You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అమెరికాలో పార్టీ చేసుకుంటున్న వారిపైకి కాల్పులు జరిపిన వ్యక్తిని కాల్చిచంపిన మహిళ

అమెరికా వెస్ట్ వర్జీనియాలోని చార్లెస్టన్‌లో ఓ పార్టీకి వచ్చిన వారిపై కాల్పులు జరిపిన వ్యక్తిని ఓ మహిళ కాల్చి చంపారు.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ and శారద మియాపురం

  1. జాస్ బట్లర్ సెంచరీ, 14 ఏళ్ల తర్వాత ఫైనల్లో రాజస్థాన్

    ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో బెంగళూరును ఏడు వికెట్ల తేడాతో ఓడించిన రాజస్థాన్ ఫైనల్ చేరుకుంది.

    చెలరేగిపోయిన ఓపెనర్ జాస్ బట్లర్ 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

    రాజస్థాన్ రాయల్స్ 2008 తర్వాత మొదటిసారి ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఆ సమయంలో షేన్ వార్న్ కెప్టెన్సీలో ఆ జట్టు టోర్నీ మొదటి విజేతగా నిలిచింది.

    టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బెంగళూరును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానంచాడు. బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.

    తర్వాత ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీ, యశస్వి జైశ్వాల్ 21, కెప్టెన్ సంజు శాంసన్ 23 పరుగుల సాయంతో రాజస్థాన్ 19వ ఓవర్లోనే విజయం సాధించింది.

    రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. 59 బంతులకు సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్ సిక్సర్‌తో జట్టుకు విజయం అందించాడు.

  2. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్‌ దంపతులను కలిసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

    ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

    శుక్రవారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో ఉన్న ఏపి గవర్నర్ దంపతులను కలిసిన తమిళిసై వారిని సన్మానించారు.

    ఒడిశాలోని భువనేశ్వర్‌లో టీటీడీ కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ హరిచందన్ అక్కడి నుండి తిరిగివిజయవాడ వెళ్తూ లింక్ విమానం కోసం హైదరాబాద్‌ లాంజ్‌లో ఆగారు.

    ఆ సమయంలో తమిళిసై వారిని కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల గవర్నర్లు పలు అంశాలపై చర్చించారు.

  3. ఇరాన్‌లో కుప్పకూలిన భవనం, 26 మంది మృతి

    వాయువ్య ఇరాన్‌లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కుప్పకూలడంతో 26 మంది చనిపోయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

    అబదన్‌లో నిర్మాణంలో ఉన్న పది అంతస్తుల మెట్రోపాల్ ఆఫీసు కుప్పకూలిన ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు.

    ఈ ఘటనకు సంబంధించిన ఫొటోల్లో కాంక్రీట్ దిమ్మెలు, స్టీల్ రాడ్లు వీధుల్లో పడడంతో చాలా కార్లు ధ్వంసమై ఉండడం కనిపిస్తోంది.

    శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

    ఈ భవనం కుప్పకూలడానికి కారణమేంటో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఈ ఘటనలో పది మందిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. భవనం కూలడంతో ఆగ్రహించిన జనం గురువారం రాత్రి వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు.

  4. యుక్రెయిన్‌కు సాయం బదులు అమెరికాలో స్కూళ్ల రక్షణకు నిధులివ్వండి-డోనల్డ్ ట్రంప్

    టెక్సస్ స్కూల్ కాల్పులు జరిగిన మూడు రోజుల తర్వాత ఆ ఘటనపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందించారు.

    యుక్రెయిన్‌కు సాయం కంటే తమ దేశంలోని స్కూళ్లలో రక్షణ నిధులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

    అమెరికాలో తుపాకీల వాడకానికి అనుకూలంగా హూస్టన్‌లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ నిర్వహించిన ఒక సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    "అమెరికా యుక్రెయిన్‌కు వందలకోట్ల డాలర్లు పంపించినప్పుడు, మన దేశంలో మన పిల్లలు సురక్షితంగా ఉండడానికి ఉండడానికి మనం ఏమైనా చేయగలం" అన్నారు.

    ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో మనం వేల కోట్లు ఖర్చు చేసినా దానివల్ల ఏమీ సాధించలేదని ట్రంప్ అన్నారు.

    మిగతా ప్రపంచాన్ని నిర్మించడానకింటే ముందు, అమెరికా దేశంలోని పిల్లలకు సురక్షితమైన స్కూళ్లను నిర్మించాలన్నారు.