మహమ్మద్ ప్రవక్త మీద అవమానకర వ్యాఖ్యలు చేశారన్న
అభియోగం మీద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను తెలంగాణ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్
చేశారు.
ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ పై కొన్ని వ్యాఖ్యలు
చేస్తూ రాజాసింగ్ విడుదల చేసి వీడియో వివాదాస్పదం అయింది. సోమవారం రాత్రి నుంచి
పాత నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లు, కూడళ్లలో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి రాజా సింగ్ ను
అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఐపీసీ సెక్షన్లు 295(ఎ), 153(ఎ) సహా పలు
సెక్షన్ల కింద రాజాసింగ్ మీద కేసు హైదరాబాద్ పోలీసులు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం
రాజాసింగ్ను ఆయన కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు.
ఆయనను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇటీవల మునావర్ ఫారూఖీ అనే ఒక స్టాండప్ కమెడియన్
హైదరాబాద్లో షో నిర్వహించారు. దాన్ని అడ్డుకోవడానికి రాజాసింగ్ ప్రయత్నించారు.
అప్పుడు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
రాముడు, సీతపై మాట్లాడిన ఫారూఖీ షోను హైదరాబాద్లో అనుమతిస్తే, ఆగస్టు 23న తాను కూడా ఒక కామెడీ షో చేస్తానని, ఆ తరువాత దేశం మొత్తం మతపరమైన వాతావరణం
వస్తుందని అప్పుడు రాజా సింగ్ హెచ్చరించారు.
ఆ క్రమంలోనే రాజా సింగ్ వీడియో విడుదల చేశారు. 10 నిమిషాల పైనే నిడివి ఉన్న వీడియోలో ఫారూఖీని బూతులు తిట్టారు. తరువాత మహమ్మద్ ప్రవక్త పేరును ప్రత్యక్షంగా చెప్పకుండా, పరోక్షంగా అర్థం వచ్చేలా అనేక వ్యాఖ్యలు చేశారు. మునావర్ ఫారూఖీ షోను హైదరాబాద్లో అనుమతించడానికి నిరసనగానే తాను ఈ వీడియో చేస్తున్నట్టుగా చెప్పారు రాజాసింగ్.
మరోవైపు పాత నగరంలోని పలు చోట్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మత కలహాలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.
మరోవైపు.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ను కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో పాదయాత్ర శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు.
దిల్లీ లిక్కర్ కేసులో
ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన బీజేపీ కార్యకర్తల అరెస్టులపై సంజయ్
నిరసన తెలపడంతో ఆయననూ అరెస్ట్ చేశారు.