You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి నదిలో వరదనీటి ప్రవాహం

లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఇంకా ఎవరైనా అక్కడ ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జిల్లా ఎస్పీ కోరారు. సురక్షిత ప్రాంతాల ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు కావొద్దని సూచించారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. ఉప్పొంగిన గోదావరి.. ‘వందేళ్లలో ఎప్పుడూ చూడనంత వరద’

  2. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. అంత వరకు సెలవు.

  3. ప్రారంభమైన ఉచిత కరోనా బూస్టర్ డోస్ పంపిణీ

    కరోనా బూస్టర్ డోస్‌ను నేటి నుంచి ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

    నేటి నుంచి 75 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 30 వరకు బూస్టర్ డోస్‌ను అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు.

    18 సంవత్సరాల కంటే వయసు పైబడిన వారు బూస్టర్ డోస్ వేసుకోవడానికి అర్హులు.

    సెకండ్ డోసు తీసుకుని 6 నెలలు దాటిన వారు కూడా తీసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరిగి బూస్టర్ ఇస్తారని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 3.5 కోట్ల మందికి ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పీహెచ్‌సీలు, సచివాలయాల్లో బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.

  4. రిపోర్టర్ జమీర్ మరణం: ‘జర్నలిజంలో ఆర్థికంగా స్థిరపడటం కష్టమని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవుదామనుకున్నాడు’

  5. శ్రీలంకలో ఏం జరుగుతోంది? తర్వాతేంటి? లంక ముందున్న దారేంటి?

  6. భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి పాకిస్తాన్‌‌కు రహస్య సమాచారం ఇచ్చారా... అలా ఆరోపించిన నుస్రత్ మీర్జా ఎవరు?

  7. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి నదిలో వరదనీటి ప్రవాహం, సురేఖ అబ్బూరి, బీబీసీ ప్రతినిధి

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ ఉధృతి పెరిగింది. నీటి మట్టం 70 అడుగులకు చేరుకుందని అధికార యంత్రాంగం ప్రకటించింది.

    చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వరద రావడంతో బూర్గంపాడు, సారపాక, తాళ్ల కొమ్మూరు ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

    వరద సహాయక చర్యలు పర్యవేక్షణకు భద్రాచలానికి నలుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లును నియమించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

    68 మంది సభ్యుల పదాతిదళం, 10 మంది సభ్యుల వైద్య బృందం, 23 మంది సభ్యుల ఇంజనీరింగ్ బృందం సహాయచర్యల్లో పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తున్నాయని.. వర్షాలు, వరదలు, పునరావాస, సహాయక చర్యలపై జరిపిన సమీక్ష సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

    భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిలో పెరుగడం వలన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

    ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

    సురక్షిత ప్రాంతాల్లో ఉన్న వారు సైతం అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని కోరారు.

    అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసువారి సహాయం పొందాలని సూచించారు.

  8. లలిత్ మోదీ, సుష్మితా సేన్: 'ఓపిక.. పట్టుదల.. నిలకడతో విజయం సాధించొచ్చు’ - సోషల్ మీడియాలో రియాక్షన్లు

  9. వాహనమిత్ర నగదు బదిలీ: 2,61,516 మంది లబ్ధిదారులకు రూ.261.52 కోట్ల ఆర్ధిక సాయం, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    నాలుగో విడత వాహనమిత్ర నగదు బదిలీ కార్యక్రమాన్ని సీఎం జగన్ విశాఖలో ప్రారంభించారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశారు.

    సొంత ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు.. 2,61,516 మంది లబ్ధిదారులకు తమ వాహన అవసరాల కోసం పదివేల చొప్పున మొత్తం 261.52 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు.

    ఈ సందర్భంగా జగన్ ఆటో డ్రైవర్ల యూనిఫాం ఖాకీ చొక్కా ధరించి ఒక ఆటోను స్టార్ట్ చేశారు. కాసేపు అందులోనే ఉన్నారు.

    అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. ‘వైఎస్సార్‌ వాహనమిత్ర కింద 2.60 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది. లక్షలమంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న డ్రైవర్లకు...కరోనా కష్టకాలంలో కూడా వాహనమిత్ర నగదును అందించాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా సొంత వాహనం కలిగినవారికి ఆర్థికసాయం అందజేస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి వాహనమిత్ర పథకం అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పథకం అమలు చేశాం. వైఎస్సార్‌ వాహనమిత్ర కింద ఇవాళ రూ.261.51 కోట్లు ఇస్తున్నాం. డ్రైవర్ సోదరులంతా వాహనం ఫిట్ నెస్, ఇన్స్యూరెన్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. మీ చేతుల్లో ప్రయాణీకుల ప్రాణాలుంటాయనే విషయం మర్చిపోవద్దు” అని సీఎం జగన్ అన్నారు.

  10. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫొటోల్లోని నక్షత్రాలు 8 దిశల్లో కాంతిని వెదజల్లుతున్నాయి. ఎందుకు?

  11. తెలంగాణ వరదల్లో బాహుబలి సీన్

  12. శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె

    శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె కొద్దిసేపటి క్రితం ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

    శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించడానికి రేపు (16వ తేదీ) పార్లమెంటులో సమావేశం కావాలని స్పీకర్ మహింద యాపా అభయవర్ధన సభ్యులకు పిలుపునిచ్చారు.

  13. కోనసీమ లంకలో వీధులు, రోడ్లు జలమయం

    గోదావరి వరదల కారణంగా కోనసీమ లంకలో మోకాళ్ల లోతు నీళ్లు వచ్చేశాయి. వీధులు, రోడ్లు జలమయమైపోయాయి.

    కోనసీమ లంక పరిస్థితి ఫొటోల్లో..

  14. వల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌‍లో ఇండియాకు 3 పతకాలు తెచ్చిన 94 ఏళ్ల బామ్మ

  15. గోదావరి 1986 నాటి స్థాయిలో పొంగితే ఏటిగట్లు నిలుస్తాయా

  16. ద్వారక: సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం అన్వేషణ. దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి

  17. National Emblem: జాతీయ చిహ్నంలో సింహాలు క్రూరంగా కనపడేలా మార్చారా, ఆర్కిటెక్ట్ చెప్పిన విషయాలేంటి

    తాజాగా కొత్త పార్లమెంటు భవనంపై నాలుగు సింహాల విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అయితే, ఈ విగ్రహం రూపురేఖలపై వివాదం రాజుకొంది.

    ఈ సింహాలు జాతీయ చిహ్నంలో అవసరమైన దాని కంటే చాలా ఆగ్రహంతో కనిపిస్తున్నాయని విమర్శకులు చెబుతున్నారు.

    ఈ విగ్రహాన్ని తయారుచేసిన సునీల్ దేవ్డేతో బీబీసీ మాట్లాడింది.

    ‘‘ఈ విగ్రహంపై సంవత్సరం పాటు పూర్తి నిబద్ధతతో పనిచేశాను. అది చాలా చక్కగా వచ్చిందని నాకు అనిపిస్తోంది. జాతీయ చిహ్నాన్ని తయారుచేసే అవకాశం నాకు దక్కడంతో చాలా సంతోషంగా అనిపిస్తోంది. దీని కోసం నేను వంద శాతం శక్తి వంచన లేకుండా పనిచేశాను’’అని ఆయన తెలిపారు.

  18. భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది..

    భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ప్రవహిస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

    భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స్థాయిలో 67 అడుగులకు చేరింది. 22 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.

    మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉంద‌ని అధికారులు అంచనా వేస్తున్నారు.

    1976 నుంచి గోదావరి నీటిమట్టం 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి. 30 ఏండ్ల తర్వాత 70 అడుగులకు చేరువైంది. ఇప్పటివరకు రెండు సార్లుమాత్రమే 70 అడుగులు దాటింటి. ఇప్పుడు 75 అడుగులు దాటితే 50 ఏండ్ల రికార్డును అధిగమించినట్లవుతుంది.

  19. రిషి సునక్: బ్రిటన్ ప్రధాని రేసులో రెండవ రౌండ్‌లో ముందంజ

    రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో రెండవ రౌండ్‌లో కూడా ముందజలో ఉన్నారు. రెండో దశ పోలింగ్‌లో సునక్ 101 మంది ఎంపీల మద్దతును గెలుచుకున్నారు. తన సమీప ప్రత్యర్థి పెన్నీ మోర్డంట్ కంటే 18 ఓట్లు ఎక్కువ సాధించారు.

    బ్రిటన్‌లో బోరిస్ జాన్సన్ రాజీనామాతో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి, బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి పోటీ మొదలైంది. భారత మూలాలున్న మాజీ ఛాన్సలర్ రిషి సునక్ ఈ పోటీలో ముందంజలో ఉన్నారు.

    మొదటి రౌండ్‌లో సునక్ 88 ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా, వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ 67 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు.

    రెండవ రౌండ్‌లో కూడా సునక్ ఆధిపత్యం కనబరిచారు. ఈ రౌండ్‌లో సునక్‌కు 101 ఓట్లు, పెన్నీ మోర్డంట్‌కు 83 ఓట్లు, లిజ్ ట్రాస్‌కు 64 ఓట్లు, కెమీ బాడెనోక్‌కు 49 ఓట్లు, టామ్ టుగెన్‌థాట్‌కు 32 ఓట్లు వచ్చాయి.

    రెండో రౌండ్ ఓటింగ్‌లో అటార్నీ జనరల్ సుయెల్లా బ్రవర్‌మాన్‌కు అత్యల్పంగా 27 ఓట్లు వచ్చాయి. దాంతో, ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రతి దశలో 30 కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినవారే తదుపరి దశ ఎన్నికలకు వెళతారు.

    మూడవ రౌండ ఓటింగ్ వచ్చే సోమవారం జరగనుంది. దీనికి ముందు, అయిదుగురు అభ్యర్థులు శుక్రవారం ఛానల్-4 చర్చలో పాల్గొంటారు.

    వచ్చేవారానికి ఈ పోటీలో ఇద్దరే మిగులుతారన్నది లెక్క. వారిలో ఒకరిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, ప్రధానమంత్రిగా ఎన్నుకునే బాధ్యత టోరీ సభ్యులపై ఉంటుంది. ఈ దశలో సుమారు 160,000 టోరీ సభ్యులు (కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు) తమ ప్రియతమ నాయకుడికి ఓటు వేస్తారు.

    సెప్టెంబర్ 5న చివరి దశ ఫలితాలు వెల్లడిస్తారు.

    బోరిస్ జాన్సన్ మంత్రి వర్గం నుంచి వైదొలిగిన తొలి ఇద్దరు మంత్రులలో రిషి సునక్ మొదటివారు. బోరిస్ జాన్సన్ రాజీనామాతో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి, బ్రిటన్ ప్రధానమంత్రి అభ్యర్ధిత్వానికి ఆయన పోటీలోకి దిగారు. బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించేవారు.

    సునక్ తరువాత చాలా మంది నాయకులు, ఎంపీలు రాజీనామా చేశారు. చివరికి బోరిస్ జాన్సన్ కూడా పార్టీ నాయకుడి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతారు.

  20. గోదావరి వరదలు: జులై నెలలో ఈ స్థాయి వరద వందేళ్లలో ఇదే తొలిసారి..

    గోదావరి వరదల తాకిడితో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి.

    కడెం, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో తగ్గడంతో కొన్ని ప్రాంతాలు తేరుకున్నాయి. కానీ కాళేశ్వరం దిగువన తెలంగాణలోని అనేక మండలాలు వరద ముంపులో కనిపిస్తున్నాయి.

    అదే సమయంలో భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరు జిల్లాల్లోని వందల గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పోలవరం ముంపు మండలాలతో పాటుగా, గోదావరి లంకలు, కోనసీమ గ్రామాల ప్రజలు భయాందోళనతో గడపాల్సి వస్తోంది.