రెండున్నరేళ్ల తరువాత చైనా నుంచి బయటికొచ్చిన షీ జిన్పింగ్ హాంకాంగ్లో పర్యటిస్తున్నారు.
25 ఏళ్ల క్రితం జూలై 1న బ్రిటిష్ నియంత్రణ నుంచి చైనా పాలనకు తిరిగి వచ్చిన హాంకాంగ్ ఈ ఏడాది రజతోత్సవం (సిల్వర్ జూబ్లీ) జరుపుకుంటోంది. ఈ సందర్భంగా షీ జిన్పింగ్ ఆ దేశంలో పర్యటిస్తున్నారు.
2020 జనవరిలో కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చైనా దాటలేదు.
ఆయన చివరిసారి 2017లో హాంకాంగ్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆ దేశంలో పర్యటించారు.
సాధారణంగా ప్రతి ఏడాది జూలై 1న హాంకాంగ్లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతాయి. కానీ, 2020లో తీసుకొచ్చిన భద్రతా చట్టం అసమ్మతిని తెలిపే హక్కును, భావప్రకటనా స్వేచ్ఛను కబళించింది. నిరసనకారుల నోళ్లు మూయించింది.
1997లో హాంకాంగ్ బ్రిటిష్ నియంత్రణ నుంచి చైనా పాలనలోకి వచ్చింది. 'ఒకే దేశం, రెండు వ్యవస్థలు' అనే ప్రాతిపదికన పాలన సాగించాలని అప్పట్లో అంగీకారం కుదిరింది.
ఈ సూత్రం హాంకాంగ్కు మరో 50 ఏళ్ల వరకు స్వతంత్ర శాసనసభ, న్యాయవ్యవస్థను ఏర్పరచుకునే అవకాశాన్ని ఇస్తుంది.
అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన భద్రతా చట్టం ఈ సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని, న్యాయవ్యవస్థను బలహీనపరుస్తోందని, వ్యతిరేక స్వరాలను అణచివేస్తోందని విమర్శకులు అంటున్నారు.