You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

చైనా మా దేశాన్ని ఆక్రమించబోతోంది: తైవాన్ విదేశాంగ మంత్రి

తైవాన్ ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చైనా అన్ని ప్రయత్నాలు చేస్తోందని విదేశాంగ మంత్రి ఆరోపించారు.

లైవ్ కవరేజీ

  1. హర్ ఘర్ తిరంగా: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌కు చెందిన మహిళా సైన్యం ప్రత్యేక గస్తీ

    ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన మహిళా సైన్యం జెండాలు పట్టుకుని 17,000 అడుగుల గస్తీ పూర్తి చేశారు.

    ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఈ ప్రత్యేక గస్తీని నిర్వహించారు.

  2. బిహార్: నేడు నితీశ్ కుమార్ పార్టీ కీలక సమావేశం

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈరోజు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. బీజేపీ, జేడీయూ కుమ్ములాటల నేపథ్యంలో, ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఇది కాకుండా, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌ కూడా సమావేశం కానున్నాయి

    ఒకవేళ నితీశ్ బీజేపీని వీడితే, మళ్లీ మహాకూటమికి సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ఇదివరకే సూచించాయి.

    ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి నితీశ్ కుమార్ గైర్హాజరు కావడం, ఇరు పార్టీల మధ్య సయొధ్య చెడిందనేదానికి సంకేతమని పలువురు భావిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

    కాగా, ఆదివారం నితీశ్ కుమార్ బిహార్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేలు అవసరం. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా, బీజేపీ, జేడీయూ ప్రభుత్వంలో భాగస్వాములు.

    ఎన్డీఏకు మొత్తం 126 + 1 స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉంది.

    ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇటీవల కేసు కారణంగా తన శాసనసభ సభ్యత్వాన్నికోల్పోయారు.

    ఒకవేళ బీజేపీ, జేడీయూ దారులు వేరైతే, ప్రభుత్వంలో కొనసాగేందుకు జేడీయూకి 77 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, బీజేపీకి 45 మంది ఎమ్మెల్యేలు అవసరం.

  3. 'New Start': అమెరికా వ్యూహాత్మక అణ్వాయుధాల ఆన్‌సైట్ తనిఖీని నిషేధించిన రష్యా

    అమెరికా వ్యూహాత్మక అణ్వాయుధాల ఆన్‌సైట్ తనిఖీని రష్యా నిషేధించింది. 'న్యూ స్టార్ట్' అనే ఆయుధ నియంత్రణ ఒప్పందం కింద ఈ తనిఖీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రష్యా తెలిపింది.

    అమెరికా తమ భూభాగంలో అణ్వాయుధాల తనిఖీల ద్వారా ప్రయోజనం పొందుతోంది కానీ, అమెరికా భూభాగంలో తమ అణ్వాయుధాల తనిఖీని నిరోధిస్తోందని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.

    యుక్రెయిన్‌తో యుద్ధం కారణంగా అమెరికా తమ దేశంపై ఆంక్షలు విధించడంతో, ఇరు దేశాల మధ్య పరిస్థితులు మారిపోయాయని రష్యా తెలిపింది.

    'న్యూ స్టార్ట్' ఆయుధ నియంత్రణ ఒప్పందం 2011లో అమలులోకొచ్చింది. దీని ప్రకారం, ప్రతి దేశం 1,550 వరకు మాత్రమే సుదూర (లాంగ్ రేంజ్) అణ్వాయుధాలను మోహరించగలదు. ఈ ఒప్పందం 2026లో ముగుస్తుంది.

    ఈ ఒప్పందం, "అసాధారణ పరిస్థితుల్లో" అణ్వాయుధ తనిఖీలను నిషేధించే వీలు కల్పిస్తుందని రష్యా తెలిపింది.

    రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని నిరోధించేందుకు, ఆయుధాలను తగ్గించడమే లక్ష్యంగా 'న్యూ స్టార్ట్' ఒప్పందం జరిగింది.

    కాగా, కొత్త అణ్వాయుదాల ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కిందటి వారం ప్రకటించారు.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో, ఇరు దేశాల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. మూడవ ప్రపంచ యుద్ధం రాగలదన్న హెచ్చరికలు కూడా వినిపించాయి.

  4. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మొత్తం 61 పతకాలు.. స్వదేశానికి చేరుకున్న క్రీడాకారులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం

    బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వదేశానికి తిరిగొచ్చిన ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది.

    ఆగస్ట్ 8 సోమవారం కామన్వెల్త్ గేమ్స్‌ ముగిశాయి. భారత్ మొత్తం 61 పతకాలు సాధించింది. వాటిలో 22 స్వర్ణం కాగా 16 రజతం, 23 కాంస్య పతకాలు.

    సోమవారం రాత్రి దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న క్రీడాకారులకు ప్రజలు పూల మాలలు వేసి స్వాగతం పలికారు. కొంతమంది ఆటగాళ్లతో సెల్ఫీలు దిగారు.

    కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన సాక్షి మాలిక్‌, కాంస్య పతక విజేత పూజా సిహాగ్‌, పూజా గెహ్లాట్‌ల కోసం ప్రజలు పుష్పగుచ్ఛాలతో నిరీక్షించారు. కొందరు వాళ్ల మెడలో నోట్ల దండ కూడా వేశారు.

    తరువాత, సాక్షి మీడియాతో మాట్లాడుతూ, "స్వర్ణం సాధించిన ఘనత దేశానికే దక్కుతుంది. ఒలింపిక్ తరువాత కామన్వెల్త్‌లో పతకం సాధించడం ఆనందంగా ఉంది" అని అన్నారు.

    పూజా సిహాగ్ తన పతకం క్రెడిట్‌ తన కోచ్‌కే దక్కుతుందని చెప్పారు.

    రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన దిల్లీ రెజ్లర్ దివ్య కక్రాన్‌కు బాజాలు వాయిస్తూ స్వాగతం పలికారు.

    అథ్లెట్లు సందీప్ కుమార్, అల్డోస్ పాల్, అవినాష్ సాబ్లే, అబ్దుల్లా అబూబకర్ కూడా స్వదేశానికి చేరుకున్నారు. 10,000 మీటర్ల రేస్ వాక్‌లో అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్య పతకం సాధించాడు.

    కామన్వెల్ట్ గేమ్స్ చివరి రోజు భారత్ నాలు 4 స్వర్ణాలు సాధించింది. దాంతో, మొత్తం 22 స్వర్ణాలు భారత్ ఖాతాలో పడ్డాయి.

    చివరిరోజు, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ భారత్‌కు స్వర్ణాలు అందించి విజయ పతాక ఎగురవేశారు.

    బ్యాడ్మింటన్‌లోనే పురుషుల డబుల్స్‌లో సాత్విక్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా స్వర్ణం సాధించారు. అలాగే, 16 ఏళ్ల తర్వాత టేబుల్‌ టెన్నిస్‌లో ఆచంట శరత్‌ కమల్‌ సింగిల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు.

    వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాన్ బాల్ మొదలుకొని అథ్లెటిక్స్ వరకు భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది.

    బర్మింగ్‌హామ్‌లో భారత్ 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలతో సహా మొత్తం 61 పతకాలు సాధించింది.