You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మరియుపోల్లో మా సైనికులు రష్యాకు లొంగేది లేదు: యుక్రెయిన్ ఎంపీ
మార్ఫింగ్ చేసిన ఒక వీడియో వైరల్ కావటంతో ఆదివారం తెల్లవారుజామున హుబ్బళిలో అల్లరిమూకలు హింసకు దిగాయి. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను పేల్చారు.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
దిల్లీ జహాంగీర్పురీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, పోలీసులకు గాయాలు
వాయువ్య దిల్లీలోని జహాంగీర్పురీ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది.
హనుమాన్ జయంతి రోజున నిర్వహించిన యాత్రలో ఈ ఘర్షణలు జరిగాయని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. దాడుల్లో కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు పేర్కొంది.
కొన్నిచోట్ల ఆందోళనకారులు రాళ్లు రువ్వారని, వాహనాలకు కూడా నిప్పు పెట్టారని పోలీసులు వెల్లడించారు.
పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. దిల్లీ పోలీసు విభాగానికి సూచించారు.
పూర్తి కథనం చదవండి: హనుమాన్ జయంతి: దిల్లీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు
నేను ఏం నేరం చేశాను?: కరాచీ ర్యాలీలో ఇమ్రాన్ఖాన్
పాకిస్తాన్లో తన ప్రభుత్వాన్ని కూల్చివేయటం కుట్రనా? లేక జోక్యమా? అని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ తన మద్దతుదారులను ప్రశ్నించారని ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.
ఈ మాటల ద్వారా ‘విదేశీ కుట్ర’, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇటీవలి వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
ఇమ్రాన్ శనివారం రాత్రి కారాచీలో భారీ సభ నిర్వహించారు. పార్లమెంటును పునరుద్ధరించి, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందన్నారు.
‘‘సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేం అంగీకరించాం. కానీ మా చేతులు కట్టేశారు. ఓటింగ్ ఏ సమయంలో నిర్వహించాలో కూడా చెప్పారు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘నేను ఏం నేరం చేశాను?’’ అని ప్రశ్నించారు. ఈ విషయం కేవలం తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీకి సంబంధించినది మాత్రమే కాదని.. భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు.
‘‘రాజకీయ నాయకుల క్రయవిక్రయాలు జరుగుతుంటే న్యాయవ్యవస్థ దానిని పట్టించుకోవద్దా?’’ అన్నారు.
మరియుపోల్ సైనికులు ఆయుధాలు పడేసి లొంగిపోతే ప్రాణాలతో వదిలేస్తాం: రష్యా ఆఫర్
యుక్రెయిన్లో కీలక రేవు నగరమైన మరియుపోల్లో యుక్రెయిన్ సైనికులు ఆయుధాలను వదిలేసి లొంగిపోయినట్లయితే వారిని ప్రాణాలతో వదిలేస్తామని రష్యా ఆదివారం నాడు సూచించింది.
మరియుపోల్ను తాము దాదాపు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని చెప్తున్న రష్యా.. అక్కడ ఇంకా పోరాడుతున్న యుక్రెయిన్ సైనికులు, విదేశీ కిరాయి సైనికులు.. (రష్యా కాలమానం ప్రకారం) ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒటి గంట లోపు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలంటూ గడువు ఇచ్చింది. అలాచేస్తే వారికి హాని ఉండదని హామీ ఇచ్చింది.
‘‘అలా చేసిన వారిని యుద్ధఖైదీలపై జెనీవా కన్వెన్షన్కు అనుగుణంగా వ్యవహరిస్తాం’’ అని రష్యా చెప్పింది.
ఈ ప్రతిపాదనను పూర్తిగా మానవీయ సూత్రాల మేరకు చేస్తున్నామని పేర్కొన్న రష్యా.. లొంగిపోవటానికి తిరస్కరించిన వారి విషయంలో ఏం జరుగుతుందనేది చెప్పలేదు.
మరియుపోల్లో మిగిలివున్న అతికొద్ది మంది యుక్రెయిన్ సైనికులు అజోవ్స్తాల్ స్టీల్వర్క్స్ అనే చిన్న ప్రాంతంలో ఉన్నారని రష్యా అంటోంది.
దానికి ముందు.. మరియుపోల్లో మిగిలివున్న యుక్రెయిన్ సైనికులను నిర్మూలించినట్లయితే రష్యాతో చర్చల ప్రక్రియ ముగిసిపోతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్స్కీ హెచ్చరించారు.
పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలు తెస్తున్న యుక్రెయిన్ విమానాన్ని కూల్చేశాం: రష్యా
పశ్చిమ దేశాల నుంచి యుక్రెయిన్కు ఆయుధాలు తీసుకొస్తున్న యుక్రెయిన్ సైనిక విమానాన్ని తమ సైనిక బలగాలు పేల్చివేశాయని రష్యా చెప్తోంది.
యుక్రెయిన్లోని ఒడెస్సా నగరం వెలుపల ఈ దాడి జరిగినట్లు రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకోవ్ను ఉటంకిస్తూ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ ఒక కథనంలో పేర్కొంది.
ఈ సమాచారాన్ని బీబీసీ సొంతంగా నిర్ధారించలేదు. రష్యా చెప్తున్న దాడిలో మరణాలు సంభవించాయా అనేది కూడా వెంటనే తెలియరాలేదు.
రష్యా వైమానిక బలగాలు గత 24 గంటల్లో యుక్రెయిన్ సైన్యం, వారి సైనిక సంపత్తి లక్ష్యంగా డజన్ల కొద్దీ ప్రాంతాలపై దాడులు చేశాయని కూడా జనరల్ కొనాషెంకోవ్ చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్తో పాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.