ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్య 10 లక్షలకు పరిమితం: సౌదీ అరేబియా
ఈ ఏడాది హజ్ యాత్రికుల సంఖ్యపై 10 లక్షల పరిమితి విధిస్తున్నట్లు సౌదీ అరేబియా శనివారం తెలిపింది.
స్వదేశీ యాత్రికులైనా, విదేశీ యాత్రికులైనా.. కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిగా తీసుకున్న వాళ్లు, 65 సంవత్సరాల లోపు ముస్లింలు ఈ ఏడాది హజ్ యాత్ర చేయవచ్చునని సౌదీ అరేబియా నిబంధనలు వెల్లడించిందని అల్ జజీరా చానల్ తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.
గత ఏడాది కోవిడ్ మహమ్మారి కారణంగా స్వదేశీయులు కొన్ని వేల మంది మాత్రమే హజ్ యాత్ర చేయగలిగారు.
విదేశాల నుంచి వచ్చే హజ్ యాత్రికులు తప్పనిసరిగా కోవిడ్-19 పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని, దీనితోపాటు అదనపు ఆరోగ్య జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుందని హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.
హజ్ యాత్ర అనేది ఇస్లాం ఐదు మూల స్తంభాల్లో ఒకటి. సత్తువ గల ముస్లింలందరూ జీవితంలో ఒక్కసారైనా ఈ చేయాలన్నది మతపరమైన విధి. ఈ ఏడాది జూలై నెలలో హజ్ యాత్ర జరుగుతుంది.
కోవిడ్ మహమ్మారికి ముందు హజ్ యాత్రకు ప్రతి ఏటా దాదాపు 25 లక్షల మంది వస్తుండేవారు.