ఈనాటి ముఖ్య పరిణామాలు...
విద్యుత్ వాహనాల తయారీలో ఏ కంపెనీ అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే భారీ జరిమానా విధించటం, లోపభూయిష్టమైన వాహనాలన్నిటినీ రీకాల్ చేయాలని ఆదేశించటం జరుగుతుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
మంగోలియాలోని ఉలాన్బాటర్లో జరుగుతున్న ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్ 2022 పోటీల్లో భారత క్రీడాకారిణిలు సరితా మోర్, సుష్మా షోకీన్లు తమ మహిళల ఫ్రీస్టైల్ వెయిట్ కేటగిరీల్లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
వారం రోజుల కిందట యుక్రెయిన్కు 80 కోట్ల డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తాజాగా మరో 80 కోట్ల డాలర్ల రక్షణ సాయం ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు.
భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గురువారం నాడు గుజరాత్ రాజధాని గాంధీనగర్లోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు.
హైతీలో ఓ చిన్న విమానం రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్లో ఒక ప్రధాన రహదారి మీద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు.
అఫ్గానిస్తాన్లో మజారే షరీఫ్, కుందూజ్ నగరాల్లో జరిగిన వేర్వేరు పేలుళ్లలో 15 మంది చనిపోగా మరో 40 మంది గాయపడ్డారు.
యుక్రెయిన్లో రష్యా బలగాలు చుట్టుముట్టిన మరియుపూల్ నగరం నుంచి ఈగ కూడా బయటకు రాకుండా దిగ్బంధించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. అజోవస్తాల్ స్టీల్ ప్లాంట్ లోపల గాయపడిన సైనికులు, కొందరు ప్రజలు ఉన్నారని యుక్రెయిన్ చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల నిర్ణయాధికారం ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది.
ఇవీ ఈనాటి ముఖ్యపరిణామాలు. బీబీసీ తెలుగు నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
యుక్రెయిన్ యుద్ధంపై తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలో అవండి.