ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ 2014లో
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఆ కేసులో
కదలిక వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లోపభూయిష్టంగా ఉందని, ఆ
చట్టాన్ని రద్దు చేయాలంటూ అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును
కోరారు.
నాడు జస్టిస్ హెచ్ఎల్ దత్తుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అప్పట్లో
కేంద్రానికి నోటీసులు కూడా ఇచ్చింది.
2019లో తిరిగి ఈ కేసులో విజ్ఞప్తిని మార్చుతూ ఉండవల్లి
అరుణ్కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
రెండు రాష్ట్రాలు ఏర్పడి రెండు సార్లు ఎన్నికలు జరిగిన
ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కొనసాగుతున్నందున పునర్విభజన చట్టాన్ని
కొట్టివేయాలని చేసిన విజ్ఞప్తిని ఉండవల్లి ఉపసంహరించుకున్నారు.
భవిష్యత్తులో రాష్ట్రాల విభజనకు కేంద్రానికి స్పష్టమైన
మార్గదర్శకాలు ఇవ్వాలని, విభజిత ఆంధ్రప్రదేశ్కు ఆర్థికంగా సాయం చేసేలా కేంద్రాన్ని
ఆదేశించాలని కొత్త విజ్ఞప్తి చేశారు.
కానీ నాటి నుంచి నేటి వరకు సుమారు 7-8 ఏళ్లుగా ఈ కేసులో ఎలాంటి
పురోగతి లేదు.
ఉండవల్లి అరుణ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్
భూషణ్ ఈ కేసులో శుక్రవారం సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం
ముందు కేసు ప్రస్తావనకు రాగా ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ పాత విజ్ఞప్తిని
వెనక్కి తీసుకున్న నేపథ్యంలో కొత్త విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
దీని మీద జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు
జారీ చేస్తూ కేసును తదుపరి విచారణకు వాయిదా వేసిందని సుప్రీం కోర్టు న్యాయవాది అల్లంకి
రమేశ్ బీబీసీకి తెలిపారు.