డిసెంబర్ 8వ తేదీన భూంగ్రా టౌన్‌షిప్‌లో ఒక వివాహ కార్యక్రమంలో నాలుగు సిలిండర్లు పేలటంతో 50 మందికి పైగా తీవ్ర గాయాలపలయ్యారు.

    ఈ ఘటన జరిగినపుడు మొత్తం 53 మంది గాయపడి ఆస్పత్రిలో చేరగా.. ఇప్పటివరకూ 32 మంది చనిపోయినట్లు జోధ్‌పూర్ మహాత్మా గాంధీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్‌శ్రీ బెహరా బీబీసీతో చెప్పారు.

    తొమ్మిది మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరో 9 మందికి ఆస్పత్రి వార్డులో చికిత్స చేస్తున్నామన్నారు.

    గత రెండు రోజులుగా ఏడుగురు చనిపోగా వారి మృతదేహాలను తీసుకు వెళ్లటానికి వారి బంధువులు నిరాకరించారు. మృతుల కుటుంబాలకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి వద్ద రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు.

    ‘‘మృతుల బంధువులు బుధవారం సాయంత్రం నుంచి ఆస్పత్రి వద్ద ధర్నా చేస్తున్నారు. పరిహారం మొత్తాన్ని పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారితో కలెక్టర్, నేను మాట్లాడుతున్నాం’’ అని జోధ్‌పూర్ రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ బీబీసీకి చెప్పారు.

    సిలిండర్ పేలుడు సంభవించినపుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.

    మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటించింది. క్షతగాత్రులకు కూడా రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది.

  8. వహాయ: ఐదో భార్య పేరుతో సెక్స్ బానిసలుగా బాలికలు.. ప్రభుత్వం నిషేధించేవరకు పోరాడిన మహిళ

  9. రాహుల్ గాంధీ: ‘చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కేంద్రం ఆ విషయాన్ని దాస్తోంది’

    భారతదేశం, చైనాల మధ్య ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో.. ‘‘చైనా నుంచి స్పష్టమైన ముప్పు పొంచివుందని’’ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.

    పొరుగు దేశం చైనా యుద్ధానికి సన్నద్ధం అవుతోందని.. కానీ ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దాయటానికి, విస్మరించటానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

    అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత, చైనా సైనికుల మధ్య ఈ నెల 9వ తేదీన జరిగిన ఘర్షణను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో చైనా తనవైపు నుంచి దాడికి ఏర్పాట్లు చేస్తోంటే.. భారత ప్రభుత్వం నిద్రావస్తలో ఉంది. చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. చొరబాటు కోసం కాదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

    భారత ప్రభుత్వం సంఘటనల ప్రాతిపదికగా పనిచేస్తోంది కానీ వ్యూహాత్మకంగా పనిచేయటం లేదని ఆయన విమర్శించారు.

    ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ కూడా ‘‘తన అవగాహనను పెంపొందించుకోవాల’’ని రాహుల్ తప్పుపట్టారు.

    భారత మీడియా కూడా చైనాతో సరిహద్దు వివాదం గురించి తనను ప్రశ్నించదని విమర్శించారు.

    అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో యాంగ్సే వద్ద ఎల్ఏసీ నుంచి భారత భూభాగంలోకి చొచ్చుకురావటానికి చైనా బలగాలు ప్రయత్నించాయని.. యధాతథస్థితిని ఏకపక్షంగా మార్చటానికి ప్రయత్నించాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు పార్లమెంటులో ప్రకటించారు. ఆ సందర్భంగా చైనా, భారత సైనికుల మధ్య భౌతిక ఘర్షణ జరిగిందని, ఇరువైపులా కొందరు సైనికులు గాయపడ్డారని, భారత సైనికులు ఎవరూ చనిపోలేదని ఆయన చెప్పారు.

    ‘‘మన ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి మన బలగాలు కట్టుబడి ఉన్నాయి. ఈ విషయంలో ఏ ప్రయత్నాలననైనా తిప్పికొట్టటాన్ని కొనసాగిస్తాయి’’ అని కూడా మంత్రి పేర్కొన్నారు.

  10. ఆంధ్రప్రదేశ్: విజయవాడ వద్ద కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

    కృష్ణా నదిలో మరోసారి ప్రమాదం జరిగింది. ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి.

    విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దిగువన ఈ ఘటన జరిగింది. యనమలకుదురు పరిధిలో ఏడుగురు విద్యార్థులు ఈత కోసం కృష్ణా నదిలో దిగారు. ఇద్దరు మాత్రం సురక్షితంగా ఒడ్డుకి చేరారు. ఐదుగురి ఆచూకీ దొరకలేదు.

    ప్రస్తుతం నదిలో ప్రవాహం సాధారణ స్థాయిలోనే ఉంది. ఈత కోసం దిగిన చోట ఊబిలో ఇరుక్కుపోయి ఉంటారని భావిస్తున్నారు.

    గల్లంతైన విద్యార్థులు పటమటకు చెందిన బాజీ, హుస్సేన్, కామేషు, మున్నా, బాలుగా గుర్తించారు.

    పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు ప్రారంభించారు.

  11. చైనాలో మందుల కోసం ఎగబడుతున్న జనం.. అసలేం జరుగుతోంది?

  12. ఫ్రాన్స్: లియాన్‌లో అగ్ని ప్రమాదం.. ఐదుగురు చిన్నారులు సహా 10 మంది మృతి

    ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా పది మంది చనిపోయినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది.

    వాల్క్స్-ఎన్-వెలిన్‌లోని ఒక ఏడంతస్తుల అపార్ట్‌మెంట్ ఫ్లాట్లలో అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు.

    ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది సహా 10 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.

    అగ్నికీలలతో 170 మంది అగ్నిమాపక సిబ్బంది పోరాడి మంటలను ఆర్పేశారు.

  13. ఆంధ్రప్రదేశ్ పండ్ల ఉత్పత్తిలో నంబర్ వన్‌గా ఎలా మారింది? వరి, చెరకు పండించడం ఎందుకు తగ్గుతోంది

  14. బిహార్: కల్తీ మద్యం మృతుల కేసులో నితీశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీస్

    బిహార్‌లో కల్తీ మద్యం తాగి 50 మంది చనిపోయిన ఉదంతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీస్ పంపించింది. ఈ ఉదంతంపై మీడియా వార్తలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

    బిహార్‌లో 2016 ఏప్రిల్‌లో మద్యనిషేధాన్ని అమలు చేశారు. అయితే ఈ నిషేధాన్ని రాష్ట్రం సరిగా అమలు చేయలేదని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.

    మీడియాలో వస్తున్న కథనాలు నిజమైనవి అయినట్లయితే.. మానవ హక్కుల కమిషన్ కోణంలో అది ఆందోళనకరమైన విషయమని కమిషన్ వ్యాఖ్యానించింది. ‘‘మద్యం విక్రయాలను, వినియోగాన్ని నిషేధించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు కనిపిస్తోంది’’ అని చెప్పింది.

    ఈ ఉదంతంపై నివేదికతో పాటు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, బాధితులకు వైద్య చికిత్స సమాచారాన్ని కూడా ఇవ్వాల్సిందిగా నిర్దేశిస్తూ బీహార్ డీజీపీ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు పంపించింది.

    బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారమైనా ఇచ్చారా అని కూడా కమిషన్ అడిగింది.

    ఈ ఉదంతానికి బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు చేపట్టారో తెలపాలని కూడా కోరింది. ఈ నోటీసుకు నాలుగు వారాల్లోగా జవాబు ఇవ్వాలని చెప్పింది.

  15. యుక్రెయిన్ మీద రష్యా దాడులు... ఇద్దరు మృతి

    యుక్రెయిన్ మీద రష్యా వరుసగా దాడులు చేస్తోంది.

    రాజధాని నగరం కీయెవ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పేలుళ్లు వినిపించాయి.

    రెసిడెన్సియల్ బిల్డింగ్‌ మీద రాకెట్ పడటంతో ఇద్దరు చనిపోయినట్లు నిప్రోపెట్రోవస్క్ రీజిన్ గవర్నర్ తెలిపారు.

    దాడుల నేపథ్యంలో కీయెవ్‌లని ప్రజలు మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారు. నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల వ్యవస్థలు దెబ్బతింట్లున్నట్లు అధికారులు చెబుతున్నారు.

    మరొకవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోనులో మాట్లాడినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.

  16. బంగ్లాదేశ్ టార్గెట్ 511... 258 పరుగుల వద్ద భారత్ రెండో ఇన్నింగ్ డిక్లేర్డ్

    బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 258 పరుగుల వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ముందు 511 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

    రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్(110), పూజారా(102) పరుగులు చేశారు.

    తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 404 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 150 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.

  17. అవతార్ 2 రివ్యూ: ‘మన’ అనుకున్నది ఎవరైనా లాక్కుంటే ఏం చేస్తామో అదే అవతార్.. జేమ్స్ కామెరూన్ సృష్టించిన మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌

  18. జనవరి రెండో వారంలో ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజన మీద సుప్రీం కోర్టు విచారణ

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో విచారించనుంది.

    పిటిషన్ కాపీని తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సిందిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపింది.

    91శాతం ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణకే ఎక్కువ లాభం చేకూరిందని పిటిషన్‌లో ఆంధ్రా ప్రభుత్వం పేర్కొంది.

  19. గాంబియాలో పిల్లల మరణానికి కారణం కావొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన దగ్గు సిరప్‌లు సురక్షితమే అన్న భారత్

    గాంబియాలో చిన్నారుల మరణానికి కారణమై ఉండొచ్చు అని ప్రపంచఆరోగ్యసంస్థ ప్రకటించిన మెడెన్ ఫార్మాకు చెందిన సిరప్‌లు సురక్షితమైనవిగా తమ పరీక్షల్లో తేలినట్లు భారత్ ప్రకటించింది.

    మెడెన్ ఫార్మా తయారు చేసిన దగ్గు సిరప్‌ల వల్ల గాంబియాలో 66 మంది పిల్లలు చనిపోయి ఉంటారని ఈ ఏడాది అక్టోబరులో ప్రపంచఆరోగ్యసంస్థ తెలిపింది.

    ‘మెడెన్ ఫార్మా తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లను ప్రభుత్వ లేబోరేటరీకి పంపించాం. ఆ నాలుగు ఉత్పత్తులు ప్రమాణాల ప్రకారమే ఉన్నాయి’ అని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ప్రపంచఆరోగ్యసంస్థకు లేఖ రాసింది.

  20. బంగ్లాదేశ్ మీద టెస్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీ

    బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ చేశాడు. ఇది అతనికి టెస్టుల్లో తొలి సెంచరీ.

    147 బంతుల్లో 103 పరుగులు చేశాడు శుభ్‌మన్ గిల్. చివరకు 110 పరుగుల వద్ద మెహిది హసన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మొత్తం 3 సిక్సులు 10 ఫోర్లు కొట్టాడు.

    ప్రస్తుతం పూజారా(54), విరాట్ కోహ్లీ(2) క్రీజులో ఉన్నారు. భారత్ 447 పరుగుల లీడ్‌లో ఉంది.

    తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 404 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 150 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.