ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్లోని నాలుగు ప్రాంతాల విలీనానికి గుర్తుగా పుతిన్ నేడు మాస్కోలోని క్రెమ్లిన్లో ప్రసగించారు. రిఫరెండం ఫలితాలు ప్రజల ఉద్దేశాన్ని, కోరికను తెలియజేస్తున్నాయని అన్నారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.
యుక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం కాబోతున్న సందర్భంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు మాస్కోలోని క్రెమ్లిన్లో ప్రసగించారు.
"రష్యాలో విలీనం చేయాలనుకున్న నాలుగు ప్రాంతాల ప్రజలు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఫలితాలు అందరికీ బాగా తెలుసు. ప్రజలు తమ ఉద్దేశాన్ని, కోరికను తెలియజెప్పారు" అని పుతిన్ అన్నారు.
యుక్రెయిన్లోని దోన్యస్క్, లుహాస్క్, ఖేర్సన్, జపోరిజ్జియాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ నాలుగు ప్రాంతాల ప్రజలు రష్యాలో విలీనం కావాలనుకుంటునట్లు ఫలితాలలో తేలింది.
"రిఫరెండం అక్రమమని పశ్చిమ దేశాలు గగ్గోలు పెట్టాయి. కానీ, ఫలితాలు లక్షలాది ప్రజల సంకల్పాన్ని తెలియజేస్తున్నాయి" అని పుతిన్ అన్నారు. ఈ ప్రాంతాలలో రష్యా పునర్నిర్మాణాలు చేపడుతుందని, వాటిని అభివృద్ధిపరుస్తుందని ఆయన అన్నారు.
"రష్యాలో విలీనం కాబోతున్న నాలుగు కొత్త ప్రాంతాలకు ఫెడరల్ అసెంబ్లీ మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇది కొన్ని లక్షల మంది ప్రజల కోరిక. ఫలితాలు ప్రజల నిజమైన హక్కును తెలియజేస్తున్నాయి" అంటూ పుతిన్ ప్రసంగించారు.
ప్రసంగం తరువాత, పుతిన్ సహా నాలుగు కొత్త ప్రాంతాలకు నియమించిన రష్యన్ నాయకులు అధికారిక పత్రాలపై సంతకం చేశారు.
కాగా, పుతిన్ పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా నిరాధారమైన వాదనలు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా "హైబ్రిడ్ వార్" చేస్తున్నాయని, దాన్ని వలస రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్టు పుతిన్ ఆరోపించారు.
అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడానికి రష్యా కారణం కాదని పుతిన్ అన్నారు. "అనేక సంవత్సరాల తప్పుడు విధానాల ఫలితమిది" అని అన్నారు.
2019 నాటి దేశద్రోహం కేసులో జేఎన్యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్కు శుక్రవారం దిల్లీ సాకేత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేశారని, ఫలితంగా జామియానగర్లో హింస చెలరేగిందని ఆరోపిస్తూ ఆయనపై ఈ కేసు నమోదైంది.
షార్జీల్కు అదనపు సెషన్స్ జడ్జి అనుజ్ అగర్వాల్, బెయిల్ మంజూరు చేశారు. అయినప్పటికీ ఆయన ఇప్పుడు జైలు నుంచి బయటకు రాలేరు.
దిల్లీ అల్లర్లకు సంబంధించిన ఆయనపై నమోదైన ఇతర కేసులు పెండింగ్లో ఉండటమే ఇందుకు కారణం. 2020 దిల్లీ అల్లర్లలో యూఏపీఏ కింద సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అల్లర్ల వెనుక కుట్రలో ఆయన హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి.
2019 డిసెంబర్నాటి కేసులో షార్జీల్కు ఇప్పుడు బెయిల్ లభించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి రెపో రేటును పెంచింది.
రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు, ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
తాజా పెంపుతో రెపో రేటు 5.90 శాతానికి పెరిగింది. గత మూడేళ్లలో ఇదే గరిష్ట రెపో రేటు
ఆర్బీఐ ఈ ఏడాదిలో రెపో రేటును పెంచడం ఇది నాలుగోసారి.
రెపో రేటు పెంపుతో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు సహా ఇతర రుణాలు అన్ని మరింత భారంగా మారనున్నాయి.
తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆశించిన స్థాయిలో లేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
రెపో రేటు అంటే ఆర్బీఐ, ఇతర బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఒక ఎడ్యుకేషన్ సెంటర్లో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
దష్గ్ బర్చి ప్రాంతంలోని కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్లో పేలుడు జరిగినట్లు చెప్పారు. ఆ సమయంలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఎడ్యుకేషన్ సెంటర్ సిబ్బంది తెలిపారు.
ఘటన జరిగిన ప్రాంతంలో హజారా మైనారిటీలు ఎక్కువగా ఉంటారు.
ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ఈ పేలుడుకు బాధ్యత వహించలేదు.
దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్కు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమయ్యాడు.
బుమ్రా స్థానంలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ భారత జట్టులో చేరాడు.
సిరీస్లో భాగంగా మిగిలిన రెండు టి20ల్లో బుమ్రా స్థానంలో సిరాజ్ ఆడే అవకాశం ఉంది.
అక్టోబర్ 2న ఆదివారం గువాహటిలో రెండో టి20 మ్యాచ్, అక్టోబర్ 4న మంగళవారం ఇండోర్లో మూడో టి20 జరుగనుంది
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఆర్. అశ్విన్, చహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర నేడు కర్ణాటకకు చేరింది.
అక్కడ రాహుల్ గాంధీకి, ఆయనతో పాటు యాత్ర చేస్తోన్న వారికి స్వాగతం లభించింది. చామరాజనగర్లోని ఊటీ-కాలికట్ జంక్షన్ నుంచి కర్ణాటకలో యాత్ర కొనసాగనుంది.
గురువారంతో కేరళలో రాహుల్ యాత్ర ముగిసింది. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇప్పటివరకు 532 కి.మీ పాదయాత్ర చేశారు. ఇంకా 3,038 కి.మీ చేయాల్సి ఉంది.
అమెరికాలోని ఫ్లోరిడాలో ‘ఇయాన్’ హరికేన్ బీభత్సం తగ్గేలా కనిపించట్లేదు.
తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న షార్లెట్ కౌంటీలో ఇప్పటివరకు 10 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. లక్షలాది మంది ప్రజలు ఈ హరికేన్ ప్రభావానికి గురయ్యారు.
‘‘హరికేన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటైన షార్లెట్ కౌంటీలో 10 మంది మరణించారు’’ స్థానిక అధికారి జోసెఫ్ టిసివో, బీబీసీతో చెప్పారు. సహాయక కార్యక్రమాలు ముమ్మురంగా సాగుతున్నాయని తెలిపారు.
ఫ్లోరిడా చరిత్రలోనే ఇయాన్ తుపాను అత్యంత భయంకరమైన తుపానుగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
గవర్నర్ కార్యాలయం ఇచ్చిన సమాచారం ప్రకారం, సుమారు 5000 మంది ఫ్లోరిడా నేషనల్ గార్డ్ సిబ్బంది, పొరుగు రాష్ట్రాలకు చెందిన 2000 మంది సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తుపానులో చిక్కుకున్న ప్రజల జాడను కనుక్కోవడం కోసం 800 మందితో కూడిన 8 బృందాలు పని చేస్తున్నాయి.
ప్రస్తుతం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వ్యాపించి ఉన్న తుపాను మరింత బలపడుతోంది.
తుపాను కారణంగా గురువారం 25 లక్షల ఇళ్లు విద్యుత్ కోతను ఎదుర్కొన్నాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.