దిల్లీలోని జహంగీర్పురిలో కూల్చివేతలపై నేడు సుప్రీం కోర్టులో విచారణ
ప్రారంభమైంది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఈ
కేసును విచారిస్తోంది.
దిల్లీలో 1,731 అక్రమ కట్టడాలు ఉంటే ఒక మతానికి చెందిన వారి నిర్మాణాలను
మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది దుశ్వంత్ దవే
కోర్టుకు తెలిపారు.
మరొకవైపు నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్
జనరల్ తుషార్ మెహతా, కూల్చివేతకు ముందు నోటీసులు ఇవ్వాలంటూ నిబంధనలు ఏమీ లేవని
కోర్టుకు విన్నవించారు.
ఇటీవల దిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్పురీలో మత కలహాలు చోటు
చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పాలనలోని నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్తో
జహంగీర్పురీలోని కొన్ని నిర్మాణాలను కూల్చి వేయడం ప్రారంభించింది.
దీని మీద నిన్న సుప్రీం కోర్టులో పిటీషన్ వేయగా కూల్చి వేతను ఆపుతూ తాము
విచారణ పూర్తి చేసే వరకు యథాతథ స్థితిని పాటించాలంటూ ఆదేశించింది.
అక్రమ నిర్మాణాలను తాము కూల్చి వేస్తున్నామంటూ నార్త్ దిల్లీ మున్సిపల్
కార్పొరేషన్ చెబుతుండగా ఒక వర్గం వారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ బాధితులు
ఆరోపిస్తున్నారు.