You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కామన్వెల్త్ గేమ్స్‌: భారత్‌ ఖాతాలో తొలి పతకం, సంకేత్ సర్గార్‌కు రజతం

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల బోణీ చేసింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌ తొలి పతకాన్ని అందుకుంది.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. తెలంగాణ: కామారెడ్డి వాసికి మంకీపాక్స్ నెగెటివ్

    తెలంగాణలోని కామారెడ్డిలో మంకీపాక్స్ అనుమానిత కేసుగా గుర్తించిన వ్యక్తికి నెగెటివ్ ఫలితం వచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

    జూలై 24న మంకీపాక్స్ లక్షణాలతో కామారెడ్డికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత ఆయనను హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల కోసం ఆయన నమూనాలను పుణేలోని ఎన్‌ఐవీ ల్యాబ్‌కు పంపించినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పారు.

    మంకీపాక్స్ అనుమానిత లక్షణాలున్న వ్యక్తి ఇటీవలే కువైట్ నుంచి భారత్‌కు వచ్చారు. తాజాగా ఆయనకు మంకీపాక్స్ నెగెటివ్ ఫలితం వచ్చినట్లు తమకు సమాచారం అందిందని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

  2. ఈరోజు కూడా ఈడీ ముందుకు సోనియా గాంధీ

    నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని బుధవారం కూడా ప్రశ్నించనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చెప్పారు. ఈ మేరకు ఆమెకు సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు.

    మూడో విడత విచారణ కోసం బుధవారం సోనియా గాంధీ, ఈడీ ఎదుట హాజరు కానున్నారు.

    మంగళవారం దాదాపు 6 గంటల పాటు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ఈ సమయంలో ఆమెను దాదాపు 55 ప్రశ్నలు అడిగినట్లు, రాహుల్ గాంధీని కూడా దాదాపు ఈ తరహా ప్రశ్నలే అడిగినట్లు అధికారులు తెలిపారు.

    సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఈ నిరసనలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి.

    మంగళవారం పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు కాంగ్రెస్ ఎంపీలు నిరసన ర్యాలీ చేశారు. ఇందులో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

    నిరసనల సందర్భంగా 57 ఎంపీలు సహా మొత్తం 259 మంది కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు దిల్లీ పోలీస్ ప్రత్యేక కమిషనర్ ఎస్పీ హుడా చెప్పారు.

    నిరసనల సమయంలో దిల్లీలోని క్లారిడెజ్ హోటల్ సమీపంలో ఒక మోటార్ సైకిల్‌కు నిప్పు అంటించారు.

  3. సెక్స్ రాకెట్ కేసులో మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ అరెస్ట్

    తన పామ్ హౌస్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలతో మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మరాక్‌ అరెస్ట్ అయ్యారు.

    మంగళవారమే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తా ఏజెన్సీ పీటీఐ తెలిపింది. ‘‘బెర్నార్డ్ ఎన్ మరాక్ అలియాస్ రింపూను ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో అరెస్ట్ చేశాం. ఆయనను తురాకు తీసుకురావడానికి ఒక బృందాన్ని వెళ్తోంది’’ అని పీటీఐతో వెస్ట్ గారో హిల్స్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేకానంద్ సింగ్ చెప్పారు.

    మేఘాలయ అధికారులు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారని, ఆ తర్వాతే ఆయనను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

    బెర్నార్డ్ ఎన్ మరాక్ ప్రస్తుతం మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సభ్యుడు కూడా.

    వెస్ట్ గారో హిల్స్ జిల్లా తురాలోని బెర్నార్డ్ ఫామ్ హౌస్‌లో శనివారం పోలీసులు సోదాలు చేశారు. ఆ ఫామ్ ‌హౌస్‌లో సెక్స్ రాకెట్ నడుస్తోందని, అక్కడి నుంచి ఆరుగురు మైనర్లను రక్షించడంతో పాటు 73 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఫామ్‌హౌస్‌పై తనిఖీలు ప్రారంభించారు. ఉదయం 5 గంటల వరకు ఇవి కొనసాగాయి.

    మూడు అంతస్థుల ఆ భవనంలో సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు పోలీసులు, విలేఖరుల సమావేశంలో చెప్పారు. ‘ఈ భవనంలో రెండు అంతస్థులు బేస్‌మెంట్ లోపల ఉన్నాయి. ఇందులో 30 చిన్న గదులు ఉన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. కొంతమంది ఒంటిపై దుస్తులు లేకుండా వాహనాల్లో ఉన్నారు’’ అని చెప్పారు.

    ఫామ్ హౌస్ నుంచి 36 వాహనాలు, 47 మొబైల్ ఫోన్లు, లక్షా 68 వేల విలువ చేసే మద్యం, 500 కండోమ్‌లు, ఇతర అభ్యంతరకర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  4. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ పేజీని ఫాలో అవండి.