You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘మొఘల్ పాలకుల భార్యలు ఎవరు?’’ – అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు
‘‘మొఘల్స్కు భారత్లోని ముస్లింలతో సంబంధం లేదు. మరి మొఘల్ పాలకుల భార్యలు ఎవరో మీరే చెప్పండి’’అని ఆయన ప్రశ్నించారు.
లైవ్ కవరేజీ
శారద మియాపురం
IPL: నేడు గుజరాత్, రాజస్థాన్ మధ్య తొలి క్వాలిఫయర్... ఆ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చూడాల్సిందే...
ఐపీఎల్ తుది అంకానికి చేరింది. నేటి నుంచి కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్లు జరగనున్నాయి.
ప్లేఆఫ్స్లో భాగంగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్లో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ జట్టు అరంగేట్ర జట్టు గుజరాత్ లయన్స్తో ఆడనుంది.
ఈ మ్యాచ్లో గెలుపొందిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 ద్వారా ఇంకో అవకాశం దక్కుతుంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల తరఫున అధిక పరుగులు చేసిన టాప్-3 ప్లేయర్లు గురించి తెలుసుకుందాం.
రాజస్తాన్ రాయల్స్
జాస్ బట్లర్
ఇంగ్లండ్కు చెందిన ఈ బ్యాట్స్మన్ రాజస్థాన్ రాయల్స్ తరఫునే కాకుండా ఈ సీజన్ ఐపీఎల్లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 14 ఇన్నింగ్స్లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 3 అర్ధసెంచీలు ఉన్నాయి. ఈ సీజన్లో అతని అత్యుత్తమ స్కోరు 116 పరుగులు.
సంజూ శామ్సన్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శామ్సన్. అతను 14 ఇన్నింగ్స్లో 374 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 2 అర్ధసెంచరీలు సాధించిన శామ్సన్ అత్యుత్తమ స్కోరు 55 పరుగులు.
దేవదత్ పడిక్కల్
ఓపెనర్ జాస్ బట్లర్తో కలిసి జట్టుకు కీలక భాగస్వామ్యాలు అందించిన దేవదత్ పడిక్కల్ 14 మ్యాచ్ల్లో 337 పరుగులు సాధించాడు. ఒక అర్ధసెంచరీ చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 54.
గుజరాత్ టైటాన్స్
హార్దిక్ పాండ్యా
అరంగేట్ర సీజన్లోనే అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ తరఫున కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్గా నిలిచాడు. పాండ్యా 13 మ్యాచ్ల్లో 413 పరుగులు సాధించాడు. నాలుగు అర్ధసెంచరీలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అత్యధిక స్కోరు 87 నాటౌట్.
శుబ్మన్ గిల్
గుజరాత్ తరఫున ఆకట్టుకున్న మరో బ్యాట్స్మన్ శుబ్మన్ గిల్. అతను 14 మ్యాచ్ల్లో 4 అర్ధసెంచరీల సహాయంతో 403 పరుగులు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 96 పరుగులు.
డేవిడ్ మిల్లర్
దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్, గుజరాత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్మన్. అతను 14 మ్యాచ్ల్లో 381 పరుగులు స్కోర్ చేశాడు. ఒకే అర్ధసెంచరీ సాధించాడు. అతని అత్యధిక స్కోర్ 94 పరుగులు.
కర్ణాటక: ‘హిందువులు, క్రిస్టియన్లు కూడా బీఫ్ తింటారు’- కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య
కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య సోమవారం తుమకూరులో మాట్లాడుతూ బీఫ్ మాంసాన్ని కేవలం ఒకే వర్గానికి చెందిన వారు తినట్లేదని అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
‘‘ఒక వర్గానికి చెందిన ప్రజలే బీఫ్ తినట్లేదు. హిందువులు, క్రిస్టియన్లు కూడా దీన్ని తింటారు. బీఫ్ తినొద్దని చెప్పడానికి మీరెవరు? అని నేను ఒకసారి అసెంబ్లీలో అన్నాను’’ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ తెలిపింది.
భారత పురావస్తు శాఖ: ‘కుతుబ్ మినార్పై ఎవరికీ హక్కు ఉండదు’
కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోని ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి సాకేత్ కోర్టులో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అఫిడవిట్ను దాఖలు చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఆలయాల పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన మధ్యంతర దరఖాస్తుపై ఏఎస్ఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కుతుబ్ మినార్ ఒక స్మారక చిహ్నం అని, అలాంటి నిర్మాణంపై ఎవరికీ హక్కు ఉండదని, ఎలాంటి పూజలకు ఇక్కడ అనుమతి ఉండదని ఏఎస్ఐ అఫిడవిట్లో తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
దిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న కుతుబ్ మినార్, కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు భారతదేశంలో ముస్లింలు నిర్మించిన తొలి కట్టడాల్లో ఒకటి.
కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు నిజానికి ఒక హిందూ దేవాలయమని, అక్కడ పూజలు చేసుకోవడానికి హిందువులను అనుమతించాలని కొన్ని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై కోర్టులో దావా కూడా వేశాయి.
కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా? తెలుసుకోవడానికి ఈ లింక్ను క్లిక్ చేయండి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు
జపాన్లో మంగళవారం క్వాడ్ నేతల సదస్సు అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశం అయ్యారు.
ఈ ఇరువురు నేతల మధ్య ఏప్రిల్ 11న వర్చువల్ పద్ధతిలో జరిగిన సమావేశానికి దీన్ని కొనసాగింపుగా భావిస్తున్నారు.
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతో పాటు 2021 సెప్టెంబర్లో బైడెన్తో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలోని అంశాల పురోగతిని ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రపంచవ్యాప్త పరిణామాల గురించి వారి అభిప్రాయాలను పంచుకోనున్నారు.
పామాయిల్ కంపెనీలు లక్షలాది నిరుపేద గిరిజనులను ఎలా దోచుకుంటున్నాయో తెలుసా? - బీబీసీ పరిశోధన
మీరు సూపర్ మార్కెట్లో ఏవైనా వస్తువులు కొంటే వాటిలో కొన్ని ఉత్పత్తులలో పామాయిల్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ పామాయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే ఆ లింక్ ఇండోనేషియాలోని ఆయిల్ పామ్ తోటల దగ్గర తేలుతుంది.
కానీ, ఇక్కడ ఈ ఆయిల్ పామ్ గింజల నుంచి తీసిన నూనెను మార్కెటింగ్ చేసే జాన్సన్ అండ్ జాన్సన్, కెల్లాగ్స్, మోండెల్జ్ వంటి సంస్థలకు విక్రయించడం ద్వారా ఇండోనేషియాలోని స్థానిక తెగల ప్రజలు మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నష్టపోతున్నారని బీబీసీ పరిశోధనలో తెలింది.
పామాయిల్ కంపెనీలు లక్షల మంది నిరుపేద గిరిజనులను ఎలా దోచుకుంటున్నాయో ఈ లింక్ను క్లిక్ చేసి తెలుసుకోండి.
మోదీ జపాన్ పర్యటన: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది... ఎప్పటికి పూర్తవుతుంది?
భారతదేశంలో జపాన్ ప్రస్తావన రాగానే బుల్లెట్ ట్రైన్ గుర్తుకు వస్తుంది. కారణం, జపాన్ సహకారంతో భారత్లో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్కు అంకురార్పణ జరిగింది.
భారత ప్రజల బుల్లెట్ రైలు కలను సాకారం దిశగా అడుగులు వేయించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత్, జపాన్ ప్రధానమంత్రులు ఇద్దరూ పాల్గొన్నారు.
అదే ఏడాది రైల్వే శాఖ బుల్లెట్ ట్రైన్ గురించి పెద్ద ప్రకటన చేసింది. "ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు పనులను ఆగస్ట్ 15, 2022 నాటికి పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ప్రకటించింది. అయితే, 2023 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని 2017లో నీతి ఆయోగ్ చెప్పింది.
అయితే, ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది.. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలుసుకోవడానికి ఈ లింక్పై క్లిక్ చేయండి
ఫ్రెంచ్ ఓపెన్: రెండో రౌండ్కు నోవాక్ జొకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్వన్ క్రీడాకారుడు, డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశాడు.
సోమవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో జొకోవిచ్ 6-3, 6-1, 6-0తో నిషియోకా (జపాన్)పై అలవోకగా గెలుపొందాడు.
మరో తొలిరౌండ్ మ్యాచ్లో రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6-2, 6-2, 6-2తో జోర్డాన్ థామ్సన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు.
నాదల్ రెండో రౌండ్లో కొరాంటిన్ మౌటెట్ (ఫ్రెంచ్) తలపడతాడు. ఈ మ్యాచ్లో గెలుపొందితే నాదల్ కెరీర్లో ఇది 300వ గ్రాండ్స్లామ్ మ్యాచ్ విజయం అవుతుంది.
జెలియన్స్కీ: ‘యుద్ధం ముగించడానికి కేవలం పుతిన్తోనే చర్చిస్తా’
యుద్ధం ముగించే అంశంపై కేవలం రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియన్స్కీ అన్నారు.
దావోస్లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో జెలియన్స్కీ వర్చువల్గా మాట్లాడారు.
‘‘రష్యా అధ్యక్షుడే ప్రతీ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆయన లేకుండా మనం యుద్ధం ముగించడం గురించి మాట్లాడుకుంటే, అది ఎటూ తేలదు. దీని గురించి నేను స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తోనే చర్చించాలి అనుకుంటున్నా. రష్యాకు చెందిన మిగతా ఏ అధికారితోనూ దీని గురించి మాట్లాడను. చర్చించే అంశం యుద్ధం గురించి అయినప్పుడు పుతిన్తో కాకుండా మిగతా వారితో మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని అన్నారు.
గత వారం జెలియన్స్కీ ఒక యుక్రెయిన్ టీవీ చానల్తో మాట్లాడుతూ దౌత్యం లేకుండా యుద్ధాన్ని ఆపడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.
నరేంద్ర మోదీ: ‘క్వాడ్ అతి తక్కువ సమయంలోనే కీలక కూటమిగా ఎదిగింది’
జపాన్లో క్వాడ్ దేశాల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ... అతి తక్కువ సమయంలోనే క్వాడ్ కూటమి తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు.
ప్రారంభ ఉపన్యాసం సందర్భంగా మాట్లాడుతూ... ‘‘అతి తక్కువ సమయంలోనే క్వాడ్ కూటమి, ప్రపంచ వేదికపై ఒక కీలక స్థానాన్ని ఏర్పరచుకుంది. నేడు క్వాడ్ గ్రూపు పరిధి విస్తృతంగా ఉంది. అది ప్రభావవంతంగా ఉంది. కూటమిలోని దేశాల పరస్పర నమ్మకం, సంకల్పంప్రజాస్వామ్య శక్తులకు కొత్త బలాన్ని, శక్తి, ఉత్సాహాన్ని ఇస్తుంది. క్వాడ్ స్థాయిలో మా పరస్పర సహకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, సంఘటితంగా ఉండేలా ప్రోత్సహిస్తోంది. ఇదే మా ఉమ్మడి లక్ష్యం’’ అని చెప్పారు.
క్వాడ్ అనేది అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ దేశాల కూటమి.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.