You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మహారాష్ట్ర సంక్షోభం: అనర్హత నోటీసులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు

శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే అనర్హత నోటీసులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులను జారీ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని షిండే సుప్రీం కోర్టును కోరారు

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య, పసునూరు శ్రీధర్ బాబు

  1. జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?

  2. బుల్డోజర్ పాలిటిక్స్: యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ దాడులపై ప్రజలు ఏమంటున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  3. లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    ధన్యవాదాలు.

  4. అనంతపురం: 'మా అమ్మే నన్ను నమ్మించి మోసం చేసింది... నా భర్తను చంపించింది'

  5. తీస్తా సెతల్వాద్‌కు జూలై 2 వరకు రిమాండ్

    ముంబయికి చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు కోర్టు జూలై 2 వరకు రిమాండ్ విధించిందని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ చుడాసమాను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    ‘‘ఆదివారం తీస్తా సెతల్వాద్‌తో పాటు మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌ను కోర్టులో హాజరు పరిచాం. వారికి జూలై 2 వరకు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ సమయంలో పలు అంశాలపై వారిని విచారిస్తాం’’ అని ఏసీపీ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

  6. అడవుల్ని వదిలి సాగరతీరం బాట పట్టిన మృగరాజులు

  7. విశాఖ సమీపంలో గోల్కొండ నవాబుల గ్రామం 'షేర్ మహమ్మద్ పురం'... బొబ్బిలి సంస్థానానికీ ఈ ఊరికీ ఏమిటి సంబంధం?

  8. బ్రేకింగ్ న్యూస్, మహారాష్ట్ర సంక్షోభం: సుప్రీం కోర్టును ఆశ్రయించిన శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు

    శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే అనర్హత నోటీసులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులను జారీ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని షిండే సుప్రీం కోర్టును కోరారు.

    అలాగే, శిసేన లెజిస్లేటివ్ లీడర్‌గా తన స్థానంలో అజయ్ చౌధరిని నియమించడాన్ని కూడా ఆయన సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు.

    ఇదిలా ఉంటే, ఏక్‌నాథ్ శిబిరంలోని ఎమ్మెల్యేల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    పరిస్థితిని చక్కబెట్టడానికి అవసరమైతే కేంద్ర భద్రతా బలగాలని సిద్ధంగా ఉంచాలని ఆయన అజయ్ భల్లాను కోరారు.

  9. మహారాష్ట్ర సంక్షోభం: 'గువాహటికి వెళ్ళిన 40 మంది ఎమ్మెల్యేలు జీవచ్ఛవాలు' -శివసేన నేత సంజత్ రౌత్

    "గువాహటిలో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు జీవచ్ఛవాలు. వారి ఆత్మలు చచ్చిపోయాయి. వారి శరీరాలను పోస్ట్ మార్టం కోసం అసెంబ్లీకి పంపిస్తారు" అని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు.

    అంతేకాదు, తాము రాజేసిన నిప్పుతో ఏం జరుగుతుందన్నది ఆ ఎమ్మెల్యేలకు తెలుసని కూడా ఆయన వ్యాఖ్యానించారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    మహారాష్ట్ర పరిణామాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మాట్లాడుతూ, ‘ఏక్‌నాథ్ షిండే, మరికొంద మంది ఎమ్మెల్యేలు కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. మేం మాత్రం గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంకీర్ణానికే మద్దతు ఇస్తున్నాం. చివరి నిమిషం వరకూ మా సపోర్ట్ ఉద్ధవ్ ఠాక్రేకే’ అని అన్నారు.

    ఈ రెండున్నరేళ్ళుగా లేని సమస్య ఆ ఎమ్మెల్యేలకు ఇప్పుడెందుకు వచ్చిందని, వారు ఇప్పుడు కేవలం సాకుల కోసం వెతుకుతున్నారని కూడా శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

    మరోవైపు, మహారాష్ట్ర విషయంలో జోక్యం చేసుకోవాలని ఏక్‌నాథ్ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

    ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు, అవిశ్వాస తీర్మానానికి అనుమతించకపోవడం, లెజిస్లేటివ్ పార్టీ నేత ఎన్నిక వంటి అంశాలపై కోర్టు న్యాయం చేయాలని ఈ వర్గం కోరింది.

  10. బ్రేకింగ్ న్యూస్, యూపీ; 'రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకం' - మోదీ

    ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.

    “కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు భారీయెత్తున తెలుపుతున్న ఆమోదానికి సంకేతమే ఈ విజయాలు. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు. అలాగే, ఈ ఎన్నికల్లో విజయానికి ఎంతో కృషి చేసిన పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు” అని మోదీ అన్నారు.

    ఇక, త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జిరిగిన ఉప ఎన్నికల్లో మూడు చోట్ల బీజేపీ గెలిచింది. ముఖ్యమంత్రి మాణిక్ షా కూడా ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.

    త్రిపుర ప్రజలకు కూడా ప్రధాని మోదీ ఈ సందర్బంగా ధన్యావాదాలు తెలిపారు.

  11. జీ7 సదస్సు ప్రారంభానికి ముందు యుక్రెయిన్ రాజధాని కీయెవ్ మీద దాడులు పెంచిన రష్యా

    జీ7 సదస్సు ప్రారంభానికి ముందు యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో రష్యా మరిన్ని క్షిపణులను పేల్చింది. ఆదివారం నాడు జీ7 దేశాలు జర్మనీలో సమావేశమవుతూ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతుండగా, మరో వైపు రష్యా తన దాడుల తీవ్రతను పెంచింది.

    నిజానికి, గత కొన్ని వారాలుగా కీయెవ్ మీద రష్యా ఎలాంటి దాడులు చేయలేదు. జీ7 సదస్సు ప్రారంభమవుతుందనగా అక్కడ రష్యా మళ్లీ బాంబులు పేల్చింది.

    శనివారం నాడు యుక్రెయిన్‌లోని స్వేరో డోనెస్క్ నగరాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు డోన్బాస్‌ నగరాన్ని కాపాడుకోవడం యుక్రెయిన్‌కు పెద్ద సవాలుగా మారింది

    రాయిటర్స్ ఏజెన్సీ వివరాల ప్రకారం ఆదివారం ఉదయం సెంట్రల్ కీయెవ్‌లో నాలుగు పేలుళ్ళు సంభవించాయి. నగరంలోని దక్షిణ ప్రాంతంలో మరో రెండు పేలుళ్లు సంభవించాయి.

  12. యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదన్న ఒవైసీ

    ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీకి బీజేపీని ఓడించే సత్తా లేదన్నారు.

    “ఈ రెండు లోక్‌సభ స్థానాల ఫలితాలను చూస్తుంటే ఎస్పీకి గెలిచే శక్తి కానీ, బీజేపీని ఎదుర్కొనే సత్తా కానీ లేవని తెలుస్తుంది” అని ఒవైసీ అన్నారు.

    ఉత్తరప్రదేశ్ ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ, “అలాంటి పనికిరాని పార్టీల కోసం ముస్లింలు తమ విలువైన ఓటు హక్కును వృథా చేసుకోవద్దు. స్వతంత్ర రాజకీయ గుర్తింపును సృష్టించుకుని, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి” అని అన్నారు.

  13. గుజరాత్ అల్లర్లను NCERT పుస్తకాల నుంచి తొలగిస్తే చరిత్ర మారిపోతుందా?

  14. జీ-7 సదస్సులో మోదీపై ఒత్తిడి ఉంటుందా?

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు బ్రిక్స్ (BRICS) సదస్సులో ఆన్‌లైన్లో పాల్గొన్నారు. ఆ సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉన్నారు.

    ఈరోజు ఆదివారం ప్రధాని మోదీ జీ-7 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్నారు. నిజానికి, భారత్ జీ-7 సభ్య దేశం కాదు. కానీ, నరేంద్ర మోదీ ఈసారి సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్తున్నారు.

    యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో, ప్రపంచ దేశాలన్నీ రాజకీయంగా, దౌత్య పరంగా విభజన రేఖలకు అటూ ఇటూగా నిలిచిన సందర్భంలో ఈ అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి.

    బ్రిక్స్ సదస్సులో షీ జిన్‌పింగ్ ‘దేశాల కూటములను’ విమర్శించారు. ఆయన ఏ దేశం పేరూ చెప్పలేదు. కానీ, క్వాడ్ గురించి, సైనిక కూటమి అయిన నాటో గురించి పరోక్షంగా ప్రస్తావించారు.

    భారత్ నాటోలో లేదు. కానీ, క్వాడ్‌లో చాలా ముఖ్యమైన సభ్యదేశం.

  15. తీస్తా సెతల్వాద్: అహ్మదాబాద్‌కు తరలించిన ఏటీఎస్, అక్కడ ఆమె ఏమన్నారంటే...

  16. రష్యా నుంచి భారత్‌కు రావల్సిన ఆయుధాలు తగ్గిపోతున్నాయా... యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమ దేశాల ఆంక్షలే కారణమా?

  17. Utricularia Furcellata: పశ్చిమ హిమాలయాల్లో కనిపించిన మాంసాహార మొక్క

    ఉత్తరాఖండ్ అటవీ శాఖ పరిశోధన విభాగం చేపట్టిన ఒక పరిశోధనలో అరుదైన 'యుట్రిక్యులేరియా ఫర్సెల్లాట' మొక్కను కనుగొన్నారు.

    ఇది కీటకాలు, పురుగులు తిని జీవించే మొక్క (కార్నివారస్). దీన్ని చమోలీలోని మండల్ లోయలో కనుగొన్నారు.

    పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తొలిసారిగా ఇలాంటి మొక్క కనిపించిందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పరిశోధన) తెలిపారు.

  18. ఉప ఎన్నికలు: త్రిపుర, ఝార్ఖండ్, దిల్లీ, ఏపీలలో ఎవరెవరు ముందంజలో ఉన్నారు?

    త్రిపుర, దిల్లీ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

    మధ్యాహ్నం 1.00 గంట వరకు వచ్చిన ఫలితాల ప్రకారం..

    త్రిపుర: నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. మరొక సీటు తుది ఫలితం వెలువడాల్సి ఉంది.

    దిల్లీ: రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ ఆధిక్యంలో ఉన్నారు.

    ఝార్ఖండ్‌: ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి శిల్పి నేహా ముందంజలో ఉన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌: ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రం రెడ్డి గెలుపొందారు.

  19. ఉప ఎన్నికలు: పంజాబ్‌లోని సంగ్రూర్‌లో వెనుకబడిన ఆమ్ ఆద్మీ పార్టీ

    పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాజీనామాతో చేయడంతో సంగ్రూర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.

    ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడి ఉన్నట్టు తెలుస్తోంది.

    ఈ స్థానం నుంచి శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్)కు చెందిన సిమ్రంజిత్ సింగ్ మాన్ ముందంజలో ఉన్నారు.

    ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ప్రకారం, సిమ్రంజిత్ సింగ్ మాన్, ప్రత్యర్థి గుర్మైల్ సింగ్‌పై అయిదు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

    ఈ ఎన్నికల్లో సంగ్రూర్ నుంచి కాంగ్రెస్‌ తరఫున దల్వీర్‌ సింగ్‌ గోల్డీ, బీజేపీ తరఫున కేవల్‌ సింగ్‌ ధిల్లాన్‌ పోటీ చేశారు.

  20. ఉప ఎన్నికలు: ఉత్తరప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ

    ఉప ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ లోధి, ఆజంగఢ్ నుంచి పోటీ చేసిన దినేష్ లాల్ యాదవ్ (బీజేపీ) ఆధిక్యంలో ఉన్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది.

    ఆజంగఢ్‌లో బీజేపీ 3529 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, రాంపూర్‌లో ఆ పార్టీ 6660 ఓట్ల ఆధిక్యంలో ఉంది.