You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మహారాష్ట్ర సంక్షోభం: అనర్హత నోటీసులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు

శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే అనర్హత నోటీసులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులను జారీ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని షిండే సుప్రీం కోర్టును కోరారు

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య, పసునూరు శ్రీధర్ బాబు

  1. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

    భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

    ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ కోసం లండన్‌లో ఉంది.

    "శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT)లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకినట్లు తేలింది. రోహిత్ ప్రస్తుతం హోటల్‌లో ఐసొలేషన్‌లో ఉన్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది" అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.

    జూలై 1 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గత ఏడాది ప్రారంభమైన టెస్టు సిరీస్‌లో భాగం.

    గత సంవత్సరం, భారత జట్టు అయిదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌ వెళ్లింది. నాలుగు మ్యాచ్‌ల తరువాత భారత ఆటగాళ్లలో కొంతమందికి కరోనా సోకినట్లు తెలియడంతో అయిదవ టెస్టు వాయిదాపడింది.

    అయిదవ టెస్టు ఇప్పుడు జరగనుంది. ఈ సీరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది.

  2. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి కలిసొచ్చిన సానుభూతి - డిపాజిట్ కోల్పోయిన బీజేపీ

  3. గ్యాస్ట్రిక్ అల్సర్‌ల కోసం కనిపెట్టిన మాత్ర గర్భస్రావం కోసం వాడే ఔషధంగా ఎలా మారింది?

    అబార్షన్.. చాలా దేశాల్లో ఇదొక వివాదాస్పద అంశం. కొందరు దీన్ని మహిళల హక్కుగా భావిస్తే, కొందరు దీన్ని తప్పని, పాపమని అంటారు. పలు దేశాల్లో అబార్షన్‌ను నిషేధించారు కూడా. ఇది లక్షలాది మహిళల జీవితాలపై ప్రభావం చూపే అంశం.

    అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మందులతో అబార్షన్ లేదా శస్త్రచికిత్స.

    సర్జరీ ద్వారా స్త్రీ గర్భాశయం నుంచి పిండాన్ని తొలగిస్తారు. రెండోది, గర్భస్రావం కావడానికి మాత్రలు వాడడం. దీనికి మైఫ్‌ప్రిస్టాన్, మిసోప్రాస్టల్ అనే రెండు రకాల మాత్రలను కలిపి తీసుకుంటారు. దీన్ని మెడికల్ అబార్షన్ అంటారు.

    అయితే, మిసోప్రాస్టల్‌ అబార్షన్ కోసం కనిపెట్టిన ఔషధం కాదు.

  4. ఏటీఎస్ కస్టడీలోకి వెళ్లిన తరువాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన తీస్తా సీతల్వాడ్

    సామాజిక హక్కుల ఉద్యమకారిణి తీస్తా సీతల్వాడ్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అదుపులోకి తీసుకున్న తరువాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.

    "నాకు వైద్య పరీక్షలు చేయించారు. నా చేతిపై పెద్ద నీలం రంగు మచ్చ వచ్చింది. ఏటీఎస్‌ చేసింది ఇదే. ఇప్పుడు నన్ను మేజిస్ట్రేట్‌ కోర్టుకు తీసుకెళ్తున్నారు" అని చెప్పారు.

    ఫోర్జరీ, కుట్ర తదితర సెక్షన్ల కింద సెతల్వాద్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తీస్తాకు చెందిన ఎన్జీవోపై కూడా విచారణ జరుపుతున్నారు.

    జాకియా జాఫ్రీ చట్టంతో పోరాడుతున్నప్పుడు తీస్తా ఎన్జీవో ఆమెకు మద్దతిచ్చింది. గుజరాత్ అల్లర్లలో జాఫ్రీ భర్త అహ్సన్ జాఫ్రీ మరణించారు.

    శనివారం తీస్తాను ముంబైలోని ఆమె ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, విచారణ నిమిత్తం అహ్మదాబాద్‌కు తరలించారు.

  5. ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

  6. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం

    ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది.

    వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రం రెడ్డి గెలుపొందారు.

    విక్రమ్ రెడ్డికి 1,02,074 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 19,332 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ఓబులేసుకు 4,897 ఓట్లు, నోటాకు 4,197 ఓట్లు వచ్చాయి.

  7. ఉప ఎన్నికలు: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, ఆజంగఢ్‌లలో ఎస్పీ, దిల్లీలో ఆప్ ఆధిక్యం

    మూడు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

    మొదటి రెండు గంటల ఓట్ల లెక్కింపులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, ఆజంగఢ్ స్థానాల్లో ముందంజలో ఉంది.

    పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ స్థానంలో శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) అధినేత సిమ్రంజిత్ సింగ్ మాన్ ముందంజలో ఉన్నారు.

    దిల్లీలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దుర్గేష్ పాఠక్, బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై ఆధిక్యంలో ఉన్నారు.

  8. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ ఆదివారం వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

    హెలికాప్టర్‌ను పక్షి ఢీకొనడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

    సీఎం క్షేమంగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర విమానంలో ఆయన లఖ్‌నవూ చేరుకుంటారు.

    వారణాసి కలెక్టర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.. సీఎం, ఆయన సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపారు.

    శనివారం నుంచి యోగి వారణాసిలో పర్యటిస్తున్నారు.

  9. జీ-7 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీ చేరుకున్నారు.

    జర్మనీలోని భారతీయ సమాజం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికింది. అక్కడి భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

    జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు జూన్ 26, 27 తేదీల్లో జరగనున్న జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు.

    జీ-7కు అధ్యక్షత వహించిన జర్మనీ ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తోంది.

    పర్యటనకు ముందు మోదీ విడుదల చేసిన ఒక ప్రకటనలో "జీ-7 సదస్సులో పర్యావరణం, ఇంధనం, వాతావరణం, ఆహార భద్రత, ఆరోగ్యం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, జెండర్ సమానత్వం, ప్రజాస్వామ్యం మొదలైన అంశాల గురించి జీ-7 కౌంటీలు, జీ-7 భాగస్వామ్య దేశాలు, అతిధులుగా వచ్చే అంతర్జాతీయ సంస్థలతో చర్చిస్తామని" తెలిపారు.

  10. ఆత్మకూరు ఉప ఎన్నిక: 12వ రౌండ్ తరువాత 50 వేల ఆధిక్యంలో ఉన్న వైసీపీ

    ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో 12వ రౌండ్ ఫలితాలు ఇవీ..

    మేకపాటి విక్రమ్ రెడ్డి (YCP) - 61,829

    భరత్ కుమార్ (BJP) - 11,175

    ఓబులేసు (BSP) - 3,405

    నోటా - 2,598

    వైసీపీ 50 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.

  11. పదవ రౌండ్ ముగిసే సమయానికి 42 వేల ఓట్ల ఆధిక్యంలో మేకపాటి విక్రమ్ రెడ్డి

    ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో పదవ రౌండ్ తరువాత మేకపాటి విక్రమ్ రెడ్డి 42704 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    విక్రమ్ రెడ్డికి 51835 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 9131 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ఓబులేసుకు 2741 ఓట్లు, నోటాకు 2202 ఓట్లు వచ్చాయి.

  12. అంతర్జాతీయ టీ20ల్లో మిథాలీ రాజ్ రికార్డును బద్దలుగొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్

    అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ రికార్డును హర్మన్‌ప్రీత్ కౌర్ బద్దలుకొట్టింది.

    భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇక్కడికి చేరుకుంది.

    ఈ సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ జూన్ 25న జరిగింది.

    దీనితో, హర్మన్‌ప్రీత్ అత్యధికంగా 2372 పరుగులు చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.

    అంతకు ముందు, మిథాలీ రాజ్ 2364 పరుగులు చేసి టాపర్‌గా నిలిచింది. ఆమె ఈ ఏడాది జూన్ 8న అంతర్జాతీయ క్రికెట్‌కు నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది.

    హర్మన్‌ప్రీత్ 123 మ్యాచ్‌ల్లో 27 సగటుతో 2372 పరుగులు చేసింది. వీటిల్లో ఒక సెంచరీ, ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి.

  13. ఎనిమిదవ రౌండ్ తరువాత 32 వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్న వైసీపీ

    ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ ఎనిమిదవ రౌండ్ ముగిసే సమయానికి ఎవరెవరు ఎన్ని ఓట్లు గెలుచుకున్నారంటే..

    వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 40377

    బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ : 7485

    బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు :1963

    నోటా : 1693

    ఎనిమిదవ రౌండ్ తరువాత వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై 32892 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  14. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ఫ్రాన్స్ పర్యటన

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్రాన్స్‌లో చదువుతున్న తన పెద్ద కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని సీఎంవో తెలియజేసింది.

    సీఎం జగన్‌ జూన్ 28 రాత్రి బయలుదరి, 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలో పాల్గొన్న తరువాత, జులై 2న తిరుగు ప్రయాణం అవుతారు.

  15. అయిదో రౌండ్ తరువాత వైసీపీ అభ్యర్థికి 21 వేల ఓట్ల ఆధిక్యం

    నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అయిదో రౌండ్ తరువాత వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 21,245 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    ఇక్కడ బీజేపీ నుంచి భరత్ కుమార్, బీఎస్పీ నుంచి ఓబులేసు పోటీలో ఉన్నారు.

    అయిదో రౌండ్ తరువాత భరత్ కుమార్‌కు 4,905 ఓట్లు రాగా నోటాకు 1,186 ఓట్లు పడ్డాయి.

  16. మూడు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడే

    మూడు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి.

    అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముఖ్యమైన అభ్యర్థుల్లో త్రిపుర సీఎం మాణిక్ సాహా ఒకరు.

    ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, అజంగఢ్, పంజాబ్‌లోని సంగ్రూర్‌లకు లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగాయి. అలాగే, దిల్లీలోని రాజేంద్ర నగర్, ఝార్ఖండ్‌లో మందర్ సహ అయిదు రాష్ట్రాల్లో, దిల్లీలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ఉప ఎన్నికలు జరిగాయి.

    ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి.

    అదే విధంగా, అవినీతి కేసులో ఎమ్మెల్యే బంధు టిర్కీ దోషిగా తేలడంతో ఝార్ఖండ్‌లో ఎన్నికలు జరిగాయి.

    పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ స్థానానికి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్‌చార్జి గుర్మైల్ సింగ్‌ను రంగంలోకి దించింది.

  17. ఆత్మకూరు ఉప ఎన్నిక: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు అక్కడి ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజ్‌లో లెక్కింపు మొదలైంది.

    ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మికంగా మరణించడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది.

    జూన్ 23న ఇక్కడ పోలింగ్ జరిగింది. 64.26 శాతం ఓటింగ్ నమోదైంది.

    ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 20 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.

  18. మహారాష్ట్ర సంక్షోభం: అనర్హత నోటీసులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు