"ప్రపంచ పునాదులను పేదరికం, ఆకలి, అసమానతలు నాశనం చేస్తున్నాయి" - ప్రియాంక చోప్రా
సినీ నటి, యూనిసెఫ్ గుడ్ విల్ రాయబారి ప్రియాంక చోప్రా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు.
ఆమె ఈ ప్రసంగంలో ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విధ్వంసకర ప్రభావం నుంచి బయటపడేందుకు పోరాడుతున్నాయి. వాతావరణ మార్పులు జీవితాలను, జీవనాధారాలను అతలాకుతలం చేస్తున్నాయి. పోరాటాలు రగులుతున్నాయి. సుదీర్ఘ కాలం పోరాడి నిర్మించుకున్న సమానత్వంతో కూడిన ప్రపంచ పునాదులను పేదరికం, ఆకలి, అసమానతలు నాశనం చేస్తున్నాయి" అని అన్నారు.
"ప్రపంచంలో పరిస్థితులు మెరుగ్గా లేవని అందరికీ తెలుసు. కానీ, ఈ సంక్షోభాలు అవకాశం కొలదీ ఏర్పడేవి కావు. కానీ, ప్రణాళికతో వాటిని సరిదిద్దుకోవచ్చు. మన దగ్గర ఆ ప్రణాళిక ఉంది" అంటూ ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర లక్ష్యాలను గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా సంఘీభావం అవసరమని ఆమె అన్నారు.
ప్రియాంక గాంధీ ఈ సమావేశానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఆధునిక యుగంలో సుస్థిర అభివృద్ధి ప్రాముఖ్యతను వక్కాణించారు. సుస్థిర అభివృద్ధిని సాకారం చేసేందుకు సమిష్టిగా ఏమి చేయాలో ఆలోచించాలని, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసేందుకు లేదని అన్నారు.
ప్రియాంక ఒక సంవత్సర కాలంగా యూనిసెఫ్ తో కలిసి పని చేస్తున్నారు.