వైసీపీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ మృతి.. అనంతబాబుపై తల్లిదండ్రుల అనుమానం
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ కారు డ్రైవర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందటం వివాదాస్పదమవుతోంది. ఈ ఉదంతంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) పాత్రపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం గురువారం మరణించారు. ఎమ్మెల్సీ తన కారులోనే మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం ఇంటికి తీసుకొచ్చినట్టు మృతుడి బంధువులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి, కారు అక్కడే వదిలి, మరో కారులో వెళ్లిపోయారని చెబుతున్నారు.
ఎమ్మెల్సీ కథనం అనుమానస్పదంగా ఉందని, అనంతబాబు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కాకినాడలోని సంజీవిని ఆస్పత్రి వద్ద అనంతబాబుకి వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. అనంతబాబు స్వయంగా కారులో మృతదేహాన్ని తరలించినట్టు సీసీ కెమెరాలో విజువల్స్ ఉన్నాయని, హత్య కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
గతంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా పనిచేసిన అనంతబాబు ఆరు నెలల క్రితం ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయనపై హత్యారోపణలు రావడం చర్చనీయాంశం అవుతోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాకినాడ జిల్లా పోలీసులు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. ప్రమాదానికి గురయిన కారు అనంతబాబుది కాదని, విజయ్ అనే అభిమానిదని రంపచోడవరం వైసీపీ నాయకుడు రాయపల్లి సత్యన్నారాయణ చెప్పారు. ‘‘డ్రైవర్ సుబ్బు అంటే బాబుకి చాలా అభిమానం. మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అనంతబాబు ఏ తప్పు చేయలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.